ఐదేళ్లలో తొలిసారి పడిపోయిన ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ, వాటికే ప్రాధాన్యం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి రోజు రోజుకు క్షీణిస్తోందా? అంటే అవుననే అంటున్నారు. గత నాలుగేళ్లలో డిసెంబర్ నెలాఖరు వరకు రెవెన్యూ ఆదాయం వరుసగా పెరగగా, గత ఏడాది మాత్రం తగ్గినట్లుగా వార్తలు వచ్చాయి. దీనిని బట్టి ఏపీ ఆర్థిక పరిస్థితి సానుకూలంగా లేదని అర్థమవుతోందని అంటున్నారు. ఆదాయం, వ్యయం అయిదేళ్లతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం తగ్గినట్లుగా పేర్కొంటున్నారు.
'ఇదీ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి.. 9 నెలల్లో రూ.40వేల కోట్ల అప్పులు, కొనుగోలుశక్తి తగ్గింది'
గత ఏడాది పడిపోయిన రెవెన్యూ
2015-16 ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ నాటికి రెవెన్యూ ఆదాయం రూ.59 వేల కోట్లు, 2016-17 ఆర్థిక సంవత్సరంలో 66 వేల కోట్లు, 2017-18లో రూ.66వేల కోట్లు, 2018-19లో రూ.83వేల కోట్లు ఉంది. అంటే క్రమంగా ప్రతి ఏటా పెరుగుతూ వచ్చింది. కానీ 2019-20లో మాత్రం రూ.72 వేల కోట్లకు పడిపోయిందని లెక్కలు తీస్తున్నారు.
ఏపీ ఆర్థిక పరిస్థితికి అద్దం పడుతోంది
అంతకుముందు నాలుగేళ్లు రెవెన్యూ ఆదాయం, ఖర్చుల్లో పురోగతి కనిపించింది. కానీ ఈ ఆర్థిక సంవత్సరంలో మాత్రం తగ్గిపోయిందని చెబుతున్నారు. దీర్ఘకాల ప్రయోజనాలు కల్పించే పెట్టుబడి వ్యయంపై ఆర్థిక సంవత్సరంలోని గత తొమ్మిది నెలల్లో రూ.6వేల కోట్లు కూడా వెచ్చించలేదని చెబుతున్నారు. ఏపీ ఆర్థిక పరిస్థితికి ఇదే అద్దం పడుతోందని చెబుతున్నారు.
అంచనాల్లో సగం లేదు..
పన్నులు, కేంద్ర పన్నుల్లో వాటాలు, ఇతర సెస్ వంటి ఆదాయాలు కలిపి డిసెంబర్ నాటికి సాధించింది రూ.72,322 కోట్లుగా ఉంది. కానీ అంచనా మాత్రం రూ.1,78,697 కోట్లుగా ఉంది. అంటే అంచనాల్లో సగం కూడా లేదని గుర్తు చేస్తున్నారు.
అవి కలిసినా..
రుణాల రికవరీ, అప్పులు తదితరాలు కూడా కలిపితే ఆదాయం రూ.1,12,778 కోట్లుగా ఉంది. ఇవన్నీ కలిసిన ఆదాయం అంచనాల్లో సగానికి పైకి మాత్రమే చేరుకున్నాయని చెబుతున్నారు. ఇది ఆందోళన కలిగించే అంశంగా చెబుతున్నారు.
వాటికి ప్రాధాన్యం..
వేతనాలు, పెన్షన్స్, అసలు-వడ్డీ చెల్లింపులతో పాటు సంక్షేమ పథకాలకు వైసీపీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. దీర్ఘకాలిక ప్రయోజనం కల్పించే వాటిపై దృష్టి పెట్టే పరిస్థితి లేని పరిస్థితి అంటున్నారు.