కోవిడ్ -19 షాక్: ఎంత చేసినా... 34 కోట్ల ఉద్యోగాలు పోతాయి! ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజషన్ అంచనా
కరోనా వైరస్ తెచ్చిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. చైనా లో పుట్టిన ఈ మాయదారి మహమ్మారి... ప్రపంచాన్ని మొత్తం చుట్టేసి అనకొండ లా మింగేస్తోంది. 700 కోట్ల ప్రపంచ జనాభా ను వణికిస్తోంది. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజషన్ (ఐఎల్ఓ) తాజా నివేదికను పరిశీలిస్తే ఈ ఆందోళన మరింత పెరుగుతుందే కానీ తగ్గేలా లేదు. ఎవరెన్ని చేసినా ... ఎంత మంచి విధానాలు అమలు చేసినా ప్రపంచం మొత్తం మీద కనీసం పదో వంతు కంటే అధిక పని గంటలు నష్టపోక తప్పదని, దాంతో 34 కోట్ల ఉద్యోగాలకు ముప్పు పొంచి ఉందని తన 5 వ ఎడిషన్ మానిటరింగ్ రిపోర్ట్ పేర్కొంటోంది.
2020 చివరి నాటికి ఇదే పరిస్థితి కొనసాగుతుందని ఐఎల్ఓ అభిప్రాయపడింది. ప్రపంచ లేబర్ మార్కెట్ ఏ రకంగా చూసినా ఈ ఏడాది మొత్తానికి రికవరీ అయ్యే పరిస్థితి కనిపించటం లేదని, పైగా అనిశ్చితి కొనసాగుతోందని ఈ గ్లోబల్ ఆర్గనైజషన్ వ్యాఖ్యానించింది. దీంతో మరికొన్ని నెలల్లో అంతా చక్కబడుతుందని భావిస్తున్న జనాలకు పెద్ద షాక్ నిచ్చింది.
జూలై 1 నుండి మారిన బ్యాంకు రూల్స్! ఇవి గుర్తుంచుకోండి, జరిమానా ఇలా తప్పించుకోవచ్చు
మూడు నెలల్లో 40 కోట్ల జాబ్స్ ఉఫ్...
ప్రపంచ వ్యాప్తంగా సుమారు 200 దేశాలకు విస్తరించిన కరోనా వైరస్ ... అన్ని దేశాల్లోనూ తన ప్రతాపాన్ని చూపించింది. వాటి ఆర్థిక వ్యవస్థలను చిన్నాభిన్నం చేసింది. మరీ ముఖ్యంగా ఏప్రిల్ నుంచి జూన్ నెల మధ్యలో అమెరికా సహా అభివృద్ధి చెందిన యూరోప్ దేశాల తో పాటు ఇండియా కూడా భారీగా ఈ వైరస్ తో యుద్ధం చేశాయి. కానీ వైరస్ దే పై చేయి అయిపోయింది. దీంతో సరిగ్గా ఈ మూడు నెలల కాలంలోనే ప్రపంచవ్యాప్తంగా 40 కోట్ల ఉద్యోగాలు ఊడిపోయాయి.
దీంతో ప్రపంచాన్ని ఇంతలా ప్రభావితం చేసిన ఒక సందర్భం మరోటి లేదని తేలిపోయింది. 2008 లో వచ్చిన ఆర్థిక మాంద్యం కూడా ప్రపంచంపై ఈ స్థాయి ప్రభావాన్ని చూపలేకపోయింది. కానీ ఒక చిన్న వైరస్ ఆ పని అతి సులభంగా చేసేసింది. అందుకే చైనా మినహా మిగితా దేశాలన్నీ ఈ వైరస్ పేరు చెబితేనే వణికిపోతున్నాయి. ఇంకా ముందు ముందు ఏమి చూడాల్సి ఉంటుందో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
అయినా సరే అంతే...
ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం నుంచి తమ తమ ఆర్థిక వ్యవస్థలను కాపాడుకునేందుకు ఒక్కో దేశం ఒక్కో చర్య తీసుకొంటోంది. కొన్ని దేశాలు అధిక కరెన్సీ ముద్రించి పౌరులకు అనేక పథకాల రూపంలో అందిస్తుండగా... మన దేశంలోనూ రూ 20 లక్షల కోట్ల ప్రయోజనం చేకూరే పథకాలను ఆవిష్కరించారు. ఇంకా కూడా మరిన్ని కొత్త పథకాలు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. అయినా సరే 2020 చివరి నాటికి గ్లోబల్ వర్కింగ్ హౌర్స్ (పని గంటలు) 11.9% మేరకు తగ్గిపోయే ప్రమాదం ఉందని ఐఎల్ఓ పేర్కొంది.
ఇది సరిగ్గా 34 కోట్ల పూర్తి స్థాయి ఉద్యోగాలకు సమానం కావటం గమనార్హం. అంటే ప్రపంచం మొత్తం ఈ ప్రాంత వైరస్ తో యుద్ధం చేయటంతో పాటు మరో 6 నెలల పాటు బతుకుదెరువు కోసం అష్టకష్టాలు పడాల్సిందేనని పరిస్థితులు రుజువు చేస్తున్నాయి. కాబట్టి, ఎంత జాగ్రత్తగా ఉంటె అంత మంచిదని చెప్పకనే చెబుతోంది ఈ గ్లోబల్ రిపోర్ట్.
మహిళా ఉద్యోగులకు గడ్డు కాలం...
కొంత కాలంగా ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగాలు చేసే మహిళల సంఖ్య పెరుగుతూ వస్తోంది. దీంతో కొంత వరకు లింగ భేదాలు తగ్గిపోయాయి. ఆతిథ్య రంగం, ఆహార రంగం, అమ్మకం, తయారీ రంగాల్లో వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. సుమారు 51 కోట్ల మంది మహిళలు ఈ నాలుగు ప్రధాన రంగాల్లో పనిచేస్తున్నారు. వీటిలో పని చేసే మొత్తం ఉద్యోగుల్లో వారి వాటా 40% కంటే అధికం. కానీ, కరోనా వైరస్ దెబ్బకు ఈ అన్ని రంగాలు కుదేలై పోయాయి.
దీంతో కొన్ని దశాబ్దాలుగా కష్టపడి సాధించిన లింగ సమానత్వం కరోనా వైరస్ కారణంగా ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఐఎల్ఓ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ నాలుగు రంగాలు కాకుండా గృహాల్లో పని సేవలు అందించటం, ఆరోగ్య సేవలు, సామజిక సేవలు వంటి రంగాల్లో కూడా మహిళలు అధిక సంఖ్యలో పనిచేస్తున్నారు. కానీ ప్రతి రంగంలోనూ ఇప్పుడు అవకాశాలు తగ్గిపోవటంతో మహిళల ఉద్యోగ భద్రతకు ముప్పు పొంచి ఉందని స్పష్టమవుతోంది.