బరువెక్కిన హృదయంతో.. వేతనాలు లేని సెలవులు ఇస్తున్నాం: ఉద్యోగులకు సీఈవో మెయిల్
తదుపరి నోటీసులు అందే వరకు తమ కార్యకలాపాలు పూర్తిగా నిలిపివేస్తున్నట్లు రీజినల్ ఎయిర్లైనర్ ఎయిర్ డెక్కన్ ఆదివారం ప్రకటించింది. ఉద్యోగులు అప్పటి వరకు సెలవులు ఉపయోగించుకోవాలని సూచించింది. ఈ కాలంలో వేతనాలు చెల్లించలేమని స్పష్టం చేసింది. ఈ మేరకు సంస్థ సీఈవో అరుణ్ కుమార్ సింగ్ ఉద్యోగులకు మెయిల్ ద్వారా సందేశం పంపించారు. ఇప్పటికే ఎయిరిండియా, గోఎయిర్ తదితర విమానయాన సంస్థలు వేతనాల్లో కోత విధిస్తున్నట్లు ప్రకటించాయి.
ఏప్రిల్ 15వ తేదీ నుండి విమాన టిక్కెట్లు బుకింగ్, ఎయిరిండియా దూరం
ఆపరేషన్స్ నిలిపివేత
తదుపరి నోటీసుల వరకు ఆపరేషన్స్ను నిలిపివేస్తున్నట్లు ఎయిర్ డెక్కన్ తెలిపింది. ఉద్యోగులకు వేతనాలు లేని సెలవులు ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. కరోనా కారణంగా ఇటీవల ప్రపంచ, దేశ పరిస్థితుల దృష్ట్యా, ఇండియన్ రెగ్యులేటర్ ఆదేశాల మేరకు ఏప్రిల్ 14వ తేదీ వరకు అన్ని వాణిజ్య ప్రయాణీకుల విమానాలను నిలిపివేయాలని నిర్ణయించినట్లు తెలిపింది.
బరువెక్కిన హృదయంతో.. వేతనాల్లేని సెలవులు
ప్రస్తుత పరిస్థితుల్లో విమాన సర్వీసులు నిలిపివేయడం మినహా మరో మార్గం లేదని స్పష్టం చేసింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో బాధాకర, బరువెక్కిన హృదయంతో తప్పనిసరిగా పర్మినెంట్, తాత్కాలిక ఉద్యోగులకు వేతనాలు చెల్లించలేని సెలవులు వెంటనే అమలులోకి తీసుకు వచ్చినట్లు తెలిపారు.
18 సీటర్ ఎయిర్ క్రాఫ్టర్
గుజరాత్పై ఫోకస్గా పశ్చిమ భారతంలో 18 సీటర్ బీచ్ క్రాఫ్ట్ విమానాలను నాలుగింటిని ఎయిర్ డెక్కన్ కలిగి ఉంది. వచ్చే వారం ఆదేశాలు వచ్చాక విమానయాన సంస్థను పునరుద్ధరిస్తామని తెలిపింది. ఇందుకు వివిధ డిపార్టుమెంట్స్ హెడ్స్ను సంప్రదించనున్నట్లు తెలిపింది. తిరిగి ప్రారంభమయ్యాక తీసుకుంటామని తెలిపింది.
అన్ని విమాన సంస్ధలదీ అదే దారి
కాగా, ఏప్రిల్ 14వ తేదీ తర్వాత నుండి ఎయిరిండియా మినహా మిగతా విమానయాన సంస్థలు టిక్కెట్ బుకింగ్స్ ప్రారంభించాయి. ఇక లాక్ డౌన్ ఈ సమయంలో వివిధ విమానయాన సంస్థలు వేతనాల్లో కోత విధించాయి. ఇండిగో సీనియర్ ఉద్యోగులకు 25 శాతం కోత, స్పైస్ జెట్ 10 శాతం నుండి 30 శాతం వతన కోత, ఎయిరిండియా 10 శాతం కోత విధించాయి. విస్తారా వేతనం లేని సెలవులను ప్రకటించింది.