రూ.2,000నోట్లు రద్దు.. కాదు, ఒక్క నోటూ ప్రింట్ చేయలేదు: వారికి మోడీ షాక్!
న్యూఢిల్లీ: 2016 నవంబర్ 8వ తేదీన రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం మరో షాకింగ్ నిర్ణయం తీసుకుంటుందా అనే చర్చ సాగుతోంది. దేశంలో అవినీతికి, అక్రమాలకు పెద్ద నోట్లు కూడా ఓ కారణంగా భావిస్తున్నారు. ఇందులో భాగంగా అప్పుడు నోట్లు రద్దు చేశారు. ఆ తర్వాత రూ.2000 నోట్లు తీసుకు వచ్చారు. అయితే, ఇప్పుడు ఈ నోటు కూడా ఆగిపోనుందని తెలుస్తోంది. ఇప్పటికే దీని ప్రింటింగ్ నిలిచిపోయినట్లుగా సమాచార హక్కు చట్టం ద్వారా వెల్లడైంది.
నోట్ల రద్దు తర్వాత రూ.2,000 నోటు
మూడేళ్ల క్రితం నోట్లు రద్దు చేసినప్పుడు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇలాంటి సమయంలో మరింత ఇబ్బందులు ఉండకుండా అప్పటికి రూ.500, రూ.2000 నోటును తీసుకు వచ్చారు. పెద్ద నోట్లకు మోడీ ప్రభుత్వం ముందు నుంచి వ్యతిరేకంగానే ఉన్నట్లుగా కనిపిస్తోంది. కానీ నాటి ఇబ్బందులను లెక్కలోకి తీసుకొని తాత్కాలికంగా రూ.2,000 నోటును తీసుకు వచ్చింది. ఇప్పుడు ఈ నోటు ప్రింటింగ్ను ఆపివేసిందట. ప్రస్తుతం ఈ నోట్లు అందరూ ఉపయోగిస్తున్నారు. ఏటీఎంకు వెళ్లి రూ.2000కు మించి డ్రా చేస్తే ఈ పెద్ద నోటు తప్పకుండా వచ్చే పరిస్థితి.
ఒక్క నోటూ ముద్రించలేదు
గత కొద్ది రోజులుగా రూ.2,000 నోటు అంతగా కనిపించడం లేదు. కొన్ని ప్రాంతాల్లో కొన్ని బ్యాంకులు దీనిని ఏటీఎంలలో నింపడం కూడా ఆపివేశాయి. ఇందుకు కారణం ఆర్బీఐ ఈ నోట్ల ముద్రను నిలిపివేయడమే. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఒక్క నోటు కూడా ముద్రించలేదు. సమాచార హక్కు చట్టం కింద ఓ వార్తా ప్రసార సంస్థ అడిగిన ప్రశ్నకు ఆర్బీఐ ఈ వివరాలు తెలిపింది.
రద్దు కాదు.. ప్రింటింగ్ నిలిపివేత
రూ.2,000 రద్దు కానున్నాయా అనే చర్చ సాగుతోంది. అయితే నోట్ల రద్దుకు, నోట్ల ముద్రణ నిలిపివేయాడనికి తేడా ఉంది. పెద్ద నోట్లకు వ్యతిరేకమైన నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నోటు ముద్రణను నిలిపివేసింది. నాడు అవసరార్థం తీసుకువచ్చిన ఈ నోటును ఇప్పుడు ముద్రించడం నిలిపివేశారు. అంతేకాదు, రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేసి రూ.2000 నోట్లు తీసుకు రావడంపై విపక్షాలు విమర్శలు కూడా గుప్పించాయి. కానీ నాటి పరిస్థితుల్లో అది అవసరం. క్రమంగా దీని ఉపయోగాన్ని తగ్గిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రింటింగ్ నిలిపివేశారు. కానీ రద్దు అనేది ఊహాగానాలేనని చెబుతున్నారు. రూ.2000 నోట్ల ప్రింట్ నిలిపివేయడం ద్వారా విమర్శకులకు కూడా సరైన జవాబు ఇచ్చినట్లుగా అయింది.
నోట్ల ముద్రణ క్రమంగా తగ్గించారు..
నోట్ల రద్దు అనంతరం 2016-17 ఆర్థిక సంవత్సరంలో 3,542.991 మిలియన్ల నోట్లు ముద్రించగా, 2017-18 ఆర్థిక సంవత్సరంలో 111.507 మిలియన్ నోట్లు ముద్రించారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో 46.670 మిలియన్లకు ఈ ముద్రనను కుదించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక్క రూ.2,000 నోటు కూడా ముద్రించలేదు. అధిక విలువ కలిగిన నోట్ల చలామణిని తగ్గించడం ద్వారా నల్లధన ప్రవాహానికి అడ్డుకట్ట వేయవచ్చని పలువురు నిపుణులు సూచిస్తున్నారు. 2018 మార్చి నాటికి 3,363 మిలియన్ల రూ.200 నోట్లు సర్క్యులేషన్లో ఉన్నాయి.