మా సంస్థలో ఉద్యోగం కోసం వారిని పరిగణలోకి తీసుకుంటాం: ఆనంద్ మహీంద్రా
భారత ఆర్మీ ప్రతిపాదించిన టూర్ ఆఫ్ డ్యూటీపై వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ఆసక్తి కనబరిచారు. తమ సంస్థలో ఉద్యోగాల కోసం అభ్యర్థులను ఎంపిక చేసే సమయంలో టూర్ ఆఫ్ డ్యూటీ కింద సేవలు అందించిన వారిని పరిగణలోకి తీసుకుంటామని ఆర్మీకి పంపిన ఈ-మెయిల్లో పేర్కొన్నారు. టూర్ ఆఫ్ డ్యూటీ కింద ఆర్మీలో పని చేయాలనుకున్న సాధారణ ప్రజలకు కూడా అవకాశం కల్పిస్తారు. తొలి దశలో 100 మంది ఆఫీసర్లు, 1000 మంది జవాన్లను తీసుకునే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. దీనిపై మహీంద్రా స్పందించారు.
'మా ఉద్యోగులకు మోడీ ప్రభుత్వం 2నెలల వేతనం ఇస్తుందని భావించాం'
ఉద్యోగాల విషయంలో వారిని పరిగణలోకి తీసుకుంటాం
భారత ఆర్మీ ప్రతిపాదించిన టూర్ ఆఫ్ డ్యూటీ గురించి తాను విన్నానని, మూడేళ్ల కార్యక్రమం కింద భారత యువత సైనికుడిగా, అధికారిగా దేశానికి సేవలు అందించే అవకాశాన్ని పొందవచ్చునని, పని చేసే దగ్గర యువతకు ఇది అదనపు ప్రయోజనం అవుతుందని భావిస్తున్నానని చెప్పారు. సైన్యంలో కఠినమైన ఎంపిక, శిక్షణ ప్రమాణాల దృష్ట్యా మహీంద్రా గ్రూప్ ఉద్యోగాల ఎంపికలో స్వచ్చంధంగా సేవలు అందించిన వారిని సంతోషంగా పరిగణలోకి తీసుకుంటుందని పేర్కొన్నారు.
సిగ్గుతో తలదించుకోవాలి
ఇటీవల ఉత్తర ప్రదేశ్ రోడ్డు ప్రమాదంలో మృత్యువాతపడిన వలస కార్మికుల అంశంపై కూడా ఆయన విషాధం వ్యక్తం చేశారు. ఇది మనవల్లేనని, దీనికి సిగ్గుతో తలదించుకోవాల్సి ఉందన్నారు. మన ఆర్థిక వ్యవస్థకు ఎంతో కీలకమైన వలస కార్మికులను మనమే మాయం చేశామని, దీనికి సమాజంలోని మనమంతా బాధ్యులమే అన్నారు. ముఖ్యంగా చిన్నా, పెద్ద వ్యాపారస్థులం సిగ్గుతో తలదించుకోవాలన్నారు. వలస కార్మికుల స్వల్ప, దీర్ఘకాలిక పరిష్కారాలను అన్వేషించాలని మహీంద్రా గ్రూప్ను కోరారు. వారికి ఎలా సహాయపడగలమో సూచించాలని, తద్వారా వారి కుటుంబాలను ఆదుకోవడానికి సుముఖత వ్యక్తం చేశారు.
ప్రమాదంలో విగతజీవులైన వలస కార్మికులు
కరోనా కారణంగా సుదీర్ఘ లాక్ డౌన్ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. దేశంలోని పారిశ్రామిక వాడల నుండి వలస కార్మికులు తమ కుటుంబాలతో కలిసి తమ సొంత రాష్ట్రాలకు పయనమవుతున్నారు. ఈ క్రమంలో యూపీలోని ఔరయా జిల్లాలో శనివారం ఉదయం వలస కార్మికులు ప్రయాణిస్తున్న ట్రక్కును మరో వ్యాను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 24 మంది మృత్యువాత పడ్డారు.