మాంద్యం ఎఫెక్ట్: కమిషన్లు తగ్గించుకొంటున్న అమెజాన్, ఫ్లిప్కార్ట్?
దేశంలో ఆర్థిక మాంద్యం పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్న వేళ , అమ్మకాలను పెంచుకునేందుకు ఈ కామర్స్ కంపెనీలు అమెజాన్, ఫ్లిప్కార్ట్ కొత్త వ్యూహాలను సిద్ధం చేశాయి. సెల్లెర్ల నుంచి వసూలు చేసే కమిషన్లను దాదాపు 50% వరకు తగ్గించుకునేందుకు ముందుకు వస్తున్నాయి. ఈ విషయాన్నీ ది టైమ్స్ అఫ్ ఇండియా పత్రిక ఒక కథనంలో వెల్లడించింది. తగ్గిన కమిషన్ల ప్రయోజనాన్ని నేరుగా వినియోగదారులకు బదిలీ చేయాలని భావిస్తున్నాయి. తద్వారా మందగమనం లో ఉన్న అమ్మకాలకు కొత్త ఊపిరిలూదాలని చూస్తున్నాయి. త్వరలోనే దసరా, దీపావళి, క్రిస్టమస్, న్యూ ఇయర్, సంక్రాంతి వంటి పండుగలు మొదలయ్యే సీజన్లో అమ్మకాలను పెంచుకునేందుకు ఇంతకు మించి వాటికి మెరుగైన మార్గం కనిపించటం లేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఫ్లిప్కార్ట్ త్వరలోనే బిగ్ బిలియన్ డేస్ ను ప్రకరించబోతోంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లను చక చకా చేసుకొంటోంది. అమెజాన్ కూడా ఫెస్టివల్స్ సందర్భంగా సరికొత్త ఆఫర్ల తో ముందుకు వచ్చేందుకు సన్నాహాలు చేసుకొంటోంది.
రూ.200/డే ఇన్వెస్ట్ చేస్తే 15 ఏళ్లలో రూ.21 లక్షలు!!
మొబైల్స్ పై అత్యధికం....
సహజంగానే... ఈ కామర్స్ వెబ్సైట్ల లో అధికంగా కొనుగోలు చేసేది మొబైల్ ఫోన్లే. వాటి తర్వాత ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, గృహోపకరణాలు, దుస్తులు, గ్రోసరీలు తదితరాలు ఉంటాయి. అయితే, దాదాపు ఏడాది కాలంగా దేశంలో కార్ల నుంచి బిస్కెట్లు, షాంపూల వరకు అన్ని రకాల అమ్మకాలు తగ్గిపోతున్నాయి. ఇందుకు మొబైల్ ఫోన్లు అతీతం కాదు. కాబట్టి, వీటి అమ్మకాలను మరింత పెంచుకోవాలంటే.... ఆఫర్లను పెంచాల్సిందేనని ఈ కామర్స్ దిగ్గజాలు తలపోస్తున్నాయి. అదే వ్యూహాన్ని అమలు చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. ఈ విషయాన్నీ కంపెనీలు అధికారికంగా ద్రువీకరించనప్పటికీ జరుగుతున్న పరిణామాలను ఆన్లైన్ వెబ్సైట్ల లో విక్రయాలు చేసే వెండర్లు మాత్రం ఈ వ్యూహానికి సంబంధించిన వివరాలు వెల్లడిస్తున్నారు.
15-30% కమిషన్ ...
