ఫెస్టివల్ ఆఫర్లు, డిస్కౌంట్ ఎఫెక్ట్: ప్రభుత్వం 'కొత్త' షాకివ్వనుందా?
అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఈ-కామర్స్ దిగ్గజ సంస్థలు పండుగ నేపథ్యంలో భారీ ఆఫర్లు ఇస్తున్నందున జీఎస్టీ రూపంలో ప్రభుత్వ ఆదాయానికి భారీ స్థాయిలో నష్టం జరుగుతోందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా ట్రేడర్స్ (CAIT) విమర్శించింది. మార్కెట్ ధరల కంటే తక్కువకే ఆయా సంస్థలు విక్రయాలు చేపట్టడంతో ప్రభుత్వ ఖజానాకు ఎక్కువ నష్టం వాటిల్లుతోందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకు వచ్చారు. ఈ-కామర్స్ వ్యాపార మోడల్ పైన విచారణ జరపాలని వారు కోరారు. అమెజాన్, ప్లిప్కార్ట్లు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నాయని పేర్కొంది.
పండుగ సీజన్లో సేల్స్...
ఈ-కామర్స్ సంస్థలు B2B వ్యాపారం చేసేందుకు అనుమతి ఉందని, కానీ B2C విక్రయాలు చేపడుతున్నాయని CAIT విమర్శించింది. ఇది ఎఫ్డీఐ పాలసీకి విరుద్ధమని తెలిపింది. అన్నింటికంటే పండుగ సీజన్లో ఈ సంస్థలు వాస్తవ ధర కంటే 10 నుంచి 80 శాతం మేర తక్కువ ధరకే సేల్స్ జరుపుతున్నాయని తెలిపింది. ఇది చీటింగ్ చేయడమేనని పేర్కొంది.
రెవెన్యూ కోల్పోతున్న ప్రభుత్వం
ఆఫర్ల సమయంలో డిస్కౌంట్ అనంతరం ధరపై జీఎస్టీ చెల్లిస్తుండటంతో ప్రభుత్వం ఆదాయం భారీగా పడిపోతోందని తెలిపింది. ఇలా డిస్కౌంట్ల వల్ల సంస్థల వెనుక ఉన్న ఇన్వెస్టర్లకు ఎలాంటి నష్టం లేదని, అంతిమంగా ప్రభుత్వం రెవెన్యూని కోల్పోతోందని పేర్కొంది. ఆఫర్లు అందిస్తోన్న సంస్థలన్నీ కొన్నేళ్లుగా నష్టాల్లోనే ఉన్నాయని, అయినా ఏడాది పొడవునా ఆఫర్లు అందిస్తున్నాయని గుర్తు చేసింది.
మోసపూరిత ధరలు, భారీ డిస్కౌంట్లు
ఈ కామర్స్ విధానానికి తాము వ్యతిరేకం కాదని కూడా పేర్కొంది. కానీ మోసపూరిత ధరలు, భారీ డిస్కౌంట్లకు మాత్రమే తాము వ్యతిరేకమని తెలిపింది. ఈ కామర్స్ వ్యాపార నమూనాపై దర్యాఫ్తు చేయించాలని కూడా CAIT సూచించింది.
వీడియో స్ట్రీమింగ్, రైడ్ హైలింగ్ కూడా...
ప్రభుత్వం కూడా ఈ-కామర్స్ మార్గదర్శకాల పరిధిని విస్తరించాలని చూస్తోంది. ఇందుకు సంబంధించి చర్చించి, అక్టోబర్లో గైడ్ లైన్స్ తయారు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ-కామర్స్ సంస్థలతో పాటు వీడియో స్ట్రీమింగ్, ఆన్లైన్ టిక్కెట్ బుకింగ్, రైడ్ హైలింగ్ వంటి సేవలకు కూడా విస్తరించాలని భావిస్తోంది ప్రభుత్వం. అక్టోబర్ మొదటి వారంలో మార్గదర్శకాలను పంచుకొని, ఆ తర్వాత అక్టోబర్ 31వ తేదీ నాటికి ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోనుందని తెలుస్తోంది.
సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్
దీంతో పాటు ఆన్లైన్లో విక్రయిస్తున్న వస్తువులు, సేవల ప్రామాణికతకు హామీ ఇవ్వడానికి సెల్లర్స్ నుంచి సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో Olx, Quikr వంటి B2C మార్కెట్ ప్లేసెస్, C2C ప్లాట్ఫామ్స్ కూడా ఉంటాయి.