ప్రపంచ కుబేరుల్లో 17వ స్థానంలో ముఖేష్ అంబానీ
రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) అధినేత ముఖేష్ అంబానీ మరోసారి ప్రపంచ అత్యధిక ధనవంతుల జాబితాలో నిలిచారు. ఈ జాబితాలో 17వ స్థానంలో నిలిచారు. 2017 ఏప్రిల్ నుంచి అతను టాప్ 20 జాబితాలో ఉంటున్నారు. అంతకుమునుపు ఎనిమిది నెలలకు ముందు అంటే 2016 సెప్టెంబర్ నెలలో రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ను లాంచ్ చేశారు.
ముఖేష్ అంబానీ సంపాదనలో ఎక్కువ శాతం చమురు నుంచి టెక్స్టైల్ వరకు, రిటైల్ నుంచి టెలికం వరకు ఎన్నో విభాగాల నుంచి వస్తోంది. ముఖేష్ కంపెనీలు అన్నింటి సమ్మేళనం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్.
తెలుగు రాష్ట్రాల్లో సంపన్నులు వీరే! టాప్ 100లో మేఘా ఇంజినీరింగ్ నుంచి ఇద్దరు
బ్లూమ్బర్గ్ ప్రస్తుత అంచనాల ప్రకారం ప్రపంచ బిలియనీర్ల జాబితాలో ముఖేష్ అంబానీ 17వ స్థానంలో నిలిచారు. ఇతని నికర ఆశ్తుల విలువ 51 బిలియన్ డాలర్లు. 2019 అక్టోబర్ 6 నాటికి 51.1 బిలియన్ డాలర్ల సంపదతో ఫోర్బ్స్ లిస్టులో ముఖేష్ అంబానీ 13వ స్థానంలో ఉన్నారు. బ్లూమ్ బర్గ్ ఇండెక్స్ ప్రకారం 51.2 నికర ఆస్తులు కలిగి ఉన్నారు. సెప్టెంబర్ 19, 2019 నాటికి బ్లూమ్ బర్గ్ లిస్టులో 18వ స్థానంలో నిలిచారు.
ఇటీవల ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ కుబేరుల లిస్ట్లో టాప్
ముఖేష్ అంబానీ ఇటీవలే భారత్లోనే అత్యంత సంపన్నుడిగా వరుసగా ఎనిమిదోసారి నిలిచారు. ఆయన ఆస్తులు ఆక్షరాలు రూ.3,80,700 కోట్లు. ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ భారత కుబేరుల జాబితాను విడుదల చేసింది. ఇందులో మరోసారి ముఖేష్ అగ్రస్థానంలో నిలిచారు.
రూ.1,86,500 కోట్ల సంపదతో హిందూజా కుటుంబం రెండో స్థానంలో నిలిచింది. రూ.1,17,100 కోట్లతో విప్రో వ్యవస్థాపకులు అజీమ్ ప్రేమ్ జీ మూడో స్థానంలో, రూ.1,07,300 కోట్లతో ఆర్సెలార్ మిట్టల్ చైర్మన్ ఎల్ ఎన్ మిట్టల్ నాలుగో స్థానంలో, రూ.94,500 కోట్లతో గౌతమ్ అదానీ ఐదో స్థానంలో నిలిచారు. ఆ తర్వాత వరుసగా ఉదయ్ కొటక్, సౌరస్ ఎస్ పూనావాలా, పల్లోంజీ మిస్త్రీ, షాపూర్ పల్లోంజీ, దిలీప్ సంఘ్వీ వరుసగా ఆరు, ఏడు, ఎనిమిది, తొమ్మిది, పదో స్థానంలో నిలిచారు.
భారత్లో సంపన్నుల సంఖ్య పెరిగిందని ఈ నివేదిక తెలిపింది. 2018లో రూ.1000 కోట్ల కంటే ఎక్కువ సంపాదన కలిగిన వారు 831 మంది ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య 953కు చేరుకుంది. టాప్ 25 స్థానాల్లో ఉన్న శ్రీమంతుల సంపద మొత్తం దేశ జీడీపీలో పది శాతానికి సమానమని తెలిపింది.