ఈ కామర్స్ వెబ్సైట్ల లో తమ ఉత్పత్తులను విక్రయించేందుకు సెల్లర్లు కేటగిరిని బట్టి సగటున 15% నుంచి 30% కమిషన్ చెల్లిస్తారు. అయితే, మొబైల్స్ , ఎలక్ట్రానిక్ పరికరాలపై కమిషన్ అటతి తక్కువగా ఉంటుంది. ఇది కేవలం 3 % నుంచి 7% మధ్యలో లభిస్తుంది. అదే అప్పారెల్స్, ఫాషన్ ఉత్పత్తులపై కమిషన్ అధికంగా దొరుకుతుంది. ఇది 25% నుంచి 30% వరకు ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కమిషన్ 50% వరకు కూడా లభిస్తుంది. అది పూర్తిగా బ్రాండ్, సెల్లార్ పై ఆధారపడి ఉంటుంది. ఈ కమిషన్లలో ప్రస్తుతం ఈ కామర్స్ కంపెనీలు కనీసంగా 30% ... గరిష్టంగా 50% వరకు తగ్గించుకొనేందుకు సమ్మతించాయని తెలుస్తోంది. అంటే, ఆ మేరకు ఆన్లైన్ లో లభించే వస్తువులపై ధరలు తగ్గుతాయి. దీంతో అమ్మకాలు పెరిగే అవకాశం అధికం అవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
పెరుగుతున్న ప్రైవేట్ లేబుల్స్ ...
ప్రభుత్వం విధించిన నియంత్రణల నేపథ్యంలో ఈ కామర్స్ కంపెనీలు తమ సొంత బ్రాండ్లను పరిచయం చేస్తున్నాయి. ఎందుకంటే, ఈ కామర్స్ అగ్గ్రిగేటర్లు ధరలను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా నియంత్రించ కూడదు. ధరల నిర్ణయం కేవలం ఆ మార్కెట్ ప్లేస్ లో విక్రయించే విక్రేతకే ఉంటుంది. అందుకే, అమెజాన్, ఫ్లిప్కార్ట్ కంపెనీలు తమ సొంత కంపెనీలను విక్రతలుగా రంగంలోకి దించి వాటి ద్వారా అధిక మొత్తంలో ఆఫర్లను గుప్పిస్తున్నాయి. తద్వారా అమ్మకాలను పెంచుకొంటున్నాయి. ప్రైవేట్ లేబుల్ ఉత్పత్తుల్లో అధికంగా అప్పారెల్స్, ఫాషన్, కాస్మొటిక్స్, మొబైల్ ఆక్సిస్సోరీస్ ఉంటున్నాయి. వీటిపై ఆఫర్లను 50% నుంచి 70% వరకు అందిస్తున్నాయి. దీంతో, సరిగ్గా అలాగే ఉండే ఇతర బ్రాండ్ వస్తువు కంటే చాలా తక్కువ ధరకే ప్రొడుక్ట్లులు లభిస్తాయి కాబట్టి వినియోగదారులు వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
వ్యవస్థకు ఉద్దీపన...
ఈ కామర్స్ కంపెనీలు భారీగా ఆఫర్లను గుప్పించి తమ వ్యాపారాలను దెబ్బతీస్తున్నాయని ఆఫ్-లైన్ విక్రేతలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. అందుకే ప్రభుత్వం కఠినమైన నిబంధనలను విధించింది. కానీ... ప్రతి ప్రభుత్వ నిబంధనల్లోనూ కొన్ని లోపాలు ఉంటాయి. వాటినే తమకు అనుకూలంగా మార్చులోవడంలో ఈ కంపెనీలకు పెట్టింది పేరు అని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే, దేశంలో మాంద్యం ఆవహిస్తున్న సమయంలో అమ్మకాలు పెరగాలంటే... అటు ప్రభుత్వమైనా... ఇటు ప్రైవేటు రంగమైనా ఉద్దీపనలు ప్రకటించాల్సిందేనని వారు చెబుతున్నారు. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లు ప్రస్తుతం పరోక్షంగా చేస్తున్నది అదేనని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఏది ఏమైనా... మార్కెట్ రేటు కంటే తక్కువకు లభిస్తుంటే... వినియోగదారులు కొనుగోలు చేయకుండా ఎలా ఉండగలరు? మీరేమంటారు?