63,000 రోబోలతో పనిచేయిస్తున్న ఐటీ కంపెనీ గురించి తెలుసా?
ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా ... ఆటోమోషన్... ఆటోమేషన్ అని కలువరిస్తున్నారు. ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగంలో అయితే దీని గురించి చెప్పక్కరలేదు. ప్రతి పనిలోనూ రోబోటిక్స్ వాడకం కూడా అధికమైపోయింది. ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ ద్వారా ప్రతి పనిలోనూ ఖచ్చితత్వం సాధించేందుకు, చిన్న చిన్న పనులు, రిపీటెడ్ గా చేసే పనులను ఇక ముందు మనుషులు చేసే పరిస్థితులు కనిపించటం లేదు. అలాంటి మెకానికల్ జాబ్స్ అన్నీ కూడా రోబోలతో జరిగిపోయేలా ఉన్నాయి. ఎక్కడో జపాన్ లోనో, అమెరికా, చైనా లోనో రోబోట్స్ ను అధికంగా వాడుతారని తెలుసు కానీ... మన దేశంలో కూడా వీటి వినియోగం బాగా పెరిగిపోయిందని ఇప్పుడిప్పుడే తెలుస్తోంది.
మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో రోబోల రంగ ప్రవేశం చాలా కాలం క్రితమే జరిగిపోయినా... ఇప్పుడు ఆ కృత్రిమ మేధతో కూడిన మెషిన్ లు సాఫ్ట్ వేర్ కంపెనీల చెంతకు చేరిపోతున్నాయి. అందుకే, ఐటీ రంగంలో పనిచేస్తున్న సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్స్ వీటితో తమ ఉద్యోగాలకు ముప్పు పొంచి ఉందని ఆందోళన చెందుతున్నారు. కానీ, అవి వచ్చేందుకు మరో 4-5 ఏళ్ళు పడుతుందిలే ... అప్పుడు చూద్దాం అని సరిపెట్టుకునే వారి సంఖ్య కూడా భారీగానే ఉంది. అయితే, రోబోలు రావటమే కాదు వేల సంఖ్యకు చేరుకుంటున్నాయి కూడా.
యాక్సెంచర్ లో భారీగా రోబోలు...
ఐటీ కన్సల్టింగ్, డిజిటల్ సేవలు అందించే యాక్సెంచర్ కంపెనీ ఆటోమేషన్ లో మిగితా కంపెనీలతో పోల్చే చాలా ముందుంది. అంతే కాదు ఇందుకోసం ఏకంగా ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం యాక్సెంచర్ కంపెనీ కి ఇండియాలో 63,000 రోబోల సైన్యం ఉంది. ఈ విషయంలో ఇండియాలో మరే ఇతర కంపెనీకి కూడా ఇంత భారీ స్థాయిలో రోబోలు లేకపోవటం విశేషం. 1,40,000 ఉద్యోగులతో కూడిన 6 బిలియన్ డాలర్ల ప్రత్యేక డివిజన్ లో భాగంగా ఈ రోబోలు పనిచేస్తాయి. అయితే, రోబోలు రంగ ప్రవేశం చేశాయి కాబట్టి... ఆ విభాగంలో జాబ్స్ పోతాయని కంగారు పడాల్సిందేమి లేదని ఇవాళ్టి నుంచి ఏర్పాటయ్యే కొత్త విభాగ అధిపతి మనీష్ శర్మ హామీ ఇచ్చారు. ది ఎకనామిక్ టైమ్స్ పత్రిక కు ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ లో అయన ఈ వివరాలను వెల్లడించారు.
సూపర్వైజర్లుగా ఉద్యోగులు...
అతి సామాన్యమైన, రిపీటెడ్ గా చేసే పనులను యాక్సెంచర్ లో ఇకపై రోబోలతో చేయిస్తామని, వాటికి ఉద్యోగులు సూపర్వైజర్లుగా వ్యవహరిస్తారని మనీష్ శర్మ చెప్పారు. ప్రపంచంలో ఎక్కడైనా మా ఉద్యోగులు ఇక ఎంత మాత్రం బోరింగ్ జాబ్స్ చేయాల్సిన పనిలేదు అని అయన పేర్కొన్నారు. కంపెనీల మరింత సమర్థవంతంగా చేసేందుకు రోబోలు తోడ్పడతాయని తెలిపారు. అయితే, కంపెనీలు అంత ప్రాధాన్యం లేని, పనికిమాలిన ప్రాసెస్ ఆటోమేషన్ కోసం రోబోలను వినియోగిస్తే ఫలితాలు అంతకంటే భిన్నంగా ఏమి ఉండవని హెచ్చరించారు.
భారీ ఇన్నోవేషన్స్...
తమ క్లైంట్స్ కు భారీ స్థాయిలో ఇన్నోవేషన్ ఫలితాలను అందించేందుకు రోబోలు తోడ్పడతాయని శర్మ పేర్కొన్నారు. ఒకప్పుడు ఐటీ కంపెనీలో ఎంత మంది పూర్తిస్థాయి బిల్లింగ్ చేయగలిగే ఉద్యోగులు ఉన్నారు అనే దానిపై ప్రాజెక్టులు దక్కేవి. కానీ ఇప్పుడు ప్రతి క్లయింట్ ను తమ భాగస్వామిగా చూస్తున్నాం. వారికి నిజమైన ఫలితాలను డెలివరీ చేయటమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. కాబట్టి, ఈ రంగంలో కొత్త నవకల్పనల ఫలితాలను వారికి పూర్తిస్థాయిలో బదిలీ చేయటమే ప్రధాన ఉద్దేశంగా ఉంటోంది అని మనీష్ శర్మ పేర్కొన్నారు. అందుకే రోబోలతో మెరుగైన ఫలితాలను సాధించాలని భావిస్తున్నాం అని చెప్పారు. చూడాలి మరి, ఇండియా లో ఇంకెన్ని కంపెనీలు రోబోలను తెస్తాయో.. వాటితో ఎలాంటి పనులు చేయిస్తాయో!