డిపాజిట్దారులకు బ్యాడ్ న్యూస్, ఎస్బీఐ బాటలో మరిన్ని బ్యాంకులు
ఎవరి దగ్గరైన ఉన్న సొమ్మును పెట్టుబడిగా పెడితేనే ఆ సొమ్ము పై తగిన రాబడి వస్తుంది. ఫలితంగా సంపద పెరుగుతుంది. అయితే పెట్టుబడుల్లో రిస్క్ ఉంటుంది. ఎంత ఎక్కువ రిస్క్ తీసుకుంటే అంత రిటర్న్ పొందడానికి అవకాశం ఉంటుంది. అయితే రిస్క్ తీసుకోవడానికి అందరు సిద్ధ పడరు. అందుకే తమ వద్ద ఉన్న సొమ్మును బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తుంటారు. అవసరమైనప్పుడు ఆ సొమ్మును తీసుకుంటారు. ఇలా ఖాతాల్లో ఉన్న డిపాజిట్లపై బ్యాంకులు కస్టమర్లకు వడ్డీ రేటును చెల్లిస్తాయి. ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీని ఖాతాలో జమ చేస్తుంటాయి.
ఆంధ్రాబ్యాంకు శుభవార్త, అన్ని కాలాల రుణాలపై వడ్డీ తగ్గింపు
కానీ ఇప్పుడు డిపాజిట్ దారులకు తమ ఖాతాల్లో ఉన్న సొమ్ముపై పొందే వడ్డీ రేటు క్రమంగా తగ్గిపోతుండటం డిపాజిట్ దారులకు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. బ్యాంకులు తమ మార్జిన్లను పెంచుకోవడానికి డిపాజిట్ రేట్లను తగ్గిస్తున్నాయి. బ్యాంకులు తాము ఇచ్చే రుణాలను రేపో రేటుతో అనుసంధానం చేసిన విషయం తెలిసిందే. దీనివల్ల కొన్ని బ్యాంకుల మార్జిన్లు ప్రభావితం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సేవింగ్స్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించడంపై బ్యాంకులు ద్రుష్టి పెట్టాయి.
ఎస్బీఐ తో మొదలు...
స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా (ఎస్బీఐ) లక్ష్య రూపాయల వరకు సేవింగ్స్ డిపాజిట్లపై వడ్డీ రేటును 3.5 శాతం నుంచి 3.25 శాతానికి తగ్గించింది. తగ్గించిన వడ్డీ రేటు నవంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. దేశంలో అతిపెద్ద బ్యాంకు అయినా ఎస్బీఐ వడ్డీ రేట్లను తగ్గించిందంటే మిగతా బ్యాంకులు కూడా అదే బాటలో సాగుతుంటాయి. ఫలితంగా కస్టమర్లకు అందే వడ్డీ రేటు తగ్గుతుందన్న మాట. ఎస్బీఐ తన రిటైల్ టర్మ్ డిపాజిట్లు, బల్క్ టర్మ్ డిపాజిట్లపై కూడా వడ్డీ రేట్లను 0.10 శాతం నుంచి 0.30 శాతం వరకు తగ్గించింది. ఏడాది నుంచి రెండేళ్ల కాలానికి తగ్గించిన ఈ వడ్డీ రేట్లు అక్టోబర్ 10వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. గత రెండు నెలల నుంచి బ్యాంకులు తమ ఫిక్స్డ్ లేదా టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గిస్తూనే ఉన్నాయి. వీటికి తోడు ఎస్బీఐ సేవింగ్స్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించడం డిపాజిట్ దారులకు చేదు వార్తగానే చెప్పవచ్చు.
బ్యాంకులకు స్వేచ్ఛ..
సేవింగ్స్ బ్యాంకు ఖాతాలపై వడ్డీ రేటును నిర్ణయించే విషయంలో బ్యాంకులకు స్వేచ్ఛ ఉంది. 2011 అక్టోబర్ నుంచి బ్యాంకులకు ఈ అవకాశం లభించింది. ప్రభుత్వ రంగ బ్యాంకులకన్నా ప్రయివేటు రంగంలోని బ్యాంకులు తమ సేవింగ్స్ బ్యాంకు కస్టమర్లకు అధిక వడ్డీ రేటును చెల్లిస్తున్నాయి. ఎస్బీఐ సహా పలు బ్యాంకులు తమ కస్టమర్లకు ఎంతో కాలంగా 4 శాతం వడ్డీ రేటును మాత్రమే ఇస్తున్నాయి. ప్రయివేటు రంగంలోని యెస్ బ్యాంకు, కోటక్ బ్యాంకు, ఇండస్ ఇండ్ బ్యాంక్, లక్ష్మి విలాస్ బ్యాంకులు మాత్రం 5 శాతం నుంచి 7శాతం వరకు వడ్డీ రేటును ఆఫర్ చేశాయి.
రెండేళ్ల క్రితం ఎస్బీఐ మొదటి సారిగా సేవింగ్స్ డిపాజిట్ రేటును 4 శాతం నుంచి 3.5 శాతానికి తగ్గించింది. ఈ బ్యాంకు బాటలోనే ఇతర బ్యాంకులు కూడా తమ వడ్డీ రేట్లను తగ్గించాయి. ప్రస్తుతం చాలా వరకు బ్యాంకులు సేవింగ్స్ డిపాజిట్లపై 3.5 శాతం వడ్డీ రేటును అందిస్తున్నాయి. ఇప్పుడు ఎస్బీఐ వడ్డీ రేటును 3.25 శాతాన్ని తగ్గించినందువల్ల ఇతర బ్యాంకులు కూడా తమ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి.
సేవింగ్స్ డిపాజిట్ల వాటా ఎక్కువే..
బ్యాంకుల మొత్తం డిపాజిట్లలో సేవింగ్స్ డిపాజిట్ల వాటా నాలుగో వంతు ఉంటుందని బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో వడ్డీ రేట్లను పెంచితే తమకు వచ్చే మార్జిన్లు తగ్గిపోతాయి. ఈ నేపథ్యంలోనే వడ్డీ రేటు తగ్గించడానికి ఉన్న అవకాశాలను బ్యాంకులు వదులుకోవడం లేదు.
తాజాగా కెనరా బ్యాంకు
ప్రభుత్వరంగంలోని కెనరా బ్యాంకు సేవింగ్స్ డిపాజిట్ రేట్లను 0.25 శాతం మేర తగ్గించింది. ఈ నెల 15వ తేదీ నుంచి ఈ వడ్డీ రేటు అమల్లోకి వస్తుంది. రూ.50 లక్షల కన్నా తక్కువ డిపాజిట్లపై వడ్డీ రేటు 3.25 శాతం ఉంటుందని, 50 లక్షలు అంతకన్నా ఎక్కువ ఉంటె వడ్డీ రేటు 3.75 శాతం లభిస్తుందని బ్యాంక్ పేర్కొంది. ఇంతకు ముందు బ్యాంకు ఈ డిపాజిట్లపై వరుసగా వడ్డీ రేటు 3.50 శాతం, 4 శాతం చెల్లించింది.