పెన్షన్ వయస్సు 60కి పెరుగుతుంది!: మీకు అదనపు ప్రయోజనాలివీ...
న్యూఢిల్లీ: పెన్షన్ పొందడానికి వయోపరిమితిని ప్రస్తుతం ఉన్న 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచాలని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ప్రతిపాదిస్తోంది. పింఛన్ లబ్ధిదారులు వయో పరిమితిని పెంచుకునే వెసులుబాటును కల్పించాలని చూస్తోంది. అంతేకాదు, 60 ఏళ్లు వచ్చాక పెన్షన్ తీసుకున్న వారికి కొంత అదనంగా బోనస్తో ప్రోత్సాహకాలు కూడా ఇవ్వాలని భావిస్తోంది. వయో పరిమితిని రెండేళ్లు పొడిగించడం ద్వారా ఉద్యోగి పెన్షన్ మొత్తం పెరుగుతుంది. నవంబర్ నెలలో జరిగే సీబీటీ సమావేశంలో ఈ ప్రతిపాదన చేయనుంది.
ఆదాయపు పన్ను శుభవార్త: వారికి రూ.7,00,000 బెనిఫిట్
ప్రపంచవ్యాప్తంగా 65... మనవద్ద 58
ప్రపంచవ్యాప్తంగా పెన్షన్ అందుకునే వయస్సు 65 ఏళ్లుగా ఉందని, కాబట్టి మన వద్ద ఉన్న 58 ఏళ్ల వయస్సును 60 ఏళ్లకు పెంచవలసిన అవసరం ఉందని ఈపీఎఫ్ యాక్ట్, 1952 సవరణలో రిటైర్మెంట్ ఫండ్ మేనేజర్ చెప్పారు. ఈ పెన్షన్ పొందే వయస్సును ప్రభుత్వ పెన్షన్ స్కీం, నేషనల్ పెన్షన్ స్కీంకు అనుసంధానించాలని ఈపీఎఫ్ఓ అభిప్రాయపడింది. ఓసారి సీబీటీ ఆమోదం పొందిన తర్వాత ఈ ప్రతిపాదనను కార్మిక మంత్రిత్వ శాఖ కేబినెట్ ఆమోదం కోసం పంపిస్తుందని చెబుతున్నారు.
పెన్షన్ వయో పరిమితి పెంచితే...
ఈపీఎఫ్ఓ ప్రకారం వయో పరిమితిని పెంచడం వల్ల పెన్షన్ ఫండ్ లోటు రూ.30,000 కోట్లను తగ్గిస్తుందని చెబుతున్నారు. అలాగే, సబ్స్క్రైబర్లకు కూడా రెండు సంవత్సరాలు ఎక్కువగా కలిసి వస్తాయి. అదనపు ప్రయోజనాలు ఉంటాయి. ఎంప్లాయీస్ పెన్షన్ స్కీం 1955 ప్రకారం ఒక ఉద్యోగి జీతంలో 8.33 శాతం పెన్షన్కు వెళ్తుంది.
వయో పరిమితి పెంపు ఆలోచన.. ఏళ్లుగా
కాగా, రిటైర్మెంట్ తర్వాత పింఛన్ పొందే వయస్సును 60 సంవత్సరాలకు పెంచే ఆలోచన ఈఫీఎఫ్ఓ మదిలో ఎప్పటి నుంచో ఉంది. ఉద్యోగుల పెన్షన్ పథకం (ఈపీఎస్ 95) కింద ప్రస్తుతం 58 ఏళ్ల వరకు నిధులను ఉద్యోగి/సంస్ధ జమ చేస్తుంది. 58 సంవత్సరాలు నిండిన తర్వాత పెన్షన్ అందిస్తోంది. మరోవైపు, వాలంటరీ రిటైర్మెంట్ ప్రకటించిన వారికి పెన్షన్ అర్హత వయసు ప్రస్తుతం 50 కాగా, 55 సంవత్సరాలకు పెంచాలనేది ప్రతిపాదన కూడా ఇదివరకు వచ్చింది.