air india: చరిత్ర సృష్టించనున్న ఎయిర్ ఇండియా.. ప్రపంచంలో అలా చేస్తున్న మొదటి సంస్థ టాటానే..
టాటా గ్రూపు చేతిలోకి వచ్చిన తర్వాత ఎయిరిండియాకు రెక్కలు వచ్చాయన్న మాట ఎవరూ కాదనలేని వాస్తవం. తాజాగా 500 విమానాల కోసం ఆర్డరు చేయనున్నట్లు సమాచారం. ప్రపంచంలోని ఏ విమానయాన సంస్థా ఇప్పటి వరకు ఒకేసారి ఇన్ని విమానాలు బుక్ చేసినట్లు చరిత్రలో లేదు. ఎయిర్ బస్ A320neos, A321, A350, Boeing 737Max, 787, 777X and 777 ఫైటర్లు వీటిలో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం 70 బిలియన్ డాలర్లను ఇందుకోసం వెచ్చించనున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
సంప్రదింపుల్లో ఉంది..
ఈ భారీ కొనుగోళ్ల విషయమై ఎయిర్ ఇండియా అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఓ భారీ చారిత్రక కొనుగోళ్లు చేయనున్నట్లు టాటా గ్రూపుకు సంబంధించిన అధికారి నవంబరులో తెలిపారు. అందుకోసం బోయింగ్, ఎయిర్బస్ తో పాటు ఇంజిన్ల తయారీదారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా విమాన ప్రయాణికులకు అత్యుత్తమ అనుభవం అందించడానికి తాము కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు.
వందలాది విమానాల కోసం ఆర్డర్లు:
దేశంలోని ఇండిగో సంస్థకు ప్రసుత్తం అత్యధికంగా 300 విమానాలు ఉన్నాయి. ఇదే అతిపెద్దది కాగా.. 400 విమానాల డెలివరీ కోసం వేచి చూస్తోంది. కొత్తగా విమానయాన రంగంలోకి అడుగుపెట్టిన అకాసా.. కొన్ని నెలల క్రితం 72 బోయింగ్ విమానాల కొనుగోళ్లకు ఆర్డర్ చేసింది. అయితే దేశీయంగా, అంతర్జాతీయంగా విమాన సేవలు అందించడంలో తమ భాగాన్ని మరింత విస్తరించాలనే ఉద్దేశ్యంతో.. ఎయిర్ ఇండియా 500 విమానాల భారీ కొనుగోళ్లకు ముందుకు వెళ్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇంటీరియర్ ను పునరుద్ధరించడం కోసం దాదాపు 400 మిలియన్ డాలర్లను వెచ్చిస్తోందని టాక్.
విలీనం తప్పదా ?
ఎయిర్ ఇండియా ముందస్తు ప్రణాళికలకు అనుగుణంగా భారీ పెట్టుబడులు పెట్టేందుకు సైతం కొత్త యాజమాన్యం సిద్ధంగా ఉన్నట్లు ఈ వార్తలు చూస్తుంటే అర్థమవుతోందని సెంటర్ ఫర్ ఏవియేషన్ (CAPA) అనే వ్యాపార ఇంటెలిజెన్స్ సంస్థ పేర్కొంది. మరో ఐదేళ్లో దేశీయ విమానయాన మార్కెట్ లో 30 శాతం సొంతం చేసుకోవాలని చూస్తోందని వెల్లడించింది. తక్కువ సామర్థ్యమున్న ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్, ఎయిర్ ఆసియా ఇండియాలను పూర్తి సర్వీస్ క్యారియర్ విస్తారాతో విలీనం చేయడం ద్వారా ఇది సాధ్యమవుతుందని భావిస్తున్నారు.
ఏడాదిలో ఎంతో సాధించాం..
ఎయిర్ ఇండియాను టాటా గ్రూపు కొనుగోలు చేసి ఏడాది పూర్తయిన సందర్భంగా.. ఉద్యోగులను ఉద్దేశించి ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, CEO క్యాంప్బెల్ విల్సన్ మాట్లాడారు. అంతర్జాతీయ విమానయాన చరిత్రను ఓ ప్రతిష్టాత్మక మలుపు తిప్పామన్నారు. ప్రపంచంలో అత్యుత్తమ విమానయాన అనుభవాన్ని రూపొందించడానికి సిద్ధమయ్యామన్నారు. అత్యంత తక్కువ సమయంలోనే ఎంతో గొప్ప పురోగతిని సాధించామన్నారు. ఇదే విధంగా మరింత ముందుకు సాగుతూ.. ప్రపంచ వేదికపై భారతదేశానికి సగర్వంగా ప్రాతినిధ్యం వహిస్తామని ధీమా వ్యక్తం చేశారు