ఢిల్లీలో అత్యధిక ధనిక ఎమ్మెల్యే ధర్మపాల్, పేద ఎమ్మెల్యే రాఖీ: భారీగా పెరిగిన ఆస్తులు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది. కేజ్రీ నేతృత్వంలోని ఈ పార్టీ 54 శాతం ఓట్లతో 62 సీట్లు గెలుచుకోగా, కమలం పార్టీ 38 శాతం ఓట్లతో 8 స్థానాలు దక్కించుకుంది. కాంగ్రెస్ ఒక్క సీటు గెలుచుకోలేదు. పైగా ఓటు బ్యాంకు నాలుగు శాతానికి పడిపోయింది. ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అత్యంత ధనిక, ఆస్తులు తక్కువగా ఉన్న ఎమ్మెల్యేల విషయానికి వస్తే...
ఆరేళ్ల తర్వాత గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంపు: హైదరాబాద్లో ఎంత, రాయితీ ఎంత వస్తుందంటే?
ఏఏపీ నుండి 45, బీజేపీ నుండి 7గురు
70 మంది ఢిల్లీ ఎమ్మెల్యేల్లో 52 మంది కోటీశ్వరులు ఉన్నారని ఏడీఆర్ రిపోర్ట్ ద్వారా వెల్లడైంది. 62 మంది ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేల్లో 45 మంది, 8 మంది బీజేపీ ఎమ్మెల్యేల్లో 7గురు కోటీశ్వరులు. అంటే వీరి ఆస్తులు రూ.1 కోటి కంటే ఎక్కువగా ఉన్నాయి.
ఇరు పార్టీల ఎమ్మెల్యేల సరాసరి ఆస్తులు
ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేల ఆస్తులు సరాసరిన రూ.14.96 కోట్లు ఉండగా, బీజేపీ ఎమ్మెల్యేల ఆస్తులు కలుపుకుంటే ఒక్కొక్కరి చొప్పున సరాసరిన రూ.9.10 కోట్లు ఉన్నాయి.
ధనిక ఎమ్మెల్యే
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన అత్యంత ధనిక ఎమ్మెల్యేల్లో మండ్కా నియోజకవర్గం నుండి గెలిచిన ధర్మపాల్ లక్రా ముందున్నారు. ఆయన ఆస్తులు రూ.292 కోట్లు. ఈ కొత్త అసెంబ్లీలో అత్యంత ధనిక ఎమ్మెల్యే ఇతను.
రెండు, మూడో స్థానాల్లో వీరే...
అత్యంత ధనిక ఎమ్మెల్యేల్లో రెండో స్థానంలో ఆర్కే పురం ఎమ్మెల్యే ప్రమీలా తోకాస్ ఉన్నారు. వీరి ఆస్తులు రూ.80 కోట్లు. పటేల్ నగర్ ఎమ్మెల్యే రాజ్ కుమార్ రూ.78 కోట్లతో మూడో స్థానంలో ఉన్నారు. రాజౌరీ గార్డెన్ నుండి గెలిచిన ధనావంతి చండేలా ఆస్తులు రూ.57, ఉత్తమ్ నగర్ ఎమ్మెల్యే నరేష్ బాల్యన్ ఆస్తులు రూ.56.3 కోట్లు ఉంది.
తక్కువ ఆస్తులున్న ఎమ్మెల్యే
అతి తక్కువ ఆస్తులు ఉన్న ఎమ్మెల్యేల్లో మంగోళ్పూరి నుండి గెలిచిన రాఖీ బిర్లా ఉన్నారు. 2015లో ఈమె ఆస్తులు రూ.18,000. ఇప్పుడు రూ.76,000గా ప్రకటించారు. ఆ తర్వాత అతి తక్కువ ఆదాయం ఉన్న వారిలో... బురారీ ఎమ్మెల్యే సంజీవ్ ఝా రూ.9.6 లక్షలు, సాదర్ బజార్ ఎమ్మెల్యే సోమ్ దత్ రూ.11.9 లక్షలు, కైరారీ ఎమ్మెల్యే రితూరాజ్ ఝా రూ.14 లక్షలు, పాలం ఎమ్మెల్యే భవనా గౌర్ రూ.14.2 లక్షలతో ఉన్నారు.
ఎమ్మెల్యేల సగటు ఆస్తి
2015లో గెలిచిన 70 మంది ఎమ్మెల్యేల ఆస్తులు సగటున రూ.6.29 కోట్లుగా ఉండగా, ఇప్పుడు రెండింతల కంటే ఎక్కువ పెరిగి రూ.14.29 కోట్లుగా ఉంది. ఏఏపీ కోటీశ్వరులు 77 శాతంగా ఉండగా, బీజేపీ కోటీశ్వరులు 88 శాతంగా ఉన్నారు.