జియో ఎఫెక్ట్, ఎయిర్టెల్ సరికొత్త ఎక్స్ట్రీమ్ స్టిక్, బాక్స్
ముంబై: రిలయన్స్ జియో ఫైబర్ మరో రెండు మూడు రోజుల్లో ప్రారంభం కానుంది. ఫైబర్ గ్రిడ్ బంపర్ ఆఫర్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కస్టమర్లకు చౌక ధరకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ప్రభావం ఇతర కంపెనీలపై పడనుంది. ఈ నేపథ్యంలో జియోతో పోటీకి ఎయిర్టెల్ సిద్ధమైంది. ఈ దిగ్గజ టెలికం కంపెనీ కూడా ధీటుగా OTT సేవలను ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఇందుకోసం ఎయిర్ టెల్ ప్రత్యేకంగా ఎయిర్ టెల్ ఎక్స్ట్రీమ్ (Xstream)ను ప్రకటించింది.
సెప్టెంబర్-2019 బ్యాంకు సెలవుల పూర్తి జాబితా..
జియోకు పోటీగా... ఎయిర్ టెల్ ఎక్స్ట్రీమ్
జియో ఫైబర్ గ్రిడ్ సెప్టెంబర్ 6వ తేదీన కమర్షియల్ సేవలను ప్రారంభించనుంది. దీనికి మూడు రోజుల ముందు ఎయిర్ టెల్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. ఎయిర్ టెల్ ఎక్స్ట్రీమ్ ద్వారా తమకు నచ్చిన స్క్రీన్ పైన విభిన్నమైన డిజిటల్ కంటెంట్ను... టెలివిజన్, పీసీ లేదా స్మార్ట్ ఫోన్ యాక్సెస్ చేసుకోవచ్చు. నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోల్ని చూడవచ్చు.
ఎక్స్ట్రీమ్ ద్వారా...
ఎక్స్ట్రీమ్ ద్వారా లైవ్ టీవీ, వీడియోలు, మ్యూజిక్, న్యూస్, స్పోర్ట్స్ వంటివి ఉంటాయి. ఎయిర్ టెల్ ఎక్స్ట్రీమ్ స్టిక్ ఆండ్రాయిడ్ 8.0పై పని చేస్తుంది. అమెజాన్ పైర్ స్టిక్లా పని చేసే దీని ధర రూ.3,999. ఓటీటీ స్మార్ట్ స్టిక్, ఇంటర్నెట్ ఎనేబుల్డ్ సెట్ టాప్ బాక్స్, హ్యాండ్ హెల్డ్ డివైస్లు ఉపయోగించు చూడవచ్చు.
ధర రూ.3,999
ఇది సోమవారం నాడు రెండు ఆండ్రాయిడ్ ఆధారిత కనెక్ట్ పరికరాలను విడుదల చేసింది. ఎక్స్ట్రీమ్ ఓటీటీ స్టిక్ మరియు ఎక్స్ట్రీమ్ 4కే హైబ్రిడ్ బాక్స్. ఒక్కొక్కటి రూ.3,999 ధరతో టీవీని స్మార్ట్ డివైస్గా మారుస్తుంది. ఈ హైబ్రిడ్ బాక్స్ అన్ని ఎక్స్ట్రీమ్ కంటెంట్స్కు రూ.999 విలువ కలిగిన 1 ఏడాది కాంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్ ఉంటుంది. అలాగే, నెల రోజుల హెచ్డీ డైరెక్ట్ టు హోమ్ డిజిటల్ టీవీ సర్వీస్ ప్యాక్ అదనం.
ఎయిర్ టెల్ థ్యాంక్స్కు ప్రత్యేకం
ఎయిర్ టెల్ థ్యాంక్స్ ప్లాటినమ్, గోల్డ్ వినియోగదారులు కొన్ని కార్యక్రమాలను ప్రత్యేకంగా వీక్షించే అవకాశం కల్పిస్తోంది. ఇతర కస్టమర్లు నెల రోజులు ఉచితంగా వీక్షించవచ్చు. ఎయిర్ టెల్ ఎక్స్ట్రీమ్ ఫ్లిప్కార్టులో లభించనుంది. అలాగే ఎంపిక చేసిన ఆన్ లైన్ స్టోర్స్లలోను ఇది లభిస్తుంది. ఎయిర్ టెల్ సెట్ టాప్ బాక్స్ వినియోగిస్తున్న వారు రూ.2,249 చెల్లించడం ద్వారా తమ సెట్ టాప్ బాక్సును అప్ గ్రేడ్ చేయవచ్చు.