ఇప్పటికే సగం ప్రాజెక్టులు..: అమరావతిపై జగన్ నిర్ణయం! రియల్ ఎస్టేట్ వ్యాపారుల టెన్షన్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ రాజధానిపై శుక్రవారం కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజధాని సహా ఏపీ సమగ్రాభివృద్ధిపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జీఎన్ రావు నేతృత్వంలోని నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికపై చర్చించి, నిర్ణం తీసుకునే అవకాశముంది. మూడు రాజధానులు అని సీఎం జగన్ ప్రకటించారు. విశాఖ పరిపాలనా రాజధాని అని ఎంపీ విజయ సాయి రెడ్డి ప్రకటించారు. అయితే రాజధానిని అమరావతి నుంచి తరలించవద్దని 29 గ్రామాల ప్రజలు ఉద్యమిస్తున్నారు. విపక్షాలు కూడా ప్రభుత్వం నిర్ణయాన్ని తప్పుబడుతున్నాయి. రియాల్టర్లు కూడా దీనిని వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేబినెట్ నిర్ణయంపై అమరావతివాసులు, ఏపీవాసులతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
స్టీల్ ప్లాంట్కు రూ.15వేలకోట్లు: కంపెనీలు రాకపోయినా జగన్ ధైర్యం!
మూడు రాజధానులకు నో...
రియాల్టర్లు, బిల్డర్స్, కన్స్ట్రక్షన్ వర్కర్స్ ప్రతినిధులు మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. అలాగే, రాజధానిని లేదా పరిపాలనా కేంద్రాన్ని అమరావతి నుంచి విశాఖపట్నంకు తరలించాలనే ఆలోచనను తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ మేరకు ఇదివరకే క్రెడాయ్ ప్రతినిధులు దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసారు. మూడు రాజదానులు సరికాదని, అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారానే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని వారు పేర్కొన్నారు. రాజధాని మార్పుపై అమరావతివాసులతో పాటు రియాల్టర్లు కూడా ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే అక్కడ డెవలప్ చేసిన లేదా చేస్తున్న వాటికి డిమాండ్ లేకుండా పోతుంది. ఇప్పటికే వైసీపీ ప్రకటన ద్వారా అమరావతిలో డిమాండ్ తగ్గి, విశాఖకు పెరిగిందని చెబుతున్నారు.
ఆందోళనలపై ముందే హెచ్చరిక
రాజధాని వికేంద్రీకరణ ప్రకటన వల్ల ప్రజలలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని, రాయలసీమ నుంచి పనుల కోసం విశాఖ వెళ్లాలంటే సాధ్యమయ్యే పనికాదని, లోటు బడ్జెట్తో ఏర్పడిన రాష్ట్రంలో ఇటువంటి ప్రయోగాలు మంచిది కాదని కూడా క్రెడాయ్ ప్రతినిధులు ఇదివరకే అన్నారు. జగన్ ప్రకటన వల్ల మూడు ప్రాంతాల్లో ఆందోళనలు చెలరేగే అవకాశముందని ముందే హెచ్చరించారు.
సగం నిర్మాణాలు పూర్తయ్యాయి...
అంతేకాదు, రాజధానిపై జీఎన్ రావు కమిటీ నివేదికకు ముందే ప్రకటన చేశారు. దీనిపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంటే జగన్ తయారు చేసిన రిపోర్టును జీఎన్ రావు నివేదిక పేరుతో తీసుకు వచ్చారని అభిప్రాయపడుతున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణకు తాము సహకరిస్తామని, ఇప్పటికే సగం నిర్మాణాలు పూర్తి చేసుకు్నన అమరావతిని రాజధానిగా ఉంచి వనరులు, వసతులు కల్పించాలని క్రెడాయ్ ప్రతినిధులు కోరారు.
వీరంతా వ్యతిరేకం...
రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (CREDAI)తో పాటు నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సెల్ (NAREDCO), బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (BAI), విజయవాడ నోటిఫైడ్ మున్సిపల్ కార్పోరేషన్ ఇండస్ట్రియల్ ఏరియా సర్వీస్ సొసైటీ (ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ-IALA), బిల్డింగ్ అండ్ కన్స్టక్షన్ వర్కకర్స్ అసోసియేషన్, హోల్ సేల్ మర్చంట్ కూడా దీనిని వ్యతిరేకించాయి. ఇవన్నీ కలిసి జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి నిరసనలు తెలియజేసేందుకు వారం క్రితమే నిర్ణయించాయి.
మరో ప్రభుత్వం మరోసారి మారిస్తే..
గత ప్రభుత్వం రాజధానిగా నిర్ణయించిన అమరావతిని, మార్చడం వంటి నిర్ణయాలు సరికాదని క్రెడాయ్ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. ఇలాంటి ధోరణి సాగితే రేపు ఏర్పడే మరో ప్రభుత్వం మరోచోటుకు తీసుకు వెళ్తుందని, అంతిమంగా ప్రజలు నష్టపోతారని చెబుతున్నారు. రాజధాని మార్పు నిర్ణయం వల్ల రాష్ట్రంపై భారీ బర్డెన్ పడుతుందని చెప్పారు. వేతనాలు కూడా సరిగా చెల్లించలేని పరిస్థితులు ఏర్పడతాయన్నారు.