పండుగల వేల ... ప్రాపర్టీ ధరలు తగ్గుతాయా?
సొంత ఇంటి కళలు కనే కొనుగోలుదారులు శుభ ముహూర్తాన ఓ ఇంటి వారు కావాలని కోరుకొంటారు. అలంటి వారి కోసం దసరా, దీపావళి పండుగలు వచ్చేస్తున్నాయి. శుభ ముహూర్తాలను తెచ్చేస్తున్నాయి. అయితే, గత రెండేళ్లుగా అమాంతం పెరిగిపోయిన ప్రాపర్టీ ధరలు ఏమైనా తగ్గుతాయా... అని గృహ కొనుగోలుదారులు నిరీక్షిస్తున్నారు. ఇటీవల రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రేపో రేటు కత్తిరింపుతో స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా సహా దాదాపు అన్ని బ్యాంకులు గృహ రుణాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి.
చాలా వరకు బ్యాంకు వడ్డీ రేట్లు ఇప్పుడు సగటున 8% వద్ద లభిస్తున్నాయి. ఇది వినియోగదారులకు ఒక శుభవార్తే. కానీ, అసలు ప్రాపర్టీ ధరలు కాస్త తగ్గితే ఇంకొంత ఊరట లభిస్తుందని వారు కోరుకొంటున్నారు. ఆర్థిక మాంద్యం ముంచుకొస్తున్న తరుణం లో బిల్డర్లు ధరలు తగ్గిస్తారేమో అని ఎదురు చూస్తున్నారు. దేశంలోని 7 ప్రధాన నగరాల్లో అమ్మకానికిని నోచుకోని ఇళ్ల సంఖ్య కూడా భారీగా పేరుకుపోతోంది. ఇది కూడా ధరలు తగ్గుతాయనేందుకు దోహదం చేస్తోంది. అయితే, అసలు పరిస్థితులు ఎలా ఉన్నాయి, ధరలు తగ్గుతాయా... లేదంటే పెరుగుతాయా అనేది చాలా ఆసక్తికరంగా మారింది.
టి" />మీ చేతికి వచ్చే శాలరీ పెరగొచ్చు, పెన్షన్కు ఏదో ఒకటి
అమ్ముడుపోని గృహాలు సుమారు 7 లక్షలు....
దేశవ్యాప్తంగా 7 ప్రధాన నగరాల్లో అమ్ముడుపోని గృహాల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. న్యూ ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్కతా, పూణే నగరాల్లో ఏకంగా 7 లక్షల గృహాలు కొనుగోలుదారుల కోసం ఎదురు చూస్తున్నాయి. జీఎస్టీ రేట్లు పెరిగిపోవడం, ప్రాపర్టీ ధరలు ఆకాశాన్ని అంటడం, గృహ రుణాలపై వడ్డీ రేట్లు అధికంగా ఉండటం వంటి అంశాలు ఇన్వెంటరీ పేరుకుపోయేందుకు కారణం అయ్యాయి. సీరియస్ గా ఇల్లు కొనుగోలు చేయాలని కోరుకొన్న వినియోగదారులు సైతం వారి నిర్ణయాలను వాయిదా వేసుకొన్నారు. కానీ గత 6 నెలల కాలంలో దేశంలో పరిస్థితుల్లో భారీ మార్పులు చోటు చేసుకొన్నాయి. జీఎస్టీ రేట్లు తగ్గాయి. వడ్డీ రేట్లు దిగి వస్తున్నాయి. ప్రైవేట్ బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు దెబ్బ తిన్నాయి. జీడీపీ వృద్ధి రేటు మందగిస్తోంది. ఇక మిగిలింది ప్రాపర్టీ ధరలు తగ్గటమే....
రెండేళ్లలో 30 % నికి పైగా పెరుగుదల....
దేశంలోని అన్ని ప్రధాన నగరాలు, పట్టణాల్లో రియల్ ఎస్టేట్ ధరలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా నోట్ల రద్దు అనంతరం ప్రజలు భూములు, స్థలాలు, ఇండ్లు, కమర్షియల్ ప్రాపర్టీలు అధికంగా కొనుగోలు చేసారు. బ్యాంకింగ్ వ్యవస్థపై నమ్మకం కోల్పోయిన పౌరులు, వారి పెట్టుబడులను ఫిక్స్డ్ డిపాజిట్ల నుంచి రియల్ ఎస్టేట్ వైపు మళ్లించారు. దీంతో 2017 నుంచి ఇప్పటి వరకు ప్రాపర్టీ ధరలు 30 % నుంచి 50% వరకు పెరిగిపోయాయి. సిమెంట్, స్టీల్ ధరలు, ఇసుక, ఇటుక వంటి నిర్మాణ సామాగ్రి ధరలూ పెరిగిపోయాయి. ఈ ప్రభావంతో దేశంలో ఎక్కడ చూసినా రియల్ ఎస్టేట్ బూమ్ కనిపించింది. ముఖ్యంగా మన హైదరాబాద్ మహా నగరంలో రియల్ ఎస్టేట్ బూమ్ మరింత అధికమైంది. కానీ పరిస్థితుల్లో మార్పులు ఇప్పుడిప్పుడే ప్రస్ఫుటమవుతున్నాయి.
60 శాతానికి పైగా వినియోగదారులది అదే ఆశ....
ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ కంపెనీ అనారోక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ నిర్వహించిన ఒక సర్వే లో 60% నికి పైగా వినియోగదారులు గృహాలు కొనుగోలు చేసేందుకు సీరియస్ గా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వారందరు ప్రాపర్టీ ధరలు తగ్గుతాయని ఆశిస్తున్నారు. ఇందుకు పైన ఉదహరించిన కారణాలను వెల్లడిస్తున్నారు. సహజంగానైతే.... ఇప్పుడున్న పరిస్థితుల్లో తప్పనిసరిగా ప్రాపర్టీ ధరలు దిగి రావాల్సిందే. కానీ, బిల్డర్ల మాట మరోలా ఉంది.
స్వల్పం ... లేదా ఉండక పోవచ్చు....
జీఎస్టీ రేట్లు తగ్గినా తమకు ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ రావటం లేదు కాబట్టి ధరలను తగ్గించలేం అని రియల్ ఎస్టేట్ బిల్డర్లు చెబుతున్నారు. నిర్మాణం కోసం ఆల్రెడీ అధిక పెట్టుబడి పెట్టమని, డిస్కౌంట్ ధరలకు ఇండ్లను అమ్ముకోలేమని చెబుతున్నారు. నాన్ బ్యాంకింగ్ రంగ కంపెనీలు దివాళా తీయటంతో తమకు రుణాల లభ్యత తగ్గిపోయిందని, సమయానికి నిర్మాణాలను పూర్తి చేయలేక పోతున్నామని వారు పేర్కొంటున్నారు. నిర్మాణం ఆలస్యం అయితే, వ్యయం పెరిగిపోతుంది కాబట్టి వినియోగదారులకు ధరలను తగ్గించటం కుదరదని స్పష్టం చేస్తున్నారు. అయితే, కొనుగోళ్లు పెంచేందుకు పండుగల సందర్భంగా అనేక ఆఫర్లు ప్రకటిస్తామని, అందులో బుక్ చేసుకున్నవారికి అధిక ప్రయోజనం లభిస్తున్నాడని చెబుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో చదరపు అడుగు సగటు ధర రూ 4,100 నుంచి రూ 4,200 పలుకుతోంది. శివార్లలో మాత్రం రూ 3,200 నుంచి రూ 3,500 వరకు లభిస్తున్నాయి. ఇందులో పెద్దగా తగ్గింపు సాధ్యం కాకపోవచ్చని క్రెడాయ్ ప్రతినిధులు వెల్లడించారు. అయితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ధరలు పెద్దగా పెరగ పోవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. ధరలు పెరగక పోవడం అంటే కూడా తగ్గినట్లుగా భావించాలని వారు కోరుతున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు సూచిస్తున్నారు. సో, మారేందుకు ఆలస్యం!