హోమ్ లోన్స్ తీసుకునే వారికి SBI ఝలక్: పండుగ ఆఫర్కు నో, ఇక ప్రాసెసింగ్ ఫీజు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) హోమ్ లోన్స్, టాపప్ లోన్స్, కార్పోరేట్, బిల్డర్లకు ఇచ్చే రుణాలపై మళ్లీ ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక వడ్డీ రేట్లలో కోత విధించిన నేపథ్యంలో నికర వడ్డీ ఆదాయం గణనీయంగా తగ్గుతుందని బ్యాంకు ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవల పండుగ సీజన్ నేపథ్యంలో ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేయాలని నిర్ణయించింది.
ప్రాసెసింగ్ ఫీజు రద్దు అక్టోబర్ 15వ తేదీ వరకు..
పండుగల సీజన్ నేపథ్యంలో డిసెంబర్ 31వ తేదీ వరకు రుణాలపై ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేయాలన్న ప్రతిపాదనను ఉపసంహరించుకుంటున్నట్లు ఎస్బీఐ తెలిపింది. ప్రాసెసింగ్ ఫీజు రద్దు అక్టోబర్ 15వ తేదీ వరకు మాత్రమే ఉంటుందని, ఆ తర్వాత నుంచి ప్రాసెసింగ్ ఫీజు ఉంటుందని స్పష్టం చేసింది.
రెపో రేటుతో అనుసంధానం వల్ల..
ఎస్బీఐ తాజా నిర్ణయం నేపథ్యంలో మరో మూడ్రోజుల్లో ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేయడం ప్రారంభిస్తోంది. ఈ నెల 15వ తేదీ నుంచి ఇది అమల్లోకి వస్తుందని పేర్కొంది. 'అప్పటి వరకు ఇచ్చే హోమ్ లోన్ అప్లికేషన్లపై మాత్రం ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు ఉండదు. 15వ తేదీ తర్వాత నుంచి ప్రారంభం అవుతుంది. కాగా ఎస్బీఐ గత జూలై 1 నుంచి తన హోమ్ లోన్స్ పైన వడ్డీ రేటును రెపో రేటుతో అనుసంధానం చేసింది. ఆర్బీఐ ఇటీవల రెపో రేటు మరో 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో హోమ్ లోన్స్ పైన బ్యాంకుకు వచ్చే వడ్డీ ఆదాయం మరింత తగ్గుతుంది. ఆ లోటును భర్తీ చేసుకునేందుకు ఎస్బీఐ గడువు కంటే ముందే హోమ్ లోన్స్ పైన ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేయాలని నిర్ణయించింది.
0.4 శాతం ప్రాసెసింగ్ ఫీజు
ఎస్బీఐ హోమ్ లోన్స్ పైన దాదాపు 0.4 శాతం వరకు వసూలు చేస్తోంది. ఇవి రూ.10,000 నుంచి రూ.30,000 (కనిష్టం - గరిష్టం) మధ్య ఉన్నాయి. బిల్డర్లకు ఇచ్చే హోమ్ లోన్స్ పైన మాత్రం రూ.5,000ను ప్రాసెసింగ్ ఫీజుగా వసూలు చేస్తోంది. ఎస్బీఐ హోమ్ లోన్స్ పైన ముందు ముందు ముందస్తు చెల్లింపు చార్జీలు, ఇతర చార్జీలు ఉంటాయని భావిస్తున్నారు.