సాక్ష్యాలుంటేనే రండి: ఆ అంశంపై జగన్కు సర్దిచెప్పిన కేంద్రం!!
న్యూఢిల్లీ: వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ (PPA)లను సమీక్షించాలనే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం మరోసారి వ్యతిరేకంచింది. ఏపీలో చేసుకున్న పీపీఏల్లో ఎలాంటి అవకతవకలు జరిగినట్లుగా ఆధారాలు లేవని కేంద్రమంత్రి ఆర్కే సింగ్ సోమవారం చెప్పారు. గత తెలుగుదేశం హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలను రద్దు చేయాలని ఏపీ సీఎం జగన్ ప్రధాని మోడీని కోరినట్లు చెప్పారు.
రూ.10,000 సాయం పొందేందుకు అర్హతలు ఇవే.. ఇప్పుడే అప్లై చేయండి
జగన్కు సర్ది చెప్పాం
పీపీఏ ఒప్పందాలను సమీక్షించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నప్పటికీ పునరుద్బాతక ఇంధన డెవలపర్లందరిపై ఎలాంటి ఆధారాలు లేనందున ఇలాంటి చర్యలు సరికాదని కేంద్రమంత్రి అభిప్రాయపడ్డారు. ఆరోపణల్లో సరైన ఆధారాలు లేకుండా పీపీఏలను రద్దు చేస్తే దేశవ్యాప్తంగా పెట్టుబడులపై ప్రభావం పడే అవకాశముందని హెచ్చరించారు. ఇదే విషయం చెప్పి జగన్కు సర్ది చెప్పామన్నారు.
ఆధారాలు ఉంటే చర్యలు...
అవకతవకలపై ఆధారాలు ఉంటే మాత్రం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఏపీ సీఎంకు చెప్పామని కేంద్రమంత్రి అన్నారు. కానీ ఎలాంటి ఆధారాలు లేవని అభిప్రాయపడ్డారు. త్వరలో వివాదం పరిష్కారం అవుతుందని, అలాగే ప్రైవేటు కంపెనీలకు రూ.2వేల కోట్లు చెల్లిస్తారని నమ్మకం ఉందన్నారు.
అలా చేస్తే పెట్టుబడులు పెట్టేందుకు వెనక్కి తగ్గుతారు
జపాన్, ఫ్రాన్స్, యూరోప్, సౌతాఫ్రికా దేశాల నుంచి క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు ఆకర్షిస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ముందుంది. చాలామంది ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు నమ్మకంతో వచ్చారని, వారితో ఒప్పందాలను సమీక్షిస్తామని చెబుతుంటే అలాంటి ఇన్వెస్టర్లు వచ్చేందుకు భయపడతారని కేంద్రమంత్రి అభిప్రాయపడ్డారు.
భారత్ వైపు ప్రపంచ ఇన్వెస్టర్లు..
భారతదేశంలో పునరుత్పాదక ఇంధన రంగంలో విదేశీ పెట్టుబడులు ఎక్కువగా ఉన్నాయని కేంద్రమంత్రి చెప్పారు. ప్రపంచ ఇన్వెస్టర్లు కూడా భారత్ను మంచి మార్కెట్గా చూశారని చెప్పారు. పీపీఏలను రద్దు చేసే నిర్ణయం తీసుకుంటే పెట్టుబడులపై ప్రభావం పడుతుందని తాను జగన్ రెడ్డికి చెప్పానని తెలిపారు. పీపీఏలపై జగన్ ప్రభుత్వం ఆందోళనకు లేఖ ద్వారా ప్రత్యుత్తరం పంపిస్తామన్నారు.
సాక్ష్యాలుంటే రండి...
పీపీఏల విషయంలో మా స్టాండ్ చాలా క్లియర్గా ఉందని, చట్ట విరుద్దంగా ఏమైనా సాక్షాలు ఉంటే మా ముందుకు తీసుకు వస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి చెప్పారు. కానీ ఎలాంటి ఆధారాలు లేకుండా అన్ని ఒప్పందాలను తిరిగి సమీక్షించలేరని ఏపీ ప్రభుత్వానికి చెప్పారు.