Gautam Adani: లక్ష కోట్లు కుమ్మరిస్తానంటున్న గౌతమ్ అదానీ.. కొడుకుతో కలిసి పెద్ద స్కెట్.. 7 ఏళ్ల కాలంలో..
Gautam Adani: గౌతమ్ అదానీ ముందుచూపు గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువేనని చెప్పుకోవాలి. కేవలం పదేళ్ల కాలంలో దేశంలోనే కాక అంతర్జాతీయంగానూ గుర్తింపు తెచ్చుకున్న ఈ బిజినెస్ మ్యాన్ తన బిలియన్ డాలర్ల వ్యూహంలో భాగంగా పెద్ద ప్లాన్ వేశారు. ఈ సారి ఏకంగా లక్ష కోట్లు కుమ్మరించనున్నట్లు ప్రకటించారు కూడా.
వ్యాపార విస్తరణ..
ఐటీ హబ్ గా ఉన్న కర్ణాటకలో తన వ్యాపారాలను విస్తరించాలని అదానీ నిర్ణయించుకున్నారు. ఇప్పటికే గ్రూప్ ఆ రాష్ట్రంలో దాదాపు రూ.20,000 కోట్లను ఇన్వెస్ట్ చేసింది. అయితే ఈ సారి మరిన్ని రంగాల్లో పాగా వేయాలని నిర్ణయించింది. అందుకోసం రానున్న 7 సంవత్సరాల్లో రూ.లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టాలని టార్గెట్ గా పెట్టుకుంది. ఇదే విషయాన్ని అదానీ పోర్ట్స్ అండ్ ఎస్ఈజెడ్స్ సీఈవో కరణ్ అదానీ వెల్లడీంచారు.
|
గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్..
రెండు రోజుల కిందట కర్ణాటకలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ సమయంలో మాట్లాడిన కరణ్ అదానీ తమ విస్తరణ లక్ష్యాల గురించి మాట్లాడారు. ఇందులో భాగంగా సిమెంట్, పవర్, సిటీ పైప్డ్ గ్యాస్, వంట నూనెలు, ట్రాన్స్ పోర్ట్, లాజిస్టిక్స్, డిజిటల్ రంగాల్లో ఈ పెట్టుబడులు పెడతామని వెల్లడించారు.
ఐటీ పెట్టుబడులు..
డిజిటల్ హబ్గా మారాలనే మన దేశ ఆలోచనలకు కర్ణాటక ప్రభుత్వం అలైన్మెంట్ చేయడం వల్ల కర్ణాటకలో అపూర్వమైన అభివృద్ధి జరిగిందని కరణ్ అన్నారు. ప్రస్తుతం దేశీయ ఐటీ ఎగుమతుల్లో మూడింట ఒక వంతు అక్కడి నుంచే జరుగుతున్నాయని వాటి విలువ దాదాపుగా 65 బిలియన్ డాలర్లని ఆయన చెప్పుకొచ్చారు.
సోలార్ పవర్..
రానున్న కాలంలో సోలార్ విద్యుత్ రంగంలో కర్ణాటకలో భారీగా ఇన్వెస్ట్ చేయనున్నట్లు తెలుపుతూ.. అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సైతం విస్తరించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఇతర వ్యాపారాల వల్ల సైతం ఉపాధి భారీగా పెరుగుతుందని తెలుస్తోంది. ఇదే సమావేశంలో జేఎస్డబ్యూ పవర్ సైతం ఇలాంటి భారీ విస్తరణ ప్రణాళికను వెల్లడించింది.