కస్టమర్లకు ఎయిర్టెల్ భారీ షాక్, మినిమం రీఛార్జ్ డబుల్: వొడాఫోన్ ఐడియా సంగతేమిటి!?
ఎయిర్టెల్ వినియోగదారులకు చేదువార్త. ప్రముఖ టెలికం కంపెనీ భారతీ ఎయిర్టెల్ తన కస్టమర్లకు మరో షాకిచ్చింది. ప్రీపెయిడ్ కనీస రీఛార్జ్ మొత్తాన్ని దాదాపు రెట్టింపు చేసింది. ఇదివరకు ఈ ధర రూ.23గా ఉంది. ఇప్పుడు దీనిని రూ.45గా చేసింది. ఈ నెల డిసెంబర్ మొదటి వారంలో ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా, జియోలు వివిధ ప్లాన్స్ పైన ఛార్జీలు పెంచిన విషయం తెలిసిందే.
Survey: నిరుద్యోగమే ఆందోళన, భారత్ సరైన దిశలోనే వెళ్తోంది
మినిమం రీఛార్జ్ కోసం రూ.22 అదనం
ఎయిర్టెల్ మినిమం ప్రీపెయిడ్ రీఛార్జ్ని రూ.23 నుంచి రూ.45కు పెంచింది. అంటే అవాంతరం లేకుండా ఎయిర్టెల్ సేవలు పొందాలంటే కస్టమర్ నెలకు కనీసం రూ.45 చెల్లించాల్సిందే. గతంలో కంటే రూ.22 ఎక్కువ చెల్లించాలి. పెంచిన కనీస ఛార్జీని వెంటనే అంటే ఆదివారం (డిసెంబర్ 29) నుంచే అమలులోకి తీసుకు వచ్చింది.
రీఛార్జ్ చేయకుంటే సేవలు నిలిపివేత
ఇకపై 28 రోజుల ప్రీపెయిడ్ కోసం నెలకు రూ.45 రీఛార్జ్ చేసుకోవాలి. ఈ రీచార్జితో ఎలాంటి డేటా, ఉచిత కాల్స్ ఉండవు. రూ.45 లేదా అంతకంటే ఎక్కువ మొత్తం రీఛార్జ్ చేయకుంటే గత ప్లాన్ గ్రేస్ పీరియడ్ ముగిసిన అనంతరం సేవలు నిలిపివేస్తామని భారతీ ఎయిర్టెల్ పేర్కొంది. టారిఫ్ కాలపరిమితి ముగిసిన తర్వాత మరో 15 రోజుల గ్రేస్ పీరియడ్లో రీఛార్జ్ చేసుకోవాలి. కాగా, ఎంపిక చేసిన ప్లాన్స్కు మాత్రమే ఈ అవకాశం కల్పించింది. మిగతా ప్లాన్స్ మాత్రం గడువు ముగిసిన వెంటనే నిలిచిపోనున్నాయి.
జియో, వొడాఫోన్ ఐడియా రీఛార్జ్లు ఇలా..
రూ.23 నుంచి రూ.45కు అంటే 95 శాతం పెంచినట్లు. అంటే దాదాపు రెండింతలు. కాగా, వొడాఫోన్ ఐడియా కనీస రీఛార్జ్ రూ.23గా ఉంది. ఈ టెలికం కంపెనీ కూడా మినిమం రీఛార్జ్ ధరను పెంచుతుందా అనే ప్రశ్న అందరిలో తలెత్తుతోంది. జియో మినిమం రీఛార్జ్ ప్లాన్ స్మార్ట్ ఫోన్ యూజర్కు రూ.98, జియో ఫోన్ యూజర్కు రూ.78గా ఉన్నాయి.
పెరగనున్న ఆర్పు
అప్పులతో సమతమతమవుతున్న ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్.. టారిఫ్ యుద్ధం, అత్యధికంగా వినిమయం మొత్తం టెలికం ఇండస్ట్రీని నాశనం చేస్తోందని, ట్రాయ్ వెంటనే జోక్యం చేసుకొని పెట్టుబడులకు భద్రత, వినియోగదారులు కోరుకుంటున్న విధంగా ప్లాన్స్ రూపకల్పనలో పాలుపంచుకోవాలని ఇటీవల సూచించారు. కాగా, టెలికం కంపెనీలు ఛార్జీలు పెంచుతున్న నేపథ్యంలో రానున్న రెండు క్వార్టర్లలో వొడాఫోన్ ఐడియా ఆర్పు రూ.107 నుంచి రూ.143, ఎయిర్టెల్ ఆర్పు రూ.128 నుంచి రూ.145-150, జియో ఆర్పు రూ.140 ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు.