నేటి నుంచి IRCTC IPO: రైల్వే నుంచి షేర్ ధర... తెలుసుకోవాల్సిన ముఖ్యవిషయాలు
న్యూఢిల్లీ: 1999 సెప్టెంబర్ 27న ప్రారంభమైన ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజమ్ కార్పోరేషన్ (IRCTC) 2002 నుంచి సేవలు అందిస్తోంది. ఇది భారతీయ రైల్వేకు అనుబంధ సంస్థ. ఇది ఆన్లైన్ ద్వారా రైలు టిక్కెట్ బుక్ చేసుకునే సౌకర్యం కల్పిస్తోంది. నిమిషంలో పదిహేను వేల టిక్కెట్లు, ఒకేసారి మూడు లక్షల మంది బుక్ చేసుకునే సామర్థ్యం ఈ వెబ్ సైట్కు ఉంది. ప్రపంచంలోనే అత్యధిక రద్దీ కలిగిన రెండో వెబ్ సైట్ ఇది. లైఫ్ లైన్ ఆఫ్ ది నేషన్ దీని ట్యాగ్. ప్రతి రోజు ఆరు లక్షల మంది వరకు ఈ వెబై సైట్ ద్వారా టిక్కెట్ తీసుకుంటారు. మినీరత్న అయిన ఐఆర్సీటీసీలో వాటా విక్రయం ద్వారా రూ.645 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది.
బీఅలర్ట్: మీకు డబుల్ సిలిండర్ ఉందా, అయితే మీ కోసమే ఇది!
ఐపీవో ధర రూ.315 - రూ.320
30 సెప్టెంబర్ 2019, సోమవారం నుంచి IRCTC పబ్లిక్ ఇష్యూకు వెళ్తోంది. రూ.645 కోట్ల నిధుల సమీకరణ లక్ష్యం. అక్టోబర్ 3వ తేదీన ఐపీవో ముగుస్తుంది. రూ.10 ముఖ విలువ కలిగిన 2.1 కోట్ల ఈక్విటీ షేర్లను (2,01,60,000) ఆఫర్ ఫర్ సేల్ పద్ధతిలో విక్రయిస్తారు. ఈ ఐపీవోకు రూ.315 నుండి రూ.320 మధ్య ధరలను నిర్ణయించారు. రూ.2 లక్షల వరకు ఇన్వెస్టర్లు పెట్టుబడి పెట్టవచ్చు. రిటైల్ ఇన్వెస్టర్లు, ఉద్యోగులకు షేరు పైన రూ.10 రాయితీ ఇస్తున్నారు. ఈ షేర్లను బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో అక్టోబర్ 14న నమోదు చేస్తారు.
IRCTC కొన్ని విషయాలు...
IRCTC ఐపీవో నేపథ్యంలో దీని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం...
- 2008లో IRCTC మినీరత్న హోదా పొందింది. ఇండియన్ రైల్వేల్లో క్యాటరింగ్, పర్యాటక, ఆన్లైనన్ టిక్కెట్ బుకింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
- రైల్వే స్టేషన్లలో, రైళ్లలో ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ విక్రయిస్తోంది.
- రైల్లో ప్రయాణిస్తున్న వారు, బుక్ చేసుకుంటే ఆహారం, నీరు వారి వద్దకే తెచ్చి ఇస్తారు. వారి సీటు వద్దకు వస్తుంది. ఇది వరకు ప్రయాణీకులు స్టేషన్, స్టాల్స్ వద్ద దిగి కొనుగోలు చేసేందుకు ఇబ్బందిపడేవారు.
ఆసియా పసిఫిక్లో అత్యంత రద్దీ కలిగిన వెబ్ సైట్
- ప్రముఖ పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలు, విహార యాత్రలకు టిక్కెట్లు బుక్ చేసుకోవడంతో పాటు బస ఏర్పాట్లకు ప్రత్యేక ప్యాకేజీలు ఉన్నాయి.
- ఆసియా పసిఫిక్ ప్రాంతంలో అత్యంత రద్దీ కలిగిన వెబ్ సైట్ IRCTC
- ఇంటర్నెట్ టిక్కెటింగ్, క్యాటరింగ్, ప్యాకేజింగ్ డ్రింకింగ్ వాటర్, ట్రావెల్ అండ్ టూరిజం అనే నాలుగు బిజినెస్ సెగ్మెంట్లను ఆపరేట్ చేస్తోంది.
- ఈ-కేటరింగ్, ఎగ్జిక్యూటివ్ లాంజ్, బడ్జెట్ హోటల్స్ వంటి నాన్ రైల్వే కేటరింగ్ సేవల్లోను ఉంది.
నాలుగో పెద్ద పబ్లిక్ ఆఫర్
- రైల్వేస్ నుంచి నాలుగో పెద్ద పబ్లిక్ ఆఫర్.
- నెలకు 2.5 కోట్ల ట్రాన్సాక్షన్స్తో అత్యధిక రద్దీ కలిగిన వెబ్ సైట్. దాదాపు రోజుకు 0.72 కోట్లు.
- 31 ఆగస్ట్ 2019 నాటికి అంతకుముందు అయిదు నెలల ప్రకారం 72.60 శాతం ఇండియన్ రైల్వేస్ టిక్కెట్ బుకింగ్ ఆన్లైన్ ద్వారా జరిగాయి. వెబ్ సైట్స్, మొబైల్ అప్లికేషన్స్ ద్వారా బుక్ చేసుకుంటున్నారు.
వికల్ప్ వ్యవస్థ
2015 ఏప్రిల్ 1వ తేదీన రికార్డ్ స్థాయిలో 13,45,496 టిక్కెట్లను IRCTC ద్వారా బుక్ చేసుకున్నారు.
- 2017 ఏప్రిల్ నుంచి వెయిటింగ్ జాబితాలోని ప్రయాణీకులకు IRCTC ప్రత్యామ్నాయ రైలు సదుపాయ వ్యవస్థ వికల్ప్ను తీసుకు వచ్చింది.
- అదే ఏడాది నవంబర్ 3వ తేదీ నుంచి రైళ్ల ఆలస్యాన్ని ఎస్సెమ్మెస్ రూపంలో ప్రయాణీకులకు తెలియపరుస్తోంది. ఈ సేవ ద్వారా 250 రైళ్లు అందుబాటులోకి వచ్చాయి.
సంప్రదాయ టిక్కెట్ బుకింగ్ కౌంటర్ల కంటే ఎక్కువ
- 2019 జూన్ 30వ తేదీతో ముగిసిన క్వార్టర్కు సరాసరిన నెలకు 1.5 నుంచి 1.8 కోట్ల టిక్కెట్లను ప్రయాణీకులు ఐఆర్సీటీసీ ద్వారా కొనుగోలు చేశారు.
- ఇంటర్నెట్ బుకింగ్ కేంద్రాలు సంప్రదాయ బుకింగ్ కౌంటర్ల కంటే ఎక్కువగా ఉన్నాయి. దేశంలో ఇంటర్నెట్ వినియోగించే వారు ఎక్కువగా పెరిగిపోయారు. దీంతో ఈ వెబ్ సైట్ ద్వారా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
ఆదాయం ఇలా...
- IRCTC విక్రయాల ఆదాయం క్రమంగా పెరుగుతోంది. లాభాలు గత ఏడాదితో పోలిస్తే 23.5 శాతం పెరిగి రూ.272 కోట్లకు చేరుకున్నాయి.
- గత మూడేళ్లలో IRCTC ఆదాయం రూ.1535 కోట్లు (2017), రూ.1470 కోట్లు (2018), రూ.1868 కోట్లు (2019)గా ఉంది. ఈ కాలంలో నిర్వహణ లాభం వరుసగా రూ.312 కోట్లు, రూ.273 కోట్లు, రూ.372 కోట్లు. ఇబిటా మార్జిన్లు 20% స్థాయిలో నమోదవుతున్నాయి. ఈ మూడేళ్లలో రూ.229 కోట్లు, రూ.220 కోట్లు, రూ.272 కోట్లు చొప్పున నికర లాభం ఆర్జించింది.
- గత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం 25%, నికర లాభం 23% చొప్పున ఉన్నాయి.
ఐపీవో ద్వారా వచ్చే ఆదాయం ఎలా...
- IRCTC పూర్తిగా ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థ. దీని నిర్వహణ పగ్గాలు రైల్వేల చేతిలో ఉంటాయి. ఐపీవో ద్వారా వచ్చే ఆదాయం IRCTCకి వెళ్లదు. ప్రభుత్వానికే చెందుతుంది.
- ఈ ఆఫర్లో 12.5 శాతం వాటాను ఆఫర్ ఫర్ సేల్ కింద విక్రయిస్తున్నారు.
- దీంతో ప్రభుత్వ వాటా 87.5 శాతానికి తగ్గుతుంది. దీంతో కలిపి పబ్లిక్ ఆఫర్కు వచ్చిన రైల్వేలకు చెందిన నాలుగో కంపెనీ. అంతకుముందు ఆర్ఐటీఈఎస్, రైల్ వికాస్ నిగమ్, ఐఆర్సీవోఎన్.. ఐపీవోకు వచ్చాయి.
40 షేర్లను లాటుగా
- ఐడీబీఐ కేపిటల్ మార్కెట్స్, ఎస్బీఐ కేపిటల్ మార్కెట్స్, యస్ సెక్యూరిటీస్ సంస్థలు ఈ ఐపీవోకు బుక్ రన్నింగ్ లీడర్ మేనేజర్లుగా ఉన్నాయి. అలంకిత్ అసైన్మెంట్స్ లిమిటెడ్ సంస్థ దీనికి రిజిస్టార్.
- ఐపీవోలో 40 షేర్లను లాటుగా నిర్ణయించింది.
- రిటైల్ ఇన్వెస్టర్ల కోసం 70 లక్షల షేర్లు రిజర్వ్ చేసింది.
- అర్హత ఉన్న ఉద్యోగులకు, రిటైల్ పెట్టుబడిదారులకు రూ.10 డిస్కౌంట్ ఉంది.
- 1.60 లక్షల షేర్లను వీరికి రిజర్వ్ చేసింది.
- ఢిల్లీ - లక్నో మధ్య నడిచే ప్రయివేటు తేజాస్ ఎక్స్ప్రెస్ను అక్టోబర్ 5వ తేదీ నుంచి IRCTC నడపనుంది.