స్టాక్ మార్కెట్ పెట్టుబడుల స్వర్గధామం.... భారత్
మీరు చదివింది నిజమే. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులకు ప్రపంచంలోనే స్వర్గధామం భారతేనట. ఈ మాట అన్నది ఎవరో తెలుసా? 669 బిలియన్ డాలర్ల (సుమారు రూ 47,00,000 కోట్లు ) అసెట్స్ కలిగిన అబెర్డీన్ స్టాండర్డ్ ఇన్వెస్ట్మెంట్స్ సంస్థ ఉన్నతాధికారి. అమెరికా కు చెందిన ఈ బడా కంపెనీ స్టాక్ మార్కెట్ల లో ఈక్విటీ పెట్టుబడులు, ఫిక్స్డ్ ఇన్కమ్ పథకాల్లో , ప్రాపెర్టీల్లో ఇంకా ప్రత్యామ్నాయ రంగాల్లో భారీగా పెట్టుబడులు పెడుతుంది. భారత ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ శుక్రవారం ప్రకటించిన కార్పొరేట్ టాక్స్ రేటు తగ్గించిన నేపథ్యం లో ఒక ప్రపంచ స్థాయి పెట్టుబడుల కంపెనీ భారత స్టాక్ మార్కెట్లపై సానుకూల ప్రకటన చేయటం విశేషం. ఇది ప్రపంచ స్థాయి కంపెనీలు భారత్ లో పెట్టుబడులు ఎంతలా ఆతృతగా ఉన్నాయో తెలుపుతోంది. శుక్రవారం ఆర్థిక మంత్రి ప్రకటన నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్లు ఆనంద తాండవమే చేశాయి. నిఫ్టీ 569 పాయింట్లు పెరిగి 11,274 పాయింట్లకు చేరగా, సెన్సెక్స్ 1,921 పాయింట్లు పెరిగి 38,014 పాయింట్లు కు ఎగబాకింది. ఒక్క రోజే 5% నికి పైగా పెరిగి కొన్ని గంటల్లోనూ ఇన్వెస్టర్ల సంపదను ఏకంగా రూ 7,00,000 కోట్లకు పెంచాయి. ప్రభుత్వం ఏర్పడిన అనంతరం కోల్పోయిన రూ 15,00,000 కోట్ల లో ఒక్క రోజులోనే దాదాపు సగం వెనక్కి రాబట్ట గలిగాయి. ఆర్థిక మంత్రి ప్రకటనకు ముందు దేశమంతా ఒక రకమైన నిస్సత్తువ ఆవహించింది. కానీ ఇప్పుడు పరిస్థితుల్లో భారీ మార్పు వచ్చింది. ఒక్క రోజులో ఎంత మార్పు?
ప్రపంచం ఒక వైపు... భారత్ ఒక వైపు...
ప్రస్తుతం గ్లోబల్ ట్రేడ్ ద్వారా దాదాపు అన్ని దేశాలు ప్రభావితం అవుతున్నా భారత్ పరిస్థితి వేరుగా ఉందని అబెర్డీన్ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. ఇప్పుడు ప్రపంచ వృద్ధి రేటు ఒక వేళ మిమ్మల్ని నిరాశ పరిస్తే... పెట్టుబడులు పెట్టేందుకు భారత్ ఒక అద్భుతమైన ప్రదేశం అని అబెర్డీన్ స్టాండర్డ్ ఇన్వెస్ట్మెంట్స్ గ్లోబల్ ఈక్విటీ హెడ్ దివాన్ కాలూ పేర్కొన్నారు. ప్రపంచంలోనే గ్లోబల్ వార్ వల్ల అతి తక్కువగా ప్రభావితం ఐన దేశం భారత్ ఒక్కటే నని చెప్పారు. బ్యాంగ్ కోక్ లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కాలూ ఈ వ్యాఖ్యలు చేసినట్లు ప్రముఖ వార్త సంస్థ బ్లూమ్బెర్గ్ వెల్లడించింది.
దీర్ఘకాలిక పెట్టుబడులకు మేలు...
భారత స్టాక్ మార్కెట్లు కుదేలై షేర్ల విలువలు పతనమైన నేపథ్యంలో... ప్రస్తుతం ఇండియన్ స్టాక్ మార్కెట్ల విలువ తక్కువగానే ఉన్నపటికీ... చీప్ మాత్రం కాదని కాలూ అభిప్రాయపడ్డారు. అదే సమయంలో దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన సమయమేనని తెలిపారు. ఇండియా లో ప్రాపర్టీ మార్కెట్ బాగుందని, ముఖ్యంగా అందుబాటు ధరల గృహాల విషయంలో బహుళ ప్రయోజనాలు ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వ విధానాలు సైతం ప్రస్తుత మందగమనాన్ని ఎదుర్కొనే దిశగా సాగుతాయని విశ్వాసం వ్యక్తం చేసారు.
వృద్ధి రేటు తక్కువే...
అందరూ ఊహించిన మేరకు భారత్ లో జీడీపీ వృద్ధి రేటు ఉందని, అది అంచనాలకంటే తక్కువగానే ఉందని అబెర్డీన్ కాలూ అభిప్రాయపడ్డారు. కానీ, ప్రభుత్వం తీసుకొనే పన్ను నిర్ణయాలు, ఇతర విధానాలు దేశంలో ప్రస్తుత పరిస్థితులను మార్చగలవని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రస్తుత మందగమనం పరిస్థితుల్లో ప్రజలు ఆచి తూచి పెట్టుబడులు పెడుతున్నారని చెప్పారు. కానీ... తమ పెట్టుబడి సంస్థ మాత్రం దీర్ఘకాలిక వ్యూహంతో భారత్ లో పెట్టుబడులు పెడుతుందన్నారు. దేశంలో బ్యాంకింగ్ రంగాన్ని క్లీనప్ చేసే ప్రక్రియ తో పాటు అందుబాటు గృహాల విషయంలో తీసుకొంటున్న నిర్ణయాలు సత్ఫాలితాలు ఇస్తాయని తెలిపారు.
అమ్మకాల ఒత్తిడి...
కాగా... మొన్నటి వరకు జీడీపీ వృద్ధి రేటు 2013 స్థాయికి పడిపోవటం తో విదేశీ మదుపర్లు మన స్టాక్ మార్కెట్ల నుంచి భారీగా వెనక్కి తగ్గారు. సుమారు 5 బిలియన్ డాలర్ల (దాదాపు రూ 35,000 కోట్లు) విలువైన షేర్ల ను విక్రయించారు. 1999 తర్వాత ఈ స్థాయిలో భారత స్టాక్ మార్కెట్ల నుంచి వెనక్కి వెళ్లడం ఇదే తొలిసారి. కానీ... ప్రస్తుతం ఇటు దేశంలో నూ అటు విదేశాల్లోనూ భారత్ పై విశ్వాసం పెరిగే అవకాశాలు మెరుగు అయ్యాయి. అబెర్డీన్ మాటల్లో అది స్పష్టం అవుతోంది. కార్పొరేట్ టాక్స్ తగ్గింపు తో పాటు మరిన్ని మెరుగైన చర్యలు ఆర్థిక మంత్రి నుంచి వెలువడుతాయని ఆశిస్తున్నారు. దాంతో నిజంగానే ప్రపంచం లోనే భారత్ పెట్టుబడుల స్వర్గధామంగా వెలుగొందుతుంది.