3 నెలల్లో రూ.218 కోట్ల లాభాలు ఆర్జించిన గల్లా జయదేవ్ కంపెనీ
హైదరాబాద్: అమర రాజా బ్యాటరీస్ క్వార్టర్ 2 లాభం రూ.218 కోట్లుగా నమోదు చేసింది. కన్సాలిడేటెడ్ ఖాతాల ప్రకారం 2019-20 ఆర్థిక సంవత్సరంలో రెండో త్రైమాసికానికి గాను పై నికర లాభాన్ని రూ.218.85 కోట్లుగా ప్రకటించింది. ఆదాయం రూ.1,713 కోట్లు. ఏడాది క్రితం ఇదే కాలంలో ఆదాయం రూ.1,767 కోట్లు, నికర లాభం రూ.120.23 కోట్లుగా ఉంది. గత ఏడాదితో పోలిస్తే 82 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈపీఎస్ (ఎర్నింగ్స్ పర్ షేర్) రూ.12.81గా ఉంది.
గత ఏడాది ఈపీఎస్ 7.04 శాతంగా ఉంది. గత రెండో త్రైమాసికంతో పోల్చితే ఇప్పుడు పోల్చుకుంటే నికర లాభం గణనీయంగా పెరిగింది. సమీక్షా త్రైమాసికానికి కార్యకలాపాల ద్వారా వచ్చిన నికర ఆదాయం రూ.1,753 కోట్ల నుంచి రూ.1,695 కోట్లకు తగ్గింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూపాయి ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు రూ.6 (600 శాతం)మధ్యంతర డివిడెండును బోర్డు సిఫార్సు చేసింది.
వీక్ ఆఫ్: ఉద్యోగులకు గుడ్న్యూస్: ప్రభుత్వం ఏం కోరుకుంటోంది?
పన్ను కేటాయింపులు తక్కువగా ఉండటం, ముడి పదార్థాల ఖర్చు తగ్గడంతో లాభం అధికంగా నమోదయినట్లు తెలుస్తోంది. అమర రాజా కంపెనీ ఆటోమోటివ్, ఇండస్ట్రీ బ్యాటరీస్ను ఉత్పత్తి చేస్తోంది. ఈ రెండు సెగ్మెంట్లలోను మంచి వృద్ధిని సాధించింది.
దేశీయంగా, అంతర్జాతీయంగా తమ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోందని, ఇది తమకు ఉత్సాహాన్ని ఇస్తోందని కంపెనీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గల్లా జయదేవ్ అన్నారు. వ్యూహాత్మక పెట్టుబడులు పెడుతున్నట్లు చెప్పారు. మారుతున్న కాలానికి అనుగుణంగా కస్టమర్ల అవసరానుగుణంగా టెక్నాలజీని, ఉత్పత్తి పోర్ట్ పోలియోను విస్తరిస్తున్నామన్నారు. ఇది తమ డిమాండుకు ఊతమిస్తోందన్నారు.