ఏపీ, తెలంగాణల్లో అమెజాన్ ఈజీ స్టోర్స్: రూ.3 లక్షల పెట్టుబడితో ఎవరైనా నెలకొల్పవచ్చు
ప్రపంచ ప్రఖ్యాత ఈ-కామర్స్ కంపెనీ అమెజాన్ మరో సరికొత్త ప్రయోగానికి సిద్ధమవుతోంది. త్వరలోనే ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 'అమెజాన్ ఈజీ స్టోర్' పేరుతో ఆఫ్-లైన్ స్టోర్ల ఏర్పాటు చేయబోతోంది. అయితే, ఇందుకోసం అమెజాన్ భాగస్వాములను వెతుకుతోంది. తానే స్వయంగా స్టోర్ల ఏర్పాటు చేసే బదులు, ఔత్సాహక పారిశ్రామికవేత్తలు, స్వయం ఉపాధి పొందాలనుకునే వారికి ఈ అవకాశం కల్పిస్తోంది. వారు చేయాల్సిందల్లా సొంతంగా ఒక స్టోర్ ను నెలకొల్పాలి. దానికి డిజైన్ సహా ఇతర సలహాలు, సూచనలు అన్నీ అమెజాన్ ఇస్తుంది.
అతి తక్కువ పెట్టుబడితో ఈ స్టోర్ల ను నెలకొల్పే అవకాశం ఉండటం మరో విశేషం. అమ్మకాలపై ఆకర్షణీయమైన కమిషన్ కూడా అందించబోతోంది. కేవలం ఈ-కామర్స్ లోనే కాకుండా గ్రోసరీస్ డెలివరీ, ఫుడ్ డెలివరీ సహా అనేక ఇతర రంగాల్లో విస్తరించాలన్న అమెజాన్ వ్యూహం లో భాగంగానే ఈజీ స్టోర్ల ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఫ్లిప్కార్ట్ తో పోటీలో ముందుండాలంటే మరింతగా విస్తరించాలని అమెజాన్ యోచనగా ఉంది. అందుకే, ఇండియాలో వేగంగా విభిన్న రంగాల్లోకి అమెజాన్ ప్రవేశిస్తోంది. ఈ వ్యూహాల్లో భాగంగానే ప్రస్తుతం ఈజీ స్టోర్లను ఏర్పాటు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
త్వరలో హోల్సేల్ మార్కెట్లోకి ఫ్లిప్కార్ట్, వ్యాపారులకు మంచి అవకాశం..
ఈ స్టోర్లు ఎలా ఏర్పాటు చేయాలి...
ముందుగా అమెజాన్ స్టోర్ల ను ఏర్పాటు చేయాలనుకునే వారు అమెజాన్ వెబ్సైటు కి వెళ్లి అమెజాన్/ఈజీ వద్ద తమ పేర్లు, ఇతర వివరాలను నమోదు చేసుకోవాలి. మీరు ఎంచుకున్న లొకేషన్ లో స్టోర్ కు అవకాశం ఉందో లేదో అమెజాన్ తెలుపుతుంది. ఒకవేళ ఆ లొకేషన్లో అవకాశం ఉంటే.. మీరు స్టోర్ నెలకొల్పే అవకాశం కల్పిస్తారు. ఇందుకోసం రూ 3 లక్షల పెట్టుబడి అవసరం అవుతుంది. ఈ స్టోర్ల లో ఎలాంటి సరుకులు నిల్వ ఉండవు. కానీ, వినియోగదారులు ఇక్కడికి వచ్చి తమకు కావాల్సిన సరుకులను స్టోర్ల లో నుంచే నేరుగా బుక్ చేసుకోవచ్చు. కస్టమర్లు బుక్ చేసుకున్న సరుకులను మళ్ళీ ఇదే స్టోర్ కు డెలివరీ చేస్తారు. లేదా హోమ్ డెలివరీ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంటుంది. స్టోర్ లో ఇన్వెంటరీ ఉండదు కాబట్టి స్టోర్ యజమానికి తదుపరి పెట్టుబడి అవసరం ఉండదు.
12% వరకు కమిషన్...
ఈజీ స్టోర్ల లో కస్టమర్లు బుక్ చేసుకున్న వస్తువులపై స్టోర్ యజమానికి అమెజాన్ నుంచి 12% వరకు కమిషన్ లభిస్తుంది. ఈ కమిషన్ వస్తువులను బట్టి మారుతుంటుంది. పైగా ప్రతి నెలా అనేక ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలను కూడా అమెజాన్ అందిస్తుంది. స్టోర్ కు తగిన మార్కెటింగ్ సపోర్ట్ కూడా అమెజాన్ నుంచి లభిస్తుంది. అమెజాన్ పార్టనర్ గా ఉండటం వల్ల కలిగే ఇతర లాభాలు ఉండనే ఉంటాయి. ఇప్పుడు దేశమంతటా ఈ-కామర్స్ బూమ్ కనిపిస్తోంది. కేవలం మహానగరకే పరిమితం కాకుండా చిన్న చిన్న పట్టణాలకు కూడా విస్తరిస్తోంది. ఇకపై గ్రామాలకు కూడా దగ్గరవ్వాలని ఈ కామర్స్ కంపెనీలు ప్రణాళికలు రచిస్తున్నాయి. వాటికి ఈజీ స్టోర్లు బాగా ఉపయోగపడతాయని అంచనా వేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో స్మార్ట్ ఫోన్ల వాడకం తక్కువగా ఉంటుంది కాబట్టి, అక్కడ అమెజాన్ ఈజీ స్టోర్ల కు వెళ్లి వినియోగదారులు కావాల్సిన సరుకులను ఆన్లైన్ లో ఆర్డర్ చేసే అవకాశం ఉంటుంది.
1 బిలియన్ డాలర్ల పెట్టుబడి...
ఇటీవల అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ ఇండియా పర్యటనకు వచ్చినప్పుడు భారత్ లో ఆ కంపెనీ మరింతగా విస్తరిస్తుందని చెప్పారు. అలాగే దేశమంతా అమెజాన్ లో సెల్లార్లకు మద్దతుగా నిలబడతామని ప్రకటించారు. ఇండియా లో అమెజాన్ ను మరింతగా పటిష్టం చేసేందుకు, డెలివరీ వ్యవస్థను మెరుగుపరిచేందుకు 1 బిలియన్ డాలర్లు (సుమారు రూ 7,000 కోట్లు ) పెట్టుబడిగా పెడతామని వెల్లడించారు. ఇప్పటికే అమెజాన్ ఇండియాలో 5 బిలియన్ డాలర్ల పెట్టుబడికి కట్టుబడి ఉంది. వచ్చే రెండు మూడేళ్ళలో కంపెనీ భారత్ లో వేగంగా విస్తరించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.