'నేను రతన్ టాటా.. మనం కలవొచ్చా'.. ఈ మాటలు వారి తలరాతను మార్చేశాయి..
Ratan Tata: ఆ దంపతుల దగ్గర మంచి వ్యాపార ఆలోచన ఉంది. అయితే వారిని నడిపించేందుకు ఒక అనుభవజ్ఞుడైన దిక్సూచి కావాలి. అది రతన్ టాటా అయితే బాగుంటుందని వారికి అనిపించింది. కానీ.. ఆయనను కలవగలమా..? ఆయన ఎలా స్పందిస్తారనే ఆందోళన వారిలో ఉంది. వారి ప్రయత్నాల కారణంగా ఒకరోజు కల నిజమైంది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
గొప్ప వ్యాపార ఆలోచన..
అదితి భోసలే వాలుంజ్, చేతన్ వాలుంజ్ మొబైల్ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ వెహికల్' సొల్యూషన్ను ప్రారంభించారు. అయితే వ్యాపారంలో విజయం సాధించటానికి తమకు ఒక మెంటార్ అవసరమని ఈ వ్యవస్థాపకులు గుర్తించారు. ఎందుకంటే వారిద్దరికీ వ్యాపార విషయాలపై పట్టులేదు. అయితే వైఫల్యాల నుంచి విజయాన్ని సాధించగలమని అదితి భోసలే వాలుంజ్ లింక్డ్ఇన్లో రాశారు.
రతన్ టాటాను కలిసేందుకు ప్రయత్నం..
టాటా గ్రూప్ ఛైర్మన్ రతన్ టాటను కలవటం అసాధ్యమని, ఆయనను కలవటం అస్సలు కుదరదని వారికి కొందరు చెప్పిన మాటలను వారు పక్కన పెట్టారు. లేదు అనే మాటకు చోటులేకుండా ముందుకు సాగారు. తమ వ్యాపార నమూనా గురించిన పూర్తి వివరాలను వారు రతన్ టాటకు లేఖల రూపంలో రాసి పంపారు.
రతన్ టాటా నుంచి కాల్..
లేఖలు అందించిన తరువాత వారు టాటా ఇంటి బయట దాదాపు 12 గంటల పాటు వేచి చూశారు. అయితే చివరికి ఆ దంపతులు రాత్రి తమ హోటల్ గదికి తిరిగి వెళ్లిపోయారు. రాత్రి 10 గంటల సమయంలో ఒక కాల్ వచ్చింది. 'హాయ్! నేను అదితితో మాట్లాడగలనా?," అని రతన్ టాటా అన్నారు. లైన్కి అవతలి వైపు ఎవరు అని ఆమె అడగటంతో.. "ఇది ఇక్కడ రతన్ టాటా. నాకు మీ ఉత్తరం వచ్చింది. మనం కలుసుకోగలమా?" అంటూ జరిగిన సంభాషణను అదితి ఇంకా మరిచిపోలేదు. అలా అపాయింట్ మెంట్ దొరకటంతో ఆయనను కలిసి సుమారు 3 గంటల పాటు తమ వ్యాపారం గురించిన ప్రజెన్టేషన్ వారు అందించారు. వారి కల నెరవేరటంతో కన్నీటి పర్యంతమయ్యారు.
వారి వ్యాపారం ఏమిటంటే..
నూతన సాంకేతికత ద్వారా దేశంలోని చివరి మైలు వరకు ఇంధనాన్ని ఎలా డెలివరీ చేయాలన్నది వారి వ్యాపార మోడల్. వారి సంస్థ పేరు రెపోస్ ఎనర్జీ. తాము ప్రజలకు సేవ చేయటంలో తమకు సాయం చేయాలని వారు టాటాను కోరారు. దీనికి ఆయన సరే అని స్పందించారు. 2019లో అతని మొదటి టోకెన్ పెట్టుబడిని స్వీకరించడం, 2022 ఏప్రిల్లో మరొక రౌండ్ను పొందారు. దీనికి సహకరించిన ఆఫీస్ పర్సనల్ మేనేజర్ శాంతను నాయుడు, డిప్యూటీ జనరల్ మేనేజర్కి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. అలా వారి వ్యాపారానికి రతన్ టాటా సహాయం అందిందంటూ ఆమె గుర్తుచేసుకున్నారు.