పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ తర్వాత నెత్తిన మరో పిడుగు: లీటర్కు ఏకంగా రూ.12 పెంపు!
ముంబై: పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ సిలిండర్ ధరలు వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. గుజరాత్, మధ్యప్రదేశ్లోని కొన్నిచోట్ల లీటర్ పెట్రోల్ రూ.100ను దాటింది. అన్ని మెట్రో నగరాల్లోను పెట్రోల్ రూ.90ని దాటింది. అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు పెరగడంతో ఇక్కడ కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఇటీవలి వరకు వరుసగా పెరిగాయి. ఇక, ఫిబ్రవరి నెలలోనే గ్యాస్ ధర మూడుసార్లు రూ.100 పెరిగింది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదలతో వినియోగదారులు ఇబ్బందులు పడుతుండగా, మార్చి 1వ తేదీ నుండి మరో భారం పడే అవకాశం ఉంది.
పన్నులు తగ్గించాలి! పెట్రోల్, డీజిల్ ధరలపై RBI కీలక వ్యాఖ్యలు, ఆ రాష్ట్రాల్లో ధరలు తక్కువే
అందుకే పాల ధరల పెంపు
చమురు ధరలు పెరిగితే ఆ ప్రభావం పరోక్షంగా అన్నింటి పైన ఉంటుంది. ఎందుకంటే ఏ రంగానికైనా సరఫరా (రవాణా), ఉత్పత్తి కోసం పెట్రోల్ లేదా డీజిల్ తప్పనిసరి. కాబట్టి ఈ ధరలు పెరిగితే అన్నింటి పైన ప్రభావం పడుతుంది. డీజిల్ ధరలు ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకుతుండటంతో రవాణా ఖర్చులు పెరిగాయి. దీంతో వివిధ ఉత్పత్తుల ధరలు పెరుగుతున్నాయి. ఇందులో భాగంగా పాల ధరలు కూడా పెరగనున్నాయి! గతంలో ఎన్నడూ లేనివిధంగా మార్చి 1వ తేదీ నుండి లీటర్ పాల ధర పైన రూ.12 వరకు పెంచాలని మధ్యప్రదేశ్ రత్లాంలోని పాల ఉత్పత్తిదారులు నిర్ణయించారు.
చమురు ధరలకు తోడు దాణా ధర షాక్
అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరుగుతుండటంతో దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయని, దీంతో పాల ఉత్పత్తిదారులం సమావేశమయ్యామని, పాల ధరలను పెంచాలని డిమాండ్ చేస్తున్నామని, గత ఏడాది రూ.2 పెంచాలని నిర్ణయించినా కుదరలేదని, దీనికి తోడు కరోనా సంక్షోభం నేపథ్యంలో ధరలు పెరగలేదని రత్లాం పాలఉత్పత్తిదారుల సంఘం వెల్లడించింది. ఇప్పుడు పెట్రోల్,డీజిల్ ధరలు భారీగా పెరిగాయని, పైగా పశువుల దాణా ధరలు పెరిగాయని చెబుతున్నారు.
ధరలు పెంచడం తప్ప మరో మార్గం లేదు
రత్లాంలోని కాళికా మాతా క్యాంపస్ రామ్ మందిర్ వద్ద పాలవ్యాపారులు సమావేశమై మార్చి 1వ తేదీ నుండి పాల ధరలను పెంచాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఇక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ.43గా ఉండగా, పెరిగిన అనంతరం రూ.55 కానుంది. ఒక పాలిచ్చే గేదె ధర రూ.1 లక్ష నుండి రూ.1.5 లక్షల వరకు కూడా ఉందని, దీనికి తోడు పెరుగుతున్న ధరల నేపథ్యంలో పాల ధరల పెంపు తప్పడం లేదని చెబుతున్నారు.