హైదరాబాదులోని ఐటీ కారిడార్లో పెరిగిన డిమాండ్, లీజులో డబుల్
ముంబై: ఆఫీస్ స్పేస్కు హైదరాబాదులో డిమాండ్ పెరిగినట్లు ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ సంస్త CBRE నివేదిక వెల్లడించింది. ఐటీ కారిడార్లు, ఆ సమీప ప్రాంతాల్లోని మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, నానక్రామ్ గూడ, మణికొండ, రాయదుర్గం, కూకట్పల్లి ప్రాంతాల్లో ఇప్పటికే ఉన్న, కొత్తగా ఏర్పాటు అవుతున్న ఐటీ కంపెనీలు ఆఫీసు స్థలాన్ని ఎక్కువగా అద్దెకు తీసుకుంటున్నట్లు ఈ సంస్థ నివేదిక ద్వారా వెల్లడైంది.
అదే సమయంలో హైదారాబాదులో ఎన్నో వాణిజ్య నిర్మాణాలు పూర్తయినట్లు తత్ఫలితంగా ఎంతో స్థలం అందుబాటులోకి వచ్చినట్లు తెలిపింది. అద్దె ఆఫీసు స్థలం పరిమాణం విషయంలో బెంగళూరు, హైదరాబాద్ సిటీల మధ్య తేడా తగ్గిపోతోందని, హైదరాబాదులో కార్యాలయ స్థల విస్తీర్ణం చాలా వేగంగా పెరుగుతోందని పేర్కొంది.
డిమాండ్ అధికంగా ఉండటంతో కమర్షియల్ బిల్డింగ్స్ నిర్మాణానికి రియాల్టర్లు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నట్లు పేర్కొంది. బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై నగరాల్లో అద్దె స్థలాలకు డిమాండ్ ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది.
9 ముఖ్య నగరాల్లో జూలై - సెప్టెంబర్ క్వారాటర్లో ఆఫీస్ స్పేస్ లీజింగ్ 23 శాతం పెరిగి 15.4 మిలియన్ స్క్వేర్ ఫీట్లకు చేరుకుందని నివేదిక తెలిపింది. ఇప్పటికే టెక్ కార్పోరేట్స్, కో వర్కింగ్ ప్లేయర్స్ తమ కార్యాలయాలను విస్తరించడంతో పాటు కొత్త కార్యాలయాలు పుట్టుకు వస్తున్నందున ఈ ఏడాది ఆల్ టైమ్ హై 60 మిలియన్ల స్క్వేర్ ఫీట్కు చేరుకుంటుందని భావిస్తున్నారు.
2019 క్యాలెండర్ ఇయర్లో మొదటి తొమ్మిది నెలల్లో కార్యాలయ స్థలాన్ని లీజుకు ఇవ్వడం 30 శాతం పెరిగి 47 మిలియన్ చదరపు అడుగులు దాటిందని తెలిపింది.
డేటా ప్రకారం హైదరాబాదులో జూలై - సెప్టెంబర్లో గత ఏడాది కంటే ఆఫీస్ స్పేస్ లీజ్ రెండింతల కంటే ఎక్కువ పెరిగి 4.1 మిలియన్ స్క్వేర్ ఫీట్లకు చేరుకుంది. అంతకుముందు ఏడాది 1.7 మిలియన్ స్క్వేర్ ఫీట్లుగా ఉంది. చెన్నైలో 0.7 మిలియన్ స్క్వేర్ ఫీట్ల నుంచి 1.8 మిలియన్ స్క్వేర్ ఫీట్లకు పెరిగింది. పుణేలో 1.3 మిలియన్ స్క్వేర్ ఫీట్ల నుంచి 1.4 మిలియన్ స్క్వేర్ ఫీట్లకు పెరిగింది. ముంబైలో 1.7 మిలియన్ స్క్వేర్ ఫీట్ల నుంచి 1.5 మిలియన్ స్క్వేర్ ఫీట్లకు తగ్గింది. బెంగళూరులో 4.4 మిలియన్ స్క్వేర్ ఫీట్ల నుంచి 4 మిలియన్ స్క్వేర్ ఫీట్లకు తగ్గింది.