చైనాకు శాంసంగ్ గుడ్బై.. భారత్లో ప్లాంట్ల విస్తరణకు మొగ్గు...
దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ చైనాకు గుడ్బై చెప్పేసింది. ఇప్పుడు దాని చూపు వియాత్నాంతోపాటు భారత్పైనా పడింది. అవును భారత్లో తన మొబైల్ తయారీ ప్లాంట్లను విస్తరించే దిశగా శాంసంగ్చర్యలు తీసుకుంటోంది.
అధికారికంగా వెల్లడించనప్పటికీ.. 2017 గణాంకాల ప్రకారం.. శాంసంగ్కు చైనాలో సుమారు 6 వేల మంది ఉద్యోగులు ఉండగా, ఒక్క చైనాలోనే ఈ సంస్థ ఆ ఏడాది 6.3 కోట్ల మొబైల్ హ్యాండ్ సెట్లు ఉత్పత్తి చేయగా, అంతర్జాతీయంగా 39.4 కోట్ల హ్యాండ్సెట్లు ఉత్పత్తి చేసింది.
చైనాలో ప్లాంట్ల మూసివేత వెనుక...
తీవ్రమైన పోటీ, ఆర్థిక మందగమనం, పెరుగుతున్న వ్యయం, అమ్మకాలు పడిపోవడం.. ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ చైనాలో తయారీ నుంచి తప్పుకోవడానికి వెనుక ఉన్న పలు కారణాల్లో కొన్ని మాత్రమే. ఇటీవల కేంద్రం కార్పొరేట్ పన్ను శాతం తగ్గించడం, దీనికితోడు ఇంకా పలు రాయితీలు కూడా ప్రకటించడంతో చైనా కన్నా భారత్లో తయారీ శాంసంగ్కు అనుకూలంగా అనిపిస్తోంది. అందుకే ఆ కంపెనీ ఇండియాలో తన మొబైల్ ప్లాంట్ల విస్తరణకు అవసరమైన చర్యలు తీసుకుంటోంది.
గణనీయంగా పడిపోయిన అమ్మకాలు...
చైనాలో దేశీయ కంపెనీలైన హువావే టెక్నాలజీస్, షావోమీ సంస్థల నుంచి శాంసంగ్కు గట్టి పోటీ ఎదురవుతోంది. చౌక ధర ఫోన్లు కావాలనుకునే చైనీయులు ఎక్కువగా దేశీయ కంపెనీలు తయారు చేసే ఫోన్లే కొనుగోలు చేస్తున్నారు. కాస్త ఖరీదైన ఫోన్లు కావాలనుకునే వారు యాపిల్ లేదా హువావే కంపెనీల ఫోన్లు కొనుక్కుంటున్నారు. దీంతో శాంసంగ్ కంపెనీ అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. 2013లో చైనాలో శాంసంగ్ మార్కెట్ వాటా 15 శాతంగా ఉండేది. అది ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 1 శాతానికి పడిపోయిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
గత ఏడాది నుంచే...
గత ఏడాది చైనాలోని ఒక ఫ్యాక్టరీలో కార్యకలాపాలు నిలిపివేసిన శాంసంగ్ మొన్న జూన్లో మరో ప్లాంటులోనూ ఉత్పత్తిని ఆపేసింది. ప్రస్తుతం హువైజూలోని చివరి ప్లాంటును కూడా మూసేస్తున్నట్లు ప్రకటించింది. మరో ప్రత్యర్థి కంపెనీ సోనీ కూడా ఇటీవలే బీజింగ్లోని తన స్మార్ట్ఫోన్ల తయారీ ప్లాంటును మూసివేసింది. ఇక ఈ కంపెనీ థాయిలాండ్లో మాత్రమే కార్యకలాపాలు సాగించనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుత పరిస్థితుల్లో చైనా మార్కెట్లో శాంసంగ్ ఉత్పత్తుల అమ్మకాలు పుంజుకునేలా కనిపించడం లేదు.
అమ్మకాలు అలాగే...
అయితే చైనాలో తనకున్న మొబైల్ హ్యాండ్సెట్ల తయారీ యూనిట్లను మూసివేస్తున్నప్పటికీ.. చైనా మార్కెట్ నుంచి తాము వైదొలగడం లేదని శాంసంగ్ ప్రకటించింది. అక్కడ తమ మొబైల్ ఫోన్ల అమ్మకాలు యధావిధిగానే సాగుతాయని పేర్కొంది. మరోవైపు వియత్నాంతోపాటు భారత్లోనూ తన ప్లాంట్ల సామర్థ్యాన్ని మరింత పెంచుకునే దిశగా దృష్టి సారించిన శాంసంగ్కు ఇప్పుడు ఈ దేశాల మార్కెట్లు మరింత కీలకంగా మారనున్నాయి.