దారుణంగా దెబ్బతిన్న జాక్మా 'అలీబాబా', ప్లాన్ అనుకోకుండా రివర్స్
బీజింగ్: చైనా కుబేరుడు జాక్ మా నేతృత్వంలోని అలీబాబాకు వరుస షాక్లు తగులుతున్నాయి. జాక్ మాతో పాటు అతని ఫైనాన్షియల్ సామ్రాజ్యంపై గత కొద్ది రోజులుగా చైనీస్ అధికారులు కన్నెర్ర చేస్తున్నారు. గుత్తాధిపత్య నిబంధనల కింద దర్యాఫ్తుకు కూడా ఆదేశించాయి. ఇటీవల యాంట్ గ్రూప్, అనుబంధ సంస్థలపై దర్యాఫ్తు చేస్తున్నాయి. వివిధ కారణాలు చూపించి యాంట్ గ్రూప్ అతిపెద్ద ఐపీవోకు చెక్ చెప్పారు. అంతేకాదు, చైనా బ్యాంకులపై జాక్ మా చేసిన వ్యాఖ్యలు కూడా అలీబాబాపై ప్రభావం చూపాయి.
అలీబాబా, జాక్ మా.. మరిన్ని కథనాలు
అలీబాబాపై దారుణమైన దెబ్బ
యాంట్ ఫైనాన్షియల్స్ ఐపీవో అంశం అలీబాబా సంపదను కరిగిస్తోంది. వివిధ కారణాలు చూపిస్తూ యాంట్ ఫైనాన్షియల్ 10 బిలియన్ డాలర్ల ఐపీవోను చైనా అధికారులు ఆపశారు. దీంతో ఆ కంపెనీ వ్యాల్యూ ఈ కాలంలో భారీగా నష్టపోయింది. వరుసగా రెండు ట్రేడింగ్ సెషన్లలో అలీబాబా సంపద 116 బిలియన్ డాలర్ల మేర తుడిచిపెట్టుకుపోయింది. మన కరెన్సీలో దాదాపు రూ.8.5 లక్షల కోట్లు. అలీబాబా అనుబంధ సంస్థపై యాంటీట్రస్ట్ దర్యాఫ్తు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. దీంతో న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజీలో అలీబాబా షేర్ దాదాపు పదిహేను శాతం పడిపోయింది. ఈ దర్యాఫ్తు అనంతరం జరిమానా విధిస్తారనే భయంతో ఇన్వెస్టర్లు షేర్లను విక్రయించేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ దర్యాఫ్తు దెబ్బ అలీబాబాపై తీవ్రంగా పడింది.
బైబ్యాక్
కంపెనీ 10 బిలియన్ డాలర్లతో సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్)ను ప్రతిపాదించింది. మొదట 6 బిలియన్ డాలర్ల బైబ్యాక్ను తర్వాత 10 బిలియన్ డాలర్లకు పెంచేందుకు అలీబాబా బోర్డు నిర్ణయించింది. 2022 వరకు బైబ్యాక్ చేపట్టనుంది. అయితే నియంత్రణ సంస్థలు... అలీబాబా ఆధిపత్య ధోరణిపై దర్యాప్తు చేపట్టేందుకు మొగ్గు చూపడంతో కౌంటర్లో అమ్మకాలు కొనసాగాయి. గతంలో బ్యాంకులపై జాక్ మా వ్యాఖ్యలు దుమారం రేపాయి. అప్పుడు కూడా షేర్లు పడిపోయాయి.
నేడు స్వల్పంగా జంప్
అలీబాబా స్టాక్స్ గత నెల రోజులుగా క్షీణిస్తున్నాయి. నెల ప్రారంభంలో 260 HKDగా ఉన్న ఈ స్టాక్స్ ఇప్పుడు 222కి పడిపోయాయి. గత రెండు సెషన్లలో మరీ భారీగా పడిపోయాయి. ఈ రోజు కాస్త లాభపడింది. నిన్న 210 వద్ద క్లోజ్ అయిన స్టాక్ నేడు 5.71 శాతం ఎగిసి 222 వద్ద క్లోజ్ అయింది.