ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయలేదా... అయితే మీకు ఇంకా ఛాన్స్ ఉంది!!
న్యూఢిల్లీ: ఆగస్ట్ 31వ తేదీతో ఆదాయపన్ను రిటర్న్స్ ఫైల్ గడువు ముగిసింది. జూలై 31వ తేదీ ఉన్న గడువును వివిధ కారణాల వల్ల నెల రోజులు పొడిగించారు. దీంతో చాలామందికి వెసులుబాటు లభించింది. ఐటీ రిటర్న్స్ చివరి నాలుగైదు రోజుల్లో ముఖ్యంగా చివరి రోజు ఎక్కువగా దాఖలయ్యాయి. గడువు దాటినా రిటర్న్స్ దాఖలు చేయని వారు కూడా కొందరు ఉంటారు. వారి కోసమే ఇది...
ఐటీ రిటర్న్స్ దాఖలు తేదీ ఆగస్ట్ 31వ తేదీతో ముగిసినప్పటికీ జరిమానాతో ఇప్పుడు కూడా దాఖలు చేయవచ్చు. ఆదాయపన్ను శాఖ వెబ్సైట్ ప్రకారం... ఆలస్యంగా రిటర్న్స్ ఫైల్ చేస్తున్నందుకు గాను రూ.5,000 నుంచి రూ.10,000 వరకు ఫైన్ ఉంటుంది. సెక్షన్ 139(4) కింద ఆలస్యంగా రిటర్న్స్ ఫైల్ చేయవచ్చు.
ఆలస్యంగా రిటర్న్స్ ఫైల్ చేసినందుకు గాను ఫైన్ ఉంటుంది. ఆదాయ పన్ను చట్టం నిబంధనల ప్రకారం డిసెంబర్ 31వ తేదీలోపు ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తే రూ.5,000 ఫైన్ ఉంటుంది. అప్పటికీ ఆలస్యపు రిటర్న్స్ దాఖలు చేయకుంటే జనవరి 1వ తేదీ నుంచి మార్చి 31వ తేదీ వరకు రూ.10,000 జరిమానా ఉంటుంది. వార్షిక ఆదాయం రూ.5,00,000లోపు కలిగిన వారు రూ.1,000 ఫైన్ చెల్లించాలి.