కొత్త ఐటీ ఫైలింగ్ పోర్టల్ ద్వారా 6.17 కోట్ల ఐటీ రిటర్న్స్ దాఖలయ్యాయి
దేశవ్యాప్తంగా 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను 6.17 కోట్లమంది ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేసినట్లు సీబీడీటీ వెల్లడించింది. ఇందులో 19 లక్షలమంది ట్యాక్స్ ఆడిట్ రిప్రోట్స్ను కొత్త ఐటీ ఈ-ఫైలింగ్ పోర్టల్ కింద దాఖలు చేశారని వెల్లడించింది. ఇందులో 48 శాతం ఐటీఆర్-1 (2.97 కోట్లమంది), తొమ్మిది శాతం ఐటీఆర్-2 (56 లక్షలు) 13 శాతం ఐటీఆర్-3 (81.6 లక్షలు), 27 శాతం ఐటీఆర్-4 (1.65 కోట్లు), ఐటీఆర్-5 (10.9 లక్షలు), ఐటీఆర్-6 (4.84 లక్షలు), ఐటీఆర్-7 (1.32 లక్షలు) ఉన్నారు.
ఇదిలా ఉండగా, 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పైన వివిధ రంగాలు, సామాన్యుల నుండి ఉద్యోగుల వరకు కోటి ఆశలు పెట్టుకున్నారు. ఈ బడ్జెట్ ముఖ్యంగా వేతనజీవులకు నిరాశను కల్పించింది. వివిధ రంగాలకు మాత్రం పెద్దపీట వేసింది. ఈ బడ్జెట్లో మౌలిక సదుపాయాలు, విద్య, వ్యవసాయం, ఎంఎస్ఎంఈ, రక్షణ రంగం సహా వివిధ రంగాలకు భారీ ప్రతిపాదనలు చేశారు నిర్మలమ్మ. అయితే ఆదాయపు పన్నుపై ఎలాంటి ఊరట దక్కలేదు.
వేతనజీవులకు నిర్మలా సీతారామన్ పన్ను మినహాయింపులకు సంబంధించి ఎలాంటి ఊరటను కల్పించలేదు. చాలామంది ఉద్యోగులు ఆదాయపు పన్ను మినహాయింపులపై ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి రూ.1.50 లక్షల నుండి రూ.2 లక్షలకు, పీఎఫ్ పన్ను మినహాయింపు పరిమితి రూ.2.5 లక్షల నుండి రూ.5 లక్షలకు, స్లాబ్ రేటు మార్పులు... ఇలా ఎన్నో అంశాలు ఉన్నాయి. కానీ వీటిపై ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే ఐటీ రిటర్న్స్ దాఖలులో మాత్రం కాస్త ఊరట కల్పించారు. ఆదాయపు పన్ను చెల్లింపుల్లో సవరణలకు రెండేళ్లలో అప్ డేట్ చేసుకునే వెసులుబాటును కల్పించారు. అంటే రిటర్న్స్ సమర్పించిన తర్వాత రెండేళ్లలో సవరణలు చేసుకోవచ్చు.