7th Pay Commission: డీఏ కనీసం 4%: జేసీఎం అంచనాలివీ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్దారుల ఎదురు చూపులు ఫలించేలా కనిపిస్తోన్నాయి. ఏడాదిన్నర కాలంగా వాయిదా పడుతూ వస్తోన్న డియర్నెస్ అలవెన్స్ (Dearness Allowance) ఎట్టకేలకు విడుదల కావడానికి అవకాశాలు ఉన్నాయి. 7వ వేతన సవరణ సంఘం దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి తమ నివేదికను అందించింది. వచ్చేనెల 1వ తేదీ నాటికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన డీఏపై అనుకూలంగా ఓ ప్రకటన వెలువడుతుందనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి.
కనీసం నాలుగు శాతం మేర డీఏ పెంపు ఉండొచ్చని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ జాయింట్ కన్సల్టేటివ్ మిషనరీ (జేసీఎం) అంచనా వేసింది. ఉద్యోగుల మూల వేతనంలో నాలుగు శాతం మేర పెంపు ఉంటుందని అభిప్రాయపడింది. డీఏ పెంపుదలపై తాము నిరంతరం డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్, కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ, డిపార్ట్మెంట్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ అధికారులతో సంప్రదింపులు నిర్వహిస్తున్నామని జేసీఎం ఉద్యోగుల విభాగం కార్యదర్శి శివ గోపాల్ మిశ్రా వెల్లడించారు.
కరోనా వైరస్ సెకెండ్ వేవ్ ప్రభావం వల్ల ఏప్రిల్ చివరివారంలో ప్రకటించాల్సిన డీఏ పెంపుదలను తొలుత మే, ఆ తరువాత జూన్కు వాయిదా వేసినట్లు ఆయా శాఖల అధికారులు సమాచారం ఇచ్చినట్లు మిశ్రా పేర్కొన్నారు. ఈ సారి వాయిదా పడకపోవచ్చని వారు హామీ ఇచ్చినట్లు తెలిపారాయన. డియర్నెస్ అలవెన్స్, డియర్నెస్ రిలీఫ్ను ప్రకటించడంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే జాప్యం చేసిందని, మరోసారి జాప్యం ఉండబోదని తాము ఆశిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ ఏడాది జూన్ లేదా జులైల్లో డీఏను పునరుద్ధరిస్తామంటూ కేంద్ర ప్రభుత్వం ఇదివరకే రాజ్యసభలో హామీ సైతం ఇచ్చిందని మిశ్రా గుర్తు చేశారు.
గత ఏడాది జులై నుంచి డిసెంబర్ మధ్యకాలంలో ద్రవ్యోల్బణం 3.5 శాతంగా నమోదైందని, దీన్ని ఆధారంగా చేసుకుంటే.. డీఏ పెంపు కనీసం నాలుగు శాతంగా ఉండొచ్చని తాము అంచనా వేస్తున్నట్లు శివ గోపాల్ మిశ్రా తెలిపారు. దేశవ్యాప్తంగా 52 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారని, వారందరికీ చెల్లించాల్సిన డీఏ పెంపు మొత్తాన్ని ఏక మొత్తంలో విడుదల చేయలేకపోయినట్టయితే- విడతల వారీగానైనా ఇవ్వాలని తాము ఇదివరకే ఆర్థిక మంత్రిత్వ శాఖకు విజ్ఞప్తి చేశామని చెప్పారు.