ముఖేష్ అంబానీ వద్దకు మైక్రోసాఫ్ట్ తర్వాత అబుదాబి కంపెనీ క్యూ!
ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ అనుబంధ జియో ప్లాట్ఫామ్స్లోకి పెద్ద మొత్తంలో పెట్టుబడులు వస్తున్నాయి. తాజాగా అబుదాబీకి చెందిన ముబాదాల ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఇందులో పెట్టుబడులు పెట్టేందుకు చర్చలు జరుపుతోందని వార్తలు వస్తున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ డిజిటల్ ప్లాట్ఫాంలో 1 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపిస్తోంది. ఈ ప్లాట్ఫాంలోకి గత నెల రోజుల్లో 10 బిలియన్ డాలర్లు పెట్టుబడులు వచ్చాయి.
రిలయన్స్ మేరీ జాన్ హై: మోడీ ప్రకటనకు ముందే.. ముఖేష్ వ్యాపార సామ్రాజ్యంలోకి మరో వారసుడు
క్యూలో అబుదాబీ కంపెనీ, మైక్రోసాఫ్ట్
అబుదాబీ కంపెనీతో పాటు మైక్రోసాఫ్ట్ కూడా రిలయన్స్ జియో ప్లాట్ఫాంలో 2 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపిస్తోందని వార్తలు వచ్చాయి. జియో ప్రపంచస్థాయి దిగ్గజ పెట్టుబడులను ఆకర్షిస్తోందని, ప్రపంచంలోని అతి పెద్ద మార్కెట్లలో ఒకటైన ఇండియాలో మరింత అత్యున్నత సేవలు అందించేందుకు ప్రయత్నాలు చేస్తోందని అంటున్నారు.
ఈ వ్యాల్యుయేషన్ వద్ద
రిలయన్స్, ముబదాల మధ్య గత కొన్ని రోజులుగా చర్చలు సాగుతున్నాయని, జియో ప్లాట్ఫాంలో 1 శాతం కంటే కాస్త ఎక్కువ వాటాను దక్కించుకోవాలని భావిస్తోందని, ఈ ఒప్పందం ముందుకు సాగితే రూ.5 ట్రిలియన్ల వ్యాల్యుయేషన్ వద్ద ఉండవచ్చునని చెబుతున్నారు. విస్టా ఈక్విటీ, సిల్వర్ లేక్ భాగస్వామ్యాల ద్వారా అంచనా వేయబడిన ఈ వ్యాల్యుయేషన్ వద్ద ఉండవచ్చు అంటున్నారు.
వరుస పెట్టుబడులు.. చర్చలు
జియో-ఫేస్బుక్ మధ్య రూ.43,574 కోట్ల డీల్ కుదిరింది. ఈ పెట్టుబడితో ఫేస్బుక్ 9.99% వాటాను దక్కించుకుంది. ఆ తర్వాత అమెరికా ప్రయివేటు ఈక్విటీ దిగ్గజం సిల్వర్ లేక్ పార్ట్నర్స్.. జియో ప్లాట్ఫామ్స్లో 1% వాటాను రూ.5,655 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ తర్వాత విస్తా ఈక్విటీ రూ.11,367 కోట్ల విలువైన 2.3% వాటాను, జనరల్ అట్లాంటిక్ పార్ట్నర్స్ రూ.6,598.38 కోట్ల పెట్టుబడితో 1.34% వాటాను కొనుగోలు చేశాయి. చివరగా కేకేఆర్ రూ.11,367 కోట్లు ఇన్వెస్ట్ చేస్తామని తెలిపింది. వీటి ద్వారా 10 బిలియన్ డాలర్లు లేదా దాదాపు రూ.78,562 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇప్పుడు మైక్రోసాఫ్ట్, ముబదాల చర్చలు జరుపుతున్నాయని తెలుస్తోంది.