900 ఉద్యోగుల తొలగింత, ఆ సీఈవో క్షమాపణ.. కానీ: తప్పుబట్టిన ఆనంద్ మహీంద్రా
జూమ్ కాల్లో ఒకేసారి 900 మంది ఉద్యోగులను తొలగించిన అంశం ప్రపంచవ్యాప్తంగా విమర్శలు ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో బెటర్ డాట్ కామ్ సీఈవో విశాల్ గార్గ్ క్షమాపణలు చెప్పారు. ఉద్యోగులను తొలగించడానికి సంబంధించి తనది సరైన చర్య అని, అయితే తొలగింపు నిర్ణయం తప్పుడు విధానాన్ని అవలంభించినట్లు తెలిపారు. తన పొరపాటుకు మన్నించాలని కోరారు. దీనిపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా స్పందించారు. విశాల్ గార్గ్ చర్యలను తప్పుబట్టారు.
ఆనంద్ మహీంద్రా తీవ్ర అసంతృప్తి
తొలగింపు నిర్ణయం సరైనదేనని, కానీ విధానం పొరపాటు అని విశాల్ గార్గ్ క్షమాపణలు కోరిన అనంతరం ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. ది న్యూయార్క్ టైమ్స్లో వచ్చిన మీడియా కథనాన్ని షేర్ చేస్తూ... ఇలాంటి ఘోరమైన తప్పిదం తర్వాత కూడా ఓ సీఈవో బయటపడి రాణించగలరని మీరు అనుకుంటున్నారా? ఆయనకు రెండో అవకాశం ఇవ్వడం సరైందా? కాదా? అనే సందేహాన్ని వెలిబుచ్చారు.
దీనిపై నెటిజన్లు కూడా స్పందించారు. ఇలాంటి సీఈవో ఎప్పటికీ రాణించలేరన్నారు. అసలు ఆయన టీమ్ ఆయనను విశ్వసిస్తుందా అని మరో నెటిజన్ పేర్కొన్నారు.
అంతకుముందు క్షమాపణ
ఉద్యోగులను తొలగించడం, తొలగించిన విధానంపై విమర్శలు రావడంతో విశాల్ గార్గ్ నిన్న తన ఉద్యోగులకు లేఖ రాశారు. 'ఉద్యోగులను విధుల నుండి తొలగించడం సరైందే. అయితే ఆ నిర్ణయాన్ని నేను ప్రకటించిన విధానం ఈ పరిస్థితిని మరింత దిగజార్చింది. ఉద్యోగులకు తగిన గౌరవం, ప్రశంసలు ఇవ్వడంలో నేను విఫలమయ్యాను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. క్షమించండి.' అని ఆ లేఖలో పేర్కొన్నారు.
అసలేం జరిగింది?
అమెరికాలోని న్యూయార్క్కు చెందిన హోమ్-ఓనర్షిప్ సంస్థ కేవలం మూడు నిమిషాల జూమ్ కాల్ ద్వారా 900 మంది ఉద్యోగులను తొలగించింది. ఉద్యోగుల తొలగింపుకు ముందు పాటించవలసిన నియమ నిబంధనలు కూడా పాటించలేదు. అసలు జూమ్ కాల్కు హాజరైన ఉద్యోగులకు తమ ఉద్యోగాలకు అదే చివరి రోజు అనే విషయం కూడా అప్పటి వరకు తెలియదు. దీంతో పింక్ స్లిప్ అంతుకున్న ఓ ఉద్యోగి ఆ షార్ట్ వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు. న్యూయార్క్లో హోమ్-ఓనర్షిప్ కంపెనీ బెట్టర్ డాట్ కామ్. దీని సీఈవో భారత సంతతి వ్యక్తి విశాల్ గార్గ్. అతను జూమ్ మీటింగ్లో కంపెనీలోని 900 మంది ఉద్యోగులను తొలగించారు. కంపెనీ ఉద్యోగుల్లో ఇది 9 శాతం. ఉద్యోగులను తొలగించడానికి మార్కెట్ సామర్థ్యం, పర్ఫార్మెన్స్, ప్రోడక్టివిటీ వంటి అంశాలను కారణంగా చూపించారు. జూమ్ మీటింగ్ను అతను ప్రారంభిస్తూ, తాను మీకు సంతోషకరమైన వార్తను ఇవ్వడం లేదని, మార్కెట్ మార్పులకు అనుగుణంగా కంపెనీ కూడా మారుతోందని ఉద్యోగులకు పింక్ స్లిప్ సంకేతాలు ఇచ్చారు. ఆ తర్వాత తొలగింపు గురించి వెల్లడించారు. పని తీరు బాగాలేదని ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పనితీరు బాగా లేదని, మార్కెట్లో ఆశించినస్థాయిలో కష్టపడటం లేదని, నిర్దేశించిన వ్యాపారం చేయలేకపోతున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తక్షణమే మిమ్మల్ని ఉద్యోగంనుండి తీసివేస్తున్నామని ప్రకటించారు. ఇదంతా మూడు నిమిషాల్లో జరిగింది.