రూ.1 లక్ష కోట్లకు దగ్గరగా... త్వరలోనే ముఖేష్ అంబానీ టార్గెట్ పూర్తి!
రిలయన్స్ ఇండస్ట్రీస్కు చెందిన డిజిటల్ ప్లాట్ఫామ్ జియో ప్లాట్ఫామ్స్లోకి పెట్టుబడుల వరదెత్తుతోంది. తాజాగా అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ (ADIA) సంస్థ రూ.5,683.50 కోట్ల పెట్టుబడితో 1.16 శాతం వాటాను దక్కించుకుంది. జియో ప్లాట్ఫామ్స్లో వాటాలను విక్రయించడం ద్వారా ఇప్పటి వరకు రూ.97,885.65 కోట్ల నిధులు సమకూరాయి. దాదాపు లక్ష కోట్ల సమీపానికి వచ్చింది. 2021 మార్చి నాటికి రుణరహిత సంస్థగా మార్చాలని భావిస్తున్న ముఖేష్ అంబానీ కల మరింత దగ్గరగా వచ్చి, త్వరగా సాకారమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
షాపింగ్ ఇక స్టార్ట్ చేయండి! ఏపీ, తెలంగాణల్లో ఈ నగరాల్లో జియోమార్ట్
ఏడు వారాల్లోనే..
జియో నికర వ్యాల్యూ రూ.4.91 లక్షల కోట్లు, ఎంటర్ ప్రైజెస్ వ్యాల్యూ రూ.5.16 లక్షల కోట్ల ఆధారంగా ఈ ఒప్పందం కుదిరినట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ తెలిపింది. ఇప్పటికే జియోలో ఫేస్బుక్, సిల్వర్ లేక్, విస్టా ఈక్విటీ పార్టనర్స్, జనరల్ అట్లాంటిక్, కేకేఆర్, ముబాదాల ఇన్వెస్ట్ చేశాయి. గత ఏడు వారాల వ్యవధిలో ఎనిమిది భారీ ఒప్పందాలు కుదిరాయి. ముబాదాల కంపెనీ 1.85 శాతం వాటాను కొనుగోలు చేసిన రెండు రోజులకే అబుదాబీ సంస్థ ADIA పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది.
21.06 శాతం వాటా విక్రయం
జియో ప్లాట్ఫామ్స్ల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇప్పటి వరకు 21.06 శాతం వాటాలను అమ్మివేసింది. 8 భారీ పెట్టుబడుల ద్వారా ఏడు వారాల్లో రూ.97,885.65 కోట్లు లేదా 12.96 బిలియన్ డాలర్లు సమీకరించింది. ప్రస్తుతం జియోకు 38.80 కోట్ల మంది మొబైల్ కస్టమర్లు ఉన్నారు. పెట్టుబడుల సమీకరణలో రిలయన్స్ ఇండస్ట్రీస్ దూసుకెళ్తోంది.
పెట్టుబడులు
ఈ ఇన్వెస్ట్మెంట్ తమ వ్యూహానికి, దేశానికి బలమైన ఆమోదంగా ఉందని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ అన్నారు. ADIA ప్రతినిధి హమాద్ షాహ్వాన్ మాట్లాడుతూ... జియో ప్లాట్ఫామ్స్లో పెట్టుబడి ద్వారా మార్కెట్ లీడింగ్ కంపెనీలను తమ సంస్థ ఆకర్షిస్తోందనేందుకు నిదర్శనమన్నారు.
ఇప్పటి వరకు వచ్చిన పెట్టుబడులు...
- ఫేస్బుక్ - రూ.43,573.62 కోట్లు - 9.99 శాతం వాటా
- సిల్వర్ లేక్ పార్ట్నర్స్ - రూ.5,655.75 కోట్లు - 1.15 శాతం వాటా
- విస్టా ఈక్విటీ పార్ట్నర్స్ - రూ.11,367.00 కోట్లు - 2.32 శాతం వాటా
- జనరల్ అట్లాంటిక్ - రూ.6,598.38 కోట్లు - 1.34 శాతం వాటా
- కేకేఆర్ - రూ.11,367.00 కోట్లు - 2.32 శాతం వాటా
- ముబాదాల - రూ.9,093.60 కోట్లు - 1.85 శాతం వాటా
- సిల్వర్ లేక్ (రెండోసారి) - రూ.4,546.80 కోట్లు - 0.93 శాతం వాటా
- ADIA - రూ.5,683.50 కోట్లు - 1.16 శాతం వాటా