షాక్, రూ.53 వేలకోట్ల ఇన్ఫోసిస్ ఇన్వెస్టర్ల సంపద ఆవిరి: అమెరికాలో దావా, రంగంలోకి SEBI?
ముంబై/బెంగళూరు: ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్, సీఎఫ్ఓ నీలాంజన్ రాయ్ల మీద గుర్తు తెలియని ఉద్యోగుల బృందం ఆరోపణల చేసిన నేపథ్యంలో ఆడిట్ కమిటీ స్వతంత్ర దర్యాఫ్తు చేపడుతోందని ఆ సంస్థ నాన్ ఎగ్జిక్టూయివ్ చైర్మన్ నందన్ నీలేకని అన్నారు. సెప్టెంబర్ 20న అనైతిక పద్ధతుల పేరిట ఒక లేఖ, సెప్టెంబర్ 30వ తేదీన ప్రజావేగు ఫిర్యాదు పేరిట మరో లేఖ అందినట్లు తెలిపారు. శార్దూల్ అమర్ చంద్ మంగళ్ దాస్ అండ్ కంపెనీని స్వతంత్ర దర్యాఫ్తు కోసం సంప్రదించామని, దర్యాఫ్తు ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. అమెరికాకు చెందిన ప్రజావేగు ప్రొటక్షన్ ప్రోగ్రాంకు కూడా ఉద్యోగుల బృందం అక్టోబర్ 3న లేఖ రాసినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఆరోపణలపై ఎలాంటి ఆధారాల్లేవని, కానీ పూర్తిస్థాయి విచారణ జరుగుతుందన్నారు.
ఇన్ఫోసిస్ సీఈవోపై ఫిర్యాదు, ఏం జరుగుతోంది?
రూ.53 వేల కోట్ల ఇన్ఫీ ఇన్వెస్టర్ల సంపద ఆవిరి
ఇన్ఫోసిస్ ఇష్యూ ఇప్పటికి ముగిసేలా కనిపించడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. విజిల్ బ్లోయర్స్ లేఖ నేపథ్యంలో మంగళవారం ఇన్ఫీ షేర్లు దాదాపు 17 శాతం మేర నష్టపోయాయి. తీవ్రఆందోళనకు గురైన ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున అమ్మకాలకు ఆసక్తి చూపించారు. దీంతో BSEలో 16.21 శాతం క్షీణించి రూ.643.30 వద్ద స్థిరపడింది. NSEలో 16.86 శాతం పతనమై రూ.638.30 వద్ద నిలిచింది. గత ఆరేళ్లలో ఇన్ఫీ షేర్ విలువ ఈ స్థాయికి దిగజారడం ఇదే మోదటిసారి. 2013 ఏప్రిల్ నాటి కనిష్ఠాన్ని తాకింది. ఒకానొక దశలో రూ.640 స్థాయికి చేరింది. ఇన్వెస్టర్ల సంపద రూ.53,450.92 కోట్లు హరించుకుపోయింది. BSEలో ప్రస్తుతం ఇన్ఫోసిస్ మార్కెట్ విలువ రూ.2,76,300.08 కోట్లుగా ఉంది.
సెబి రంగంలోకి దిగుతుందా?
ఇన్ఫోసిస్ వ్యవహారంలో ఇప్పటికే అంతర్గత విచారణ సాగుతోంది. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) కూడా మేనేజ్మెంట్ నుంచి వివరణ కోరే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ప్రజావేగు ఫిర్యాదులపై అడగవచ్చునని తెలుస్తోంది. అవసరమైతే సెబి విచారణలోకి దిగే అవకాశాలు కొట్టి పారేయలేమని అంటున్నారు.
చులకనగా మాట్లాడేవారు...
ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ పైన తీవ్ర ఆరోపణలు చేయడంతో పాటు ఆయన చులకనగా మాట్లాడేవారని కూడా విజిల్ బ్లోయర్స్ తమ లేఖలో పేర్కొన్నారు. జాత్యహంకార వ్యాఖ్యలు చేశారన్నారు. భారీ ఒప్పందాల గురించి వారికి చెప్పినా అర్థంకాదని, వారికి షేర్ విలువ పెరిగితే చాలంటూ బోర్డులోని డీఎన్ ప్రహ్లాద్, డీ సుందరం, కిరణ్ మజుందార్ షాలను పరేఖ్ తేలిగ్గా తీసిపారేశారన్నారు. ప్రహ్లాద్, సుందరంలు మద్రాసీలు, మజుందార్ షా దివా వెర్రి ప్రశ్నలు వేస్తారు, వారిని మీరు పట్టించుకోనక్కర్లేదని, వదిలేయండని సలీల్ పరేఖ్ అన్నట్లుగా లేఖలో పేర్కొన్నారు. ఇందుకు తమ వద్ద ఆధారాలు ఉన్నట్లు చెప్పారు. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ, ఒడిశా, లక్షద్వీప్వాసులకు ప్రతిభ ఉండదన్నట్లు వ్యవహరించేవారన్నారు. ప్రహ్లాద్ సూర్య సాఫ్ట్వేర్ సిస్టమ్స్ ప్రయివేటు లిమిటెడ్ వ్యవస్థాపక సీఈవోగా, సుందరం.. టీవీఎస్ క్యాపిటల్ ఫండ్స్ లిమిటెడ్ వైస్ చైర్మన్, ఎండీగా, కిరణ్ మజుందార్ షా.. బయోకాన్ సీఎండీగా ఉన్నారు.
అమెరికా సంస్థ దావా
ఇన్ఫోసిస్ పైన అమెరికా న్యాయ సంస్థ దావా వేసేందుకు సిద్ధమవుతోంది. సీఈవో, సీఎఫ్వోల అనైతిక చర్యలపై ఇన్ఫోసిస్ బోర్డుతో పాటు అమెరికా సెక్యూరిటీస్ & ఎక్సేంజd కమిషన్కు విజిల్బ్లోయర్లు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో అమెరికా న్యాయ సంస్థలు ఇన్ఫీ విషయమై దృష్టి సారించాయి. ఇందులో భాగంగానే సెక్యూరిటీస్ అంశాల్లో గుర్తింపు కలిగిన రోజెన్ న్యాయ సంస్థ.... ఇన్వెస్టర్ల తరఫున అన్ని రకాల లోపాలపై దర్యాప్తును కొనసాగించాలని ఇన్ఫోసిస్కు సూచిస్తోంది. ఇన్ఫోసిస్ ఇన్వెస్టర్ల నష్టాలను భర్తీ చేసేందుకు ఓ క్లాస్ యాక్షన్ లాసూట్ను రోజెన్ లా సంస్థ సిద్ధం చేస్తోంది. ఇలాంటి ఆరోపణలు వస్తే అమెరికా స్టాక్ మార్కెట్లలో ట్రేడ్ అవుతున్న షేర్ల కంపెనీలకు ఈ తరహా నోటీసులు సాధారణంగా వస్తాయి.