ఆంధ్రప్రదేశ్ బడ్జెట్: మహిళా సాధికారత, జెండర్ బేస్డ్ బడ్జెట్
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు గురువారం (మే 20)వ తేదీన ప్రారంభమయ్యాయి. కరోనా క్లిష్ట పరిస్థితుల్లో ప్రవేశపెడుతోన్న బడ్జెట్ ఇది. బడ్జెట్ ప్రతిపాదనలపై ఎంతోమంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభం నేపథ్యంలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ విశ్వభూషణ్ హిచందన్ వర్చవల్గా ప్రసంగించారు. ఆయన రాజ్ భవన్ నుండి తన ప్రసంగాన్ని అందించారు. కరోనా బారినపడి విగతజీవులైన వారికి ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
కరోనా తీవ్రత బాగా ఉందని, కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో రాష్ట్రంలో అదనంగా కోవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆరోగ్యశ్రీని కరోనా చికిత్సలో చేర్చినట్లు తెలిపారు. ఆరోగ్యశ్రీకి ప్రయివేటు ఆసుపత్రుల్లో 50 శాతం బెడ్స్ను కేటాయించినట్లు తెలిపారు. ఫ్రంట్ లైన్ వారియర్స్పై ఆయన ప్రశంసలు కురిపించారు. కరోనాతో ఆర్థిక రంగంపై మరోసారి ప్రభావం పడిందని అయినా రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలను ఆపలేదన్నారు.
2020-21లో జాతీయ అభివృద్ధి రేటు నెగిటివ్ ఉండగా, ఆంధ్రప్రదేశ్ 1.58 శాతం అభివృద్ధి రేటు కనబరిచిందని, రాష్ట్రంలో 53.28 లక్షల మందికి కరోనా మొదటి డోస్ ఇచ్చినట్లు చెప్పారు. 21.64 లక్షల మందికి రెండో డోస్ వ్యాక్సినేషన్ పూర్తయ్యిందన్నారు. పరిశ్రమల్లో 75 శాతం మంది స్థానికులకు ఉద్యోగాలు లభించేలా చట్టం చేశామని, ఒక స్కిల్ వర్శిటీతో పాటు 25 మల్టీ స్కిల్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
కాగా, మొదటిసారి జెండర్ ఆధారిత బడ్జెట్ను ప్రవేశ పెట్టనున్నారు. మహిళా సాధికారతకు ప్రాధాన్యమిస్తూ అందుకు తగినట్లు కేటాయింపులు చేసిన జెండర్ బేస్డ్ బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందుకు రానుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలతో పాటు మహిళలకు ప్రత్యేకంగా ఉపప్రణాళికలు పొందుపరిచిన 2021-22 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ను శాసనసభలో ప్రవేశపెట్టబోతున్నారు.
ప్రభుత్వం మార్చి 28వ తేదీన 2021-22 ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలలకు గాను రూ.70,983 కోట్లతో వోట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టింది. కరోనా క్లిష్ట పరిస్థితుల్లో ఈ బడ్జెట్ను ఉపయోగించారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ రూ.2.25 లక్షల కోట్ల నుండి రూ.2.30 లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా. వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వానికి ఇది మూడో బడ్జెట్.