13% పెరిగిన క్రూడాయిల్, భారీగా పెరగనున్న పెట్రోల్-డీజిల్ ధరలు!
సౌదీ అరేబియా ప్రభుత్వ కంపెనీ ఆరామ్కోకు చెందిన రెండు ప్రధాన చమురు క్షేత్రాలపై యెమన్ తిరుగుబాటుదారుల డ్రోన్ల దాడి నేపథ్యంలో పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా క్రూడాయిల్ ధరలు 13 శాతం పెరిగాయి. ఈ ప్రభావం భారత్ పైన పడే అవకాశముంది. క్రూడాయిల్ ధర 7.66 డాలర్లు లేదా 12.80 శాతం పెరిగి 67.90 డాలర్లుగా ఉంది. యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ క్రూడాయిల్ బ్యారెల్కు 6.22 డాలర్లు లేదా 11.34 శాతం పెరిగి 61.07 శాతం వద్ద ఉంది.
ఇల్లు కొనాలనుకుంటున్నరా? మీకు ముందే పండుగ వచ్చింది!
తగ్గిన చమురు ఉత్పత్తి
డ్రోన్ దాడి కారణంగా రోజువారీ ముడి చమురు ఉత్పత్తి 5.7 మిలియన్ బ్యారెల్స్ తగ్గిన విషయం తెలిసిందే. చమురు ఉత్పత్తిలో దాదాపు సగం తగ్గింది. ఈ ప్రభావం గ్లోబల్గా పడనుంది. తగ్గిన ఉత్పత్తి 5 శాతం. కాబట్టి ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. సమాచారం మేరకు జాతీయ చమురు సంస్థ సౌదీ ఆరామ్కో తన ముడి చమురు ఉత్పత్తిలో మూడింట రెండు వంతులు లేదా 2 మిలియన్ బ్యారెల్స్ను సోమవారం నాటికి ప్రారంభించనుంది.
భారత్లో రిటైల్ ధరలపై ప్రభావం
ఈ ప్రభావం భారత్లో రిటైల్ ధరలపై పడుతుందని చెబుతున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు అంతర్జాతీయ ధరలతో ముడివడి ఉంటాయి. కాబట్టి అంతర్జాతీయంగా ఏ పరిణామం అయినా భారత్లో చమురు ధరలపై ఉంటుంది. ప్రస్తుత పరిణామం భారత్లో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు దారి తీస్తుందని చెబుతున్నారు. ప్రస్తుతం భారత ఇంధన అవసరాల్లో 80% దిగుమతుల ద్వారానే తీరుతోంది. అదే సమయంలో మార్కెట్లో చమురు సరఫరాకు ఇబ్బందులు కలుగకుండా తమ భాగస్వామ్య దేశాలతో కలిసి పని చేస్తున్నామన్నట్లు అమెరికా ప్రకటించింది.
సోమవారం నిలకడగా ధరలు...
కాగా ప్రస్తుతానికి సోమవారం ధరలు నిలకడగా ఉన్నాయి. హైదరాబాదులో లీటర్ పెట్రోల్ ధర రూ.76.57, డీజిల్ ధర రూ.71.33గా ఉంది. అమరావతిలో పెట్రోల్ రూ.76.31, డీజిల్ రూ.70.73గా ఉంది. విజయవాడలో పెట్రోల్ రూ.75.94, డీజిల్ రూ.70.38గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.72.03 వద్ద ఉంది. డీజిల్ ధర రూ.65.43గా ఉంది. ముంబైలో పెట్రోల్ రూ.77.71, డీజిల్ రూ.68.62గా ఉంది. అయితే త్వరలో ధరలు పెరిగే అవకాశాలు లేకపోలేదు.