మళ్లీ కీలక వడ్డీరేట్లు తగ్గించిన ఆర్బీఐ, 25 పాయింట్ల కట్తో 5.15 శాతానికి పరిమితం
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మరోసారి కీలక వడ్డీ రేట్లను తగ్గించింది. వడ్డీ రేటును పావు శాతం తగ్గించింది. వృద్ధి రేటు అంచనాను 6.9 శాతం నుంచి 6.1 శాతానికి తగ్గించింది. ప్రపంచ ఆర్థిక మాంద్యం భయాలు, భారత్లో స్లోడౌన్న నేపథ్యంలో ఆర్బీఐ రెపో రేటును తగ్గిస్తుందని ముందు నుంచి ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (MPC) రెపో రేటును మరో 25 పాయింట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. గత నాలుగు పర్యాయాలు రెపో రేటు తగ్గించడంతో 5.40 శాతంగా నిలిచింది. ఇప్పుడు మరో 25 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో రెపో రేటు 5.15 శాతానికి దిగింది. ఇది రుణాలు తీసుకునే వారుకి ఊరట కలిగించే విషయం. 2010 తర్వాత వడ్డీ రేటు 5.15 శాతంగా ఉండటం ఇదే ప్రథమం.
ఐదుగురు సభ్యులు గల ఆర్బీఐ MPCలో 25 బేసిస్ పాయింట్ల తగ్గింపుకు ఓటు వేసింది. ఇందులో ఒకరు 40 బేసిస్ పాయింట్ల తగ్గింపుకు ఓటు వేయగా, మిగతా వారు 25 బేసిస్ పాయింట్ల తగ్గింపుకు ఓటేశారు. ఈ ఏడాది ప్రారంభంలో రెపో రేటు 6.50 శాతంగా ఉంది. అప్పటి నుంచి వరుసగా ఇప్పటి వరకు ఐదుసార్లు రెపో రేటు తగ్గించారు. దీంతో రెపో రేటు 5.15 శాతానికి తగ్గింది. ఆర్బీఐ 2020-21 సంవత్సరానికి గాను జీడీపీ అంచనా 7.2 శాతానికి సవరించింది. ఆర్థిక మాంద్యం దృష్ట్యా ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించింది.
ఆర్బీఐ రెపో రేటు తగ్గింపు ఇంతటితో ఆగిపోతుందా అంటే దానిపై ఇప్పుడే ఏం చెప్పలేమని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. భారత ఆర్థిక ప్రగతికి ఎంత వరకు ఏం అవసరమో ఆర్భీఐ అది చేస్తుందని చెప్పారు. అదే సమయంలో ప్రభుత్వం ఇంటర్మ్ డివిడెండ్ అడిగిందనే వార్తలపై కూడా ఆర్బీఐ గవర్నర్ స్పందించారు. ఆ విషయం తనకు తెలియదన్నారు రివర్స్ రెపో రేటు 4.90 శాతంగా నిర్ణయించారు. ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్ స్థిరంగా ఉందని శక్తికాంత దాస్ తెలిపారు. లిక్విడిటీ సర్ప్లస్లో ఉందని చెప్పారు. పీఎంసీ బ్యాంక్ విషయంలో వేగంగా స్పందించామన్నారు.
ఇప్పటికే ఆటోమొబైల్స్, ఎఫ్ఎంసీజీ రంగాల్లో అమ్మకాలు క్షీణించి ఆరేళ్ళ కనిష్ఠానికి పడిపోయిన భారత ఆర్థిక వ్యవస్థకు వడ్డీ రేట్ల తగ్గింపుతో కొత్త జవసత్వాలు సమకూరే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ పలు ఉద్దీపనలు ప్రకటించారు. కార్పొరేట్ టాక్స్ ను 22 శాతానికి తగ్గించారు. అక్టోబర్ 1 తర్వాత నెలకొల్పే తయారీ రంగ కంపెనీలకు కేవలం 15 శాతం కార్పొరేట్ టాక్స్ ను నిర్ణయించారు. ఎగుమతులకు రూ 50,000 కోట్ల ప్రోత్సహకాలు ప్రకటించారు. ప్రభుత్వరంగ బ్యాంకులకు భారీ మూలధనాన్ని సమకూర్చారు. దీంతో కుదేలైన స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా పరుగులు పెట్టాయి. అలాగే ఇప్పుడు కీలక వడ్డీ రేట్లు తగ్గితే దాని ప్రభావం అన్ని రంగాలపై కనిపించి మొత్తంగా ఆర్థిక వ్యవస్థ మళ్ళీ వృద్ధి బాటలో పయనించే అవకాశం ఉంది.