బంగారం@40,220: జీవనకాల గరిష్టానికి ధర: ఏడాదిలో 33% పెరుగుదల
న్యూఢిల్లీ: బంగారం ధరలు భారీగా పెరిగాయి. గత కొన్నాళ్లుగా పసిడి ధరలు పరుగెడుతున్నాయి. 2020 జనవరి లేదా దీపావళి నాటికి ధరలు రూ.40,000 మార్క్ చేరుకుంటాయని తొలుత విశ్లేషకులు అంచనా వేశారు. కానీ అలా చెప్పిన పది పదిహేను రోజుల్లోనే రికార్డ్ హైకి చేరుకున్నాయి. గురువారం నాడు పసిడి ధరలు రూ.250 నుంచి 300 పెరిగి ఏకంగా నలభై వేల మార్క్ దాటింది. ఇది సరికొత్త లైఫ్ టైమ్ హై. బులియన్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.40,220 పలికింది. వెండి ధర కూడా రూ.50 వేల మార్క్ సమీపంలో ఉంది. వెండి రూ.200 పెరిగి కిలో రూ.49,050 వద్ద ఉంది.
శుభవార్త! ఎలక్ట్రిక్ వాహనాల ధరలు త్వరలో తగ్గుతాయి!
బంగారంపై పెట్టుబడి...
ఆర్థిక మాంద్యం ఆందోళన, అమెరికా - చైనా వాణిజ్య అనిశ్చితి, రూపాయి బలహీనం, స్థానిక జ్యువెల్లర్స్ నుంచి డిమాండ్ వంటి వివిధ కారణాల వల్ల బంగారం ధరలు పెరుగుతున్నాయి. ప్రధానంగా రూపాయి క్షీణిస్తుండటంతో బంగారంలో పెట్టుబడి పెట్టడం మంచిదని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. రాజకీయ, ఆర్థిక అనిశ్చితుల నేపథ్యంలో బంగారంపై ఇన్వెస్ట్ చేయడం మంచిదని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. పైగా ఇప్పుడు పండుగ సీజన్. కాబట్టి నగల వ్యాపారులు, నాణేల తయారీదారుల నుంచి కూడా డిమాండ్ ఉంది. ఈ కారణంగా పసిడి, వెండి ధరలు పెరుగుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
హైదరాబాద్లో ఎంత ధర అంటే...
న్యూఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.250 నుంచి రూ.300 పెరిగి రూ.40,220 రికార్డ్ జీవన కాల గరిష్టానికి చేరుకుంది. న్యూఢిల్లీలో 99.9% స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం రూ.40,220, 99.5% స్వచ్ఛత గల 10 గ్రాముల బంగారం
రూ.40,050గా ఉంది. హైదరాబాదులో 24 క్యారట్ బంగారం రూ.40,440, 22 క్యారట్ బంగారం రూ.37,130 గా ఉంది. ఎనిమిది గ్రాముల సావరీన్ బంగారం రూ.400 పెరిగి రూ.30,200 వద్ద ఉంది.
పెరిగిన వెండి ధర
వెండి ధర కిలో రూ.200 పెరిగి రూ.49,050 చేరుకుంది. హైదరాబాదులో కిలో వెండి రూ.49,160గా ఉంది. మార్కెట్లో 100 వెండి నాణేల ధర రూ.3,000 పెరిగింది. 100 వెండి నాణేల కొనుగోలు ధర రూ.1,01,000, అమ్మకం ధర రూ.1,02,000గా ఉంది. వివిధ కారణాల వల్ల వెండి రికార్డ్ స్థాయి ధరకు చేరుకుంటోందని నిపుణులు చెబుతున్నారు.
18 నెలల్లో రూ.10వేలు పెరిగిన బంగారం
బంగారం దాదాపు 18 నెలల్లో ఏకంగా రూ.30,000 నుంచి రూ.40,000కు పెరిగింది. ఈ కాలంలో 33 శాతం పెరుగుదల. గ్లోబల్ ఎకనామిక్ సెంటిమెట్స్ కారణంగా పెట్టుబడిదారులు బంగారం వైపు చూస్తున్నారని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్ (కమోడిటీ రీసెర్చ్) హరీష్ వీ అన్నారు. 2019లో బంగారం అనూహ్యంగా పెరిగిందని చెబుతున్నారు.
వచ్చే ఏడాది 2,000 డాలర్లకు బంగారం...
మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీలు, రియల్ ఎస్టేట్, ఫిక్స్డ్ డిపాజిట్ల నుంచి వచ్చే రాబడి కంటే బంగారంపై ఇన్వెస్ట్ చేయడం సురక్షితమని ఇన్వెస్టర్లు భావిస్తున్నారని అంటున్నారు. 2020లో ఔన్స్ బంగారం ధర 2,000 డాలర్లకు చేరుకున్నా ఆశ్చర్యం లేదని అంటున్నారు. ప్రస్తుతం 1,542.06 డాలర్లుగా ఉంది. అయితే అమెరికా - చైనా వాణిజ్య చర్చల ఫలితం ఆధారంగా ఈ ధరల పెరుగుదల ఉంటుందని చెబుతున్నారు.