మరోసారి ఎయిర్టెల్ టారిఫ్ హైక్, ఆర్పు రూ.200కు పెరిగే ఛాన్స్
మొబైల్ ఛార్జీలు మరోసారి పెరగనున్నాయా? అంటే అందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. మూడో త్రైమాసికంలో బలమైన ఫలితాలు వచ్చాయని, ఇందుకు టారిఫ్ పెంపు, గూగుల్ పెట్టుబడులు సహా వివిధ కారణాలు అని భారతీ ఎయిర్టెల్ బుధవారం తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో మరో టారిఫ్ పెంపు ఉండవచ్చునని సంకేతాలు ఇచ్చింది. వచ్చే మూడు నుండి నాలుగు నెలల కాలంలో పెంపు ఉండకపోయినా, ఈ ఏడాది ఉండవచ్చునని అంటున్నారు. ఆర్పు ఈ ఏడాది చివరి నాటికి రూ.200కు పెరగవచ్చు.
ఈ ఏడాది ప్లాన్స్ చార్జీలను పెంచుతామనే సంకేతాలను సంస్థ తాజాగా ఇవ్వడం గమనార్హం. వచ్చే మూడు నాలుగు నెలల్లో పెంపు ఉండకపోయినా డిసెంబర్లోగా తప్పదని ఎయిర్టెల్ ఇండియా, దక్షిణాసియా ఎండీ, సీఈవో గోపాల్ విఠల్ అన్నారు. ఈ క్రమంలో మొబైల్ కాల్, సర్వీసెస్ రేట్లను పెంచే అవకాశాలున్నాయని తెలిపారు. ముఖ్యంగా పరిశ్రమలో ప్రత్యర్థి సంస్థల కంటే ముందుగా చార్జీలను పెంచేందుకు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటామన్నారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి గాను మంగళవారం భారతీ ఎయిర్టెల్ తమ ఆర్థిక ఫలితాలను విడుదల చేసింది. ఈ క్రమంలో ఫలితాలపై బుధవారం గోపాల్ విఠల్ మాట్లాడారు. ఇప్పటికే పెంచిన చార్జీలు సంస్థకు కలిసి వచ్చాయన్నారు. ఇకపై ఈ తరహా లాభాన్ని వదులుకోలేమన్నారు. గత ఏడాది నవంబర్లో తొలుత చార్జీలను 18 శాతం నుండి 25 శాతం వరకు పెంచింది.