రిలయన్స్ దోస్తీతో సౌదీ అరేబియా పట్టు, టాప్లోకి ఆరామ్కో
ముంబై: ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్లో ఆరామ్కో 20 శాతం వాటాలు కొనుగోలు చేయడం ద్వారా.. భారత్కు చమురు సరఫరా చేస్తున్న దేశాల్లో తిరిగి సౌదీ అరేబీయానే అగ్రస్థానం కైవసం చేసుకోనుంది. ప్రస్తుతం భారత్కు చమురు సరఫరా చేస్తున్న దేశాల్లో ఇరాక్ ముందుండగా, ఈ ఒప్పందంతో అది వెనుకపడనుంది. గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఇరాక్ టాప్లో ఉంది. సౌదీ నుంచి ఇప్పటి వరకు 40.33 మిలియన్ టన్నుల ముడి చమురు దిగుమతి అవుతోంది.
ఆ 3 కలిసినా దిగదుడిపే: ప్రపంచంలో అత్యంత లాభదాయక సంస్థతో అంబానీ జట్టు
ఏడాదికి 25 మిలియన్ టన్నుల సరఫరా
రిలయన్స్కు చెందిన ఆయిల్ టు కెమికల్స్ బిజినెస్లో 20 శాతం వాటాను ఆరామ్కో కొనుగోలు చేయనుంది. జామ్ నగర్లో అతిపెద్ద రిఫైనింగ్ కాంప్లెక్స్ ఉంది. దీనికి రోజుకు అర మిలియన్ బ్యారెల్స్ క్రూడాయిల్ సరఫరాకు హామీ ఇచ్చింది. తద్వారా సంవత్సరానికి 25 మిలియన్ టన్నుల సరఫరా దాటడం ద్వారా సౌదీ.. ఇరాక్ను దాటి అగ్రశ్రేణిలో నిలుస్తుంది. ఆసియా సాధారణంగా మిడిల్ ఈస్ట్ నుంచి ఎక్కువ ముడి చమురును కొనుగోలు చేస్తుంది. ఆరామ్కో ఆయిల్ టు కెమికల్స్ విభాగంలో వాటాను 1500 కోట్ల డాలర్లతో కొనుగోలు చేయనుంది.
సౌదీ అరేబియాకు పోటీ...
గతంలో భారత్కు అతిపెద్ద చమురు సరఫరాదారుగా సౌదీ అరేబియానే ఉండేది. కానీ గత రెండేళ్ళుగా ఆ స్థానాన్ని ఇరాక్ భర్తీ చేసింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో సౌదీ కంటే ఇరాక్ 15 శాతం అధికంగా ముడి చమురును సరఫరా చేసింది. రిలయన్స్తో ఒప్పందం ద్వారా ఇతర ఉత్పత్తిదారుల నుంