ఇన్ఫోసిస్ విజిల్ బ్లోయర్స్ ఫిర్యాదులు, స్టాక్ ఎక్స్చేంజ్కు నందన్ నీలేకని
ముంబై: ఉన్నతాధికారులపై విజిల్ బ్లోయర్ ఫిర్యాదుల నేపథ్యంలో ఇన్ఫోసిస్ ఆడిట్ కమిటీ పరిశీలిస్తోందని, ఈ దర్యాఫ్తు పారదర్శకంగా, స్వతంత్రంగా ఉంటుందని, అందుకే సీఈవో, సీఎఫ్ఓలను ఇందులో నుంచి ఉపసంహరించామని ఇన్ఫీ చైర్మన్ నందన్ నీలేకని మంగళవారం (అక్టోబర్ 22) స్టాక్ ఎక్స్చేంజీకి తెలియజేశారు. ఇన్ఫోసిస్ దర్యాఫ్తు సారాంశాన్ని తగిన సమయంలో అందిస్తామని, కార్పోరేట్ పాలనాప్రమాణాలను పాటిస్తామని, అలాగే, వాటాదారుల ప్రయోజనాలను పరిరక్షిస్తామని, ఇందుకు ఇన్ఫోసిస్ బోర్డు కట్టుబడి ఉందని ఆయన తెలిపారు.
ఇన్ఫోసిస్ అనైతిక విధానాల ఆరోపణల్లో చిక్కుకుంది. సీఈవో సలీల్ పరేఖ్, సీఎఫ్ఓ నీలాంజన్ రాయ్ స్వల్పకాలిక ఆదాయాలు, లాభాలను పెంచి చూపించేందుకు అనైతిక విధానాలు పాటిస్తున్నట్లు కంపెనీకి చెందిన కొంతమంది గుర్తు తెలియని ఉద్యోగులు బోర్డుకు ఫిర్యాదు చేశారు. ఇది సంచలనం రేపుతోంది. ఈ నేపథ్యంలో కంపెనీ షేర్లు మంగళవారం పది శాతం నుంచి 15 శాతం మధ్య పడిపోయాయి. మరోవైపు, నందన్ నీలేకని స్టాక్ ఎక్స్చేంజ్కు సమాచారం ఇచ్చారు.
షేర్లు లాభాల్లో ఉంటే పట్టించుకోరు..: ఇన్ఫోసిస్ సీఈవో 'పక్కదారి' పట్టించారని ఆరోపణలు
అక్టోబర్ 11, 2019 నాటి బోర్డు సమావేశం అనంతరం ఆడిట్ కమిటీ స్వతంత్ర అంతర్గత ఆడిటర్లతో సంప్రదింపులు జరిపింది. స్వతంత్ర దర్యాఫ్తు జరిపేందుకు న్యాయ సంస్థ పార్థూల్ అమర్ చంద్ మంగళదాస్ అండ్ కంపెనీని సంప్రదించినట్లు కూడా స్టాక్ ఎక్స్చేంజ్కు తెలిపారు.
కంపెనీకి చెందిన పేరు తెలియని విజిల్ బ్లోయర్స్ ఫిర్యాదుల నేపథ్యంలో చర్యలు తీసుకుంటున్నామని, ఓ బోర్డు సభ్యుడికి సెప్టెంబర్ 30, 2019న రెండు ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ఈ విషయాన్ని అక్టోబర్ 10, 11 తేదీల్లో బోర్డ్ నాన్ ఎగ్జిక్యూటివ్ కమిటీల ముందు ఉంచామని చెప్పారు. ఈ ఫిర్యాదులు వరుసగా పరిశీలిస్తున్నామని తెలిపారు.