స్టాక్ మార్కెట్లో షేర్ల తీరు: కొన్ని తారాజువ్వలు.. మరికొన్ని చిచ్చుబుడ్లు!
స్టాక్ మార్కెట్ గురించి కాస్తో కూస్తో అవగాహన ఉన్న వారు.. ఆయా షేర్ల ధర పెరగడం, తగ్గడం చూస్తూనే ఉంటారు. కొన్ని కంపెనీల షేర్లు లిస్టింగ్ రోజు నుంచే తారాజువ్వల్లా పైపైకి దూసుకుపోతాయి. మరికొన్ని కంపెనీల షేర్లు చిచ్చుబుడ్ల మాదిరిగా ఆరంభంలో అదరగొట్టి.. ఆపైన క్రమేణా తగ్గుతూ.. చివరికి పాతాళానికి పడిపోతాయి.
తాజాగా మొన్న సోమవారం స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన ఐఆర్సీటీసీ ఐపీవో కూడా మరో తారాజువ్వను తలపించింది. లిస్టింగ్ రోజునే ఈ షేరు ధర 132 శాతం పెరిగి పెట్టుబడిదారుల పంట పండించింది. ఐఆర్సీటీసీ మాదిరిగానే దేశ స్టాక్ మార్కెట్ చరిత్రలో మరికొన్ని షేర్లు ఉన్నాయి. ఇలా అద్భుతమైన లిస్టింగ్తో మొదలైన కొన్ని కంపెనీల షేర్ల గురించి తెలుసుకుందామా?
అదరగొట్టిన ఐఆర్సీటీసీ ఐపీవో...
గత నెల 30న మొదలైన ఐఆర్సీటీసీ ఐపీవో షేరు లిస్ట్ అయిన రోజునే అటు ఎన్ఎస్ఈ, ఇటు బీఎస్ఈలో అదరగొట్టింది. ఇష్యూ ధర రూ.320 కాగా రిటైల్ ఇన్వెస్టర్లకు రూ.10 తక్కువకే.. అంటే రూ.310కే ఇచ్చారు. ఈ షేరు ఏకంగా 132 శాతం ఓవర్ సబ్స్క్రయిబ్ అయిన ఈ షేరు ధర రూ.743ని తాకింది. బీఎస్ఈలో రూ.644 వద్ద ప్రారంభమైన ఈ షేరు గరిష్ఠంగా రూ.743.80ని తాకినా.. క్లోజింగ్ సమయానికి రూ.625 వద్ద ముగిసింది. ఇక ఎన్ఎస్ఈలోనూ ఈ షేరు కదలికలు ఇంచుమించు అదేమాదిరిగా ఉన్నాయి. ఒక్క రిటైల్ కేటగిరీలోనే 15 రెట్లు ఓవర్ సబ్స్క్రయిబ్ అయిందంటే.. ఈ షేరు పెట్టుబడిదారుల్లో ఎంత ఆదరణ పొందిందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఐపీవో ద్వారా ప్రభుత్వం రూ.650 కోట్లు సమకూర్చుకోగలిగింది.
నో డౌట్.. ఇది తారాజువ్వే!
రైట్స్, రైల్ వికాస్ నిగమ్, ఇర్కాన్ల తరువాత లిస్టింగ్ పొందిన నాలుగో రైల్వే కంపెనీగా ఐఆర్సీటీసీ నిలుస్తోంది. మార్చి 2019తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఐఆర్సీటీసీకి రూ.1,867 కోట్ల టర్నోవర్ మీద రూ.221 కోట్ల నికర లాభం వచ్చింది. రిటైల్ కేటగిరీలో 15 రెట్లు, క్యూఐబీ విభాగంలో 109 రెట్లు, నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ కేటగిరీలో ఏకంగా 355 రెట్లు ఓవర్ సబ్స్క్రయిబ్ అయిన ఈ షేర్ లిస్టింగ్ తరువాత కూడా దూసుకుపోయే తారాజువ్వే తప్ప.. తుస్సుమనే చిచ్చుబుడ్డి కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే, ఐఆర్సీటీసీ బిజినెస్ మోడల్ వినూత్నమైనదని.. కేటరింగ్, ఈ-టికెటింగ్, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్లలో ఈ కంపెనీకి తిరుగులేని ఆధిపత్యం ఉండటమే దీనికి కారణమని వారు పేర్కొంటున్నారు.
ఐపీవోలకు గోల్డెన్ ఇయర్.. 2017
గత అయిదేళ్లలో చూస్తే.. ఐపీవో ఇన్వెస్టర్లకు పంట పండించిన సంవత్సరం 2017. ఆ ఏడాదిలో మూడు ఐపీవోలు 100 శాతం ప్రీమియంతో లిస్ట్ అయ్యాయి. ఇవి - అవెన్యూ సూపర్ మార్ట్స్, సలసార్ టెక్నో ఇంజినీరింగ్, ఆస్ట్రాన్ పేపర్ అండ్ బోర్డ్ మిల్లు. అలాగే ఇన్వెస్టర్లకు మరో మూడు షేర్లు మాత్రం అధిక సంపద తెచ్చిపెట్టాయి. వీటిలో ఒకటి ఇంధ్రప్రస్థ గ్యాస్ షేర్. ఇది 150 శాతం ప్రీమియంతో లిస్ట్ అవడమేకాక ఆ తరువాత ఇష్యూ ధర కంటే 8 రెట్లు పెరిగింది. అలాగే దేశ వ్యాప్తంగా డీ-మార్ట్ స్టోర్లను నడిపే అవెన్యూ సూపర్ మార్ట్స్. దీని ఇష్యూ ధర రూ.1,843తో పోల్చితే ప్రస్తుతం 6 రెట్లు అధికంగా ట్రేడ్ అవుతోంది. ఇక 2004లో స్టాక్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన టీవీ టుడే నెట్వర్క్ కూడా లిస్ట్ అయిన రోజే 121 శాతం ప్రీమియం దక్కించుకుంది. ఈ షేరు దీని ఇష్యూ ధరతో పోల్చితే.. ఇప్పుడు 3 రెట్లు అధికంగా పలుకుతోంది.
ఇవీ కొన్ని చిచ్చుబుడ్లు...
ఐపీవోకు వచ్చి లిస్ట్ అయిన రోజున అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేసిన కొన్ని కంపెనీల షేర్లు ఆ తరువాత మాత్రం తుస్సుమనిపించాయి. ఇలాంటి వాటిలో చెప్పుకోవాల్సిన కంపెనీ.. తాంతియా కన్స్ట్రక్షన్స్. 2006లో ఐపీవోగా స్టాక్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ కంపెనీ 260 శాతం ప్రీమియంతో రూ.180 వద్ద లిస్ట్ అయింది. కానీ ఆ తరువాత ఇదే కంపెనీ షేరు క్లోజింగ్ ధర మాత్రం రూ.1.40 కి పడిపోయింది. అలాగే 2005లో ఎఫ్సీఎస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ లిస్టింగ్ రోజున 200 శాతానికిపైగా ప్రీమియం పొందగా.. ఆ తరువాత ఈ షేర్ విలువ 20 పైసలకు పడిపోయింది. ఇక మ్యాక్స్ అలర్ట్ సిస్టమ్స్ షేరు ధర కూడా లిస్టింగ్ రోజున 157 శాతం ప్రీమియంతో దూసుకుపోగా ఇప్పుడు దీని ధర రూ.4.80 పలుకుతోంది. అలాగే 2013లో లిస్ట్ అయిన జీసీఎం సెక్యూరిటీస్.. 225 శాతం ప్రీమియంతో లిస్ట్ అయిన ఈ షేరు ధర ప్రస్తుతం రూ.9.40 వద్ద ఉంది.