జియో ఫోన్లకూ.. ‘ఆల్ ఇన్ వన్’ ప్లాన్లు వచ్చేశాయ్!
రిలయన్స్ జియో తాజాగా జియో ఫోన్లకూ 'ఆల్ ఇన్ వన్' రీఛార్జ్ ప్లాన్లను ప్రకటించింది. తన నెట్ వర్క్ వినియోగదారుల నుంచి ఇంటర్ కనెక్ట్ యూసేజ్ ఛార్జెస్(ఐయూసీ) వసూలు చేయడం మొదలెట్టాక.. జియో 'ఆల్ ఇన్ వన్' పేరుతో కొత్త ప్లాన్లను అమలులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇవి ఇప్పటి వరకు జియో నెట్ వర్క్ను వినియోగించే స్మార్ట్ఫోన్ వినియోగదారులకు మాత్రమే వర్తించాయి.
అయితే తాజాగా రిలయన్స్ జియో.. తన జియో ఫోన్ వినియోగదారుల కోసం కూడా ఈ రకమైన 'ఆల్ ఇన్ వన్' ప్లాన్లను ప్రకటించింది. ఈ ప్లాన్లలో అన్లిమిటెడ్ కాలింగ్, డేటా సదుపాయాలు ఉన్నాయి. జియో నుంచి జియోకి అన్ లిమిటెడ్ కాలింగ్ ఉంటుంది. ఇక ఇతర నెట్వర్క్లకు 500 ఐయూసీ నిమిషాలు ఈ ప్లాన్లలో జత చేసింది. అయితే ఈ ప్లాన్ల కాలపరిమితి మాత్రం నెలరోజులే.
జియో తాజా 'ఆల్ ఇన్ వన్' ప్లాన్లలో రూ.75కు 3జీబీ డేటా, రూ.125కు 14 జీబీ డేటా, రూ.155కు 28 జీబీ డేటా, రూ.185కు 56 జీబీ డేటా లభిస్తుంది. ప్రస్తుతం వినియోగదారులు ఏ ప్లాన్లలో ఉన్నప్పటికీ దానికి కొంత మొత్తం అదనంగా చెల్లించడం ద్వారా ఈ కొత్త ప్లాన్లకు మారిపోవచ్చు. ఇతర నెట్వర్క్ల ప్లాన్లతో పోల్చి చూసుకుంటే.. జియో అత్యంత చౌక అయిన ప్లాన్.. జియో అందిస్తోన్న రూ.75 అని సంస్థ పేర్కొంది.
స్మార్ట్ ఫోన్లకేమో ఇలా...
స్మార్ట్ఫోన్లు కలిగి ఉండి, వాటిలో జియో సిమ్ వాడుతున్న వినియోగదారులకోసం ఇటీవల జియో ప్రకటించిన ప్లాన్లు ఈ విధంగా ఉన్నాయి. రూ.222, రూ.333, రూ.444కు జియో ఈ ఆల్ ఇన్ వన్ ప్లాన్లు ప్రవేశపెట్టింది. వీటిలో అన్ లిమిటెడ్ కాలింగ్తోపాటు రోజుకు 2 జీబీల వరకు డేటా సదుపాయం ఉంటుంది. జియో నుంచి జియోకు కాల్స్ ఉచితం. అంతేకాకుండా ఇతర నెట్వర్క్లకు కాల్స్ చేసుకునేందుకు 1000 నిమిషాల టాక్ టైం జతచేసి ఉంటుంది.