ఫుడ్ డెలివరీ యాప్ లకు దెబ్బ : 1200 రెస్టారెంట్లు లాగౌట్
భారత్ లోని ఫుడ్ డెలివరీ యాప్ లకు ఎదురు దెబ్బ. దేశంలోని ప్రధాన నగరాల్లోని రెస్టారెంట్లు వీటి నుంచి పెద్ద ఎత్తున లాగౌట్ అవుతున్నాయి. వినియోగదారులకు విపరీతమైన డిస్కౌంట్లను ఆఫర్ చేస్తూ రెస్టారెంట్ల బిజినెస్ మోడల్ నే దెబ్బతీసేలా ఉన్న ఫుడ్ డెలివరీ యాప్ లలో కొనసాగేది లేదని హోటల్ యాజమాన్యాలు తెగేసి చెబుతున్నాయి. #Logout పేరుతో ఏకంగా ఒక కాంపెయిన్ ప్రారంభించాయి. ఈ కాంపెయిన్ ముఖ్య ఉద్దేశ్యం ఫుడ్ డెలివరీ యాప్ ల నుంచి బయటకు (లాగౌట్) వచ్చేయటమే. ఈ కాంపెయిన్ లో భాగంగా ఇప్పటికే సుమారు 1,200 రెస్టారెంట్లు జొమాటో సహా ఇతర ఫుడ్ డెలివరీ యాప్ ల నుంచి ఎగ్జిట్ అయ్యాయి. మరిన్ని హోటల్స్, రెస్టారెంట్లు ఇదే బాటలో పయనించే అవకాశం కనిపిస్తోంది. ఈ పరిణామం జొమాటో, స్విగ్గి, కంపెనీలకు గొడ్డలి పెట్టు వంటిదే.
పుట్ట గొడుగులు...
దేశంలో ఫుడ్ డెలివరీ రంగంలోకి జొమాటో, స్విగ్గి , ఉబెర్ ఈట్స్, ఫుడ్ పాండా, ఫాసూస్, ఈజీ డైన్ వంటి అనేక కంపెనీలు వచ్చాయి. ప్రధాన పోటీ స్విగ్గి, జొమాటో ల మధ్యే ఉన్నప్పటికీ... ఉబెర్ ఈట్స్, ఓలా కొనుగోలు చేసిన అనంతరం ఫుడ్ పాండా కూడా భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తూ వినియోగదారులను సంపాదించే పనిలో పడ్డాయి. ఈ క్రమంలో రూ వందల కోట్లలో నష్టాలు వస్తున్నా... పట్టించుకోలేదు. ఒకరిపై మరొకరు పై చేయి సాధించేందుకు విశ్వ ప్రయత్నాలు చేయటంతో ... నష్టాలు పెరిగాయి తప్ప వాటికీ ఒరిగింది ఏమి లేదు. అయితే, ఫుడ్ డెలివరీ, టేబుల్ రిజర్వేషన్ యాప్ లు అందించే డిస్కౌంట్స్ వాళ్ళ హోటల్స్, రెస్టారెంట్ల కు వచ్చే వారి సంఖ్య ప్రభావితమైంది. డిస్కౌంట్స్ ఉంటె తప్ప కన్స్యూమర్ ఫుడ్ ఆర్డర్ చేయలేని పరిస్థితిని ఈ యాప్ లు క్రియేట్ చేశాయని హోటల్స్ భావిస్తున్నాయి. మరో వైపు, ఈ యాప్ ల నుంచి వచ్చే ఆర్డర్ల పై 15% నుంచి 25% వరకు కమిషన్ చెల్లించాల్సి వస్తోంది. దీంతో హోటల్స్, రెస్టారెంట్ల యజమానుల లాభదాయకత దెబ్బతింటోంది.
గుర్గావ్ లో మొదలు...
ఎప్పటి నుంచో ఫుడ్ డెలివరీ యాప్ ల పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న హోటల్స్ అండ్ రెస్టారెంట్లు... మొత్తమీద తొలిసారి ఆచరణలోకి దిగాయి. రెండు, మూడు రోజుల క్రితమే దేశ రాజధాని ప్రాంతం ఐన గుర్గావ్ లో సుమారు 200 హోటల్స్ అండ్ రెస్టారెంట్లు ఈ యాప్ ల నుంచి లాగౌట్ అయ్యాయి. వీటిని ఆదర్శంగా తీసుకొన్న ఇతర నగరాల్లోని హోటల్స్ కూడా స్పందించటం ప్రారంభించాయి. ప్రస్తుతం 1,200 హోటల్స్ లాగౌట్ కాంపెయిన్ లో భాగంగా యాప్ ల నుంచి బయటకు వచ్చేసాయి. ముంబై, ఢిల్లీ, బెంగళూరు, కోల్కతా, గోవా, పూణే, వడోదర నగరాలకు ఈ ఉద్యమం పాకింది. రెండు రోజుల క్రితం గుర్గావ్ లో ప్రారంభమైన ఈ కాంపెయిన్ ఇంత త్వరగా దేశవ్యాప్త ఉద్యమంలా మార్తాన్ని బట్టే... ఈ యాప్ లు అందించే అధిక డిస్కౌంట్ల వాళ్ళ దేశం లోని హోటల్స్, రెస్టారెంట్లు ఎలా దెబ్బ తింటున్నాయో అర్థం చేసుకోవచ్చు అని నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ రాహుల్ సింగ్ తెలిపారని ది ఎకనామిక్ టైమ్స్ ఒక కథనంలో వెల్లడించింది.
కాంపెయిన్ ను తప్పు పట్టిన జొమాటో...
ఫుడ్ డెలివరీ యాప్ లకు వ్యతిరేకంగా మొదలైన లాగౌట్ కాంపెయిన్ ను ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ కంపెనీ జొమాటో తప్పు పట్టింది. ఇలాంటి పరిస్థితిలో సరఫరా ను తగ్గించటం ద్వారా సిండికేట్ గ్రూప్ ల ఏర్పడి ధరలను పెంచే ఎత్తుగడలా కనిపిస్తోందని జొమాటో హెచ్చరించింది. అదే సమయం లో ఒక వేళ రెస్టారెంట్లు తమ యాప్ నుంచి తప్పుకోవాలంటే 45 రోజుల ముందస్తు నోటీసు ఇవ్వాలని, అలాగే మళ్ళీ యాప్ లో కొనసాగాలంటే సైన్ అప్ ఫీజు చెల్లించాలని తెలిపింది. ఈ విషయాన్నీ ది ఎకనామిక్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది.
మంచి... చేదు...
ప్రతి చోట ఉన్నట్లే... ఫుడ్ డెలివరీ రంగంలోనూ మంచీ చెడులు సమన భాగంగా కనిపిస్తున్నాయి. తక్కువ ధరలకే వినియోగదారులకు ఇంటికే ఆహారాన్ని సరఫరా చేస్తుంటే ... ఎవరైనా ఎందుకు కాదంటారు. ప్రస్తుత బిజీ లైఫ్ స్టైల్ లో వినియోగదారులు అన్నిటినీ ఆన్లైన్ ఆర్డర్ చేస్తున్నారు ఫుడ్ తో సహా... కానీ ఇది అటు హోటల్స్ కు, ఇటు ఫుడ్ డెలివరీ యాప్ లకు, మరోవైపు వినియోగదారులకు మేలు చేసేదిలా ఉండాలి కానీ, ఒకరిని కొట్టి మరొకరికి పెడతాం. ఇందులో మేము బలైపోయినా ఫరవాలేదు అనే ధోరణి సరి కాదని ఈ రంగంలోని నిపుణులు సూచిస్తున్నారు. అపోహలను పరస్పర అంగీకారంతో సర్దుబాటు చేసుకోవాలని వారు హితవు పలుకుతున్నారు.