ట్విట్టర్ కొనుగోలు, టెస్లాలో 44 లక్షల షేర్లను విక్రయించిన ఎలాన్ మస్క్
ఎలక్ట్రిక్ వెహికిల్స్ మేకర్ టెస్లా ఇంక్ అధినేత ఎలాన్ మస్క్ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ను కొనుగోలు చేశారు. ట్విట్టర్ కొనుగోలు కోసం ఆయన కొంత మొత్తాన్ని సమకూర్చుకున్నారు. దీంతో పాటు తన కంపెనీ టెస్లా ఇంక్లోను పెద్ద ఎత్తున షేర్లను విక్రయించారు. ట్విట్టర్ కొనుగోలు నేపథ్యంలో 4 బిలియన్ డాలర్ల విలువ చేసే 4.4 మిలియన్ల టెస్లా షేర్లను విక్రయించారు. ఏప్రిల్ 26, 27 తేదీల్లో ఈ మేరకు ఆయన తన షేర్లను విక్రయించినట్లు అమెరికా సెక్యూరిటీ ఎక్స్చేంజీలకు ఇచ్చిన సమాచారంలో తెలిపారు.
ట్విట్టర్ కొనుగోలు కోసం 44 బిలియన్ డాలర్లు అవసరం. ఇందులో 21 బిలియన్ డాలర్లను సొంతగా భరిస్తున్నారు. దీంతో టెస్లా షేర్ల విక్రయం తప్పదని వార్తలు వచ్చాయి. ఇందుకు అనుగుణంగా 2.6 శాతం మేర విక్రయించారు. అయితే మరిన్ని షేర్లు వదులుకోవడం లేదని మస్క్ స్పష్టం చేశారు. ట్విట్టర్ ఒప్పందం ఖరారయినప్పటి నుండి టెస్లా షేర్లు పతనమవుతూ వచ్చాయి.
మస్క్ భారీ మొత్తంలో తన వాటాలను విక్రయిస్తారని ముందే వార్తలు రావడం ఇందుకు కారణం. మంగళవారం కంపెనీ షేర్లు ఏకంగా 12 శాతం క్షీణించాయి. దీంతో ఒక్కరోజే టెస్లా మార్కెట్ వ్యాల్యూ 126 బిలియన్ డాలర్లు కరిగిపోయింది. ప్రస్తుతం మస్క్కు టెస్లాలో 17 శాతం వాటా ఉంది. షేర్ల ధరలు పడిపోవడంతో ఆయన వాటా వ్యాల్యూ కూడా 40 బిలియన్ డాలర్లు తగ్గింది. ట్విట్టర్ కొనుగోలుకు ఆయన తరఫున చెల్లించాల్సిన 21 బిలియన్ డాలర్లకు ఈ పతనం రెండింతలు. ట్విట్టర్ కొనుగోలుకు మరో 17 బిలియన్ డాలర్లు అవసరం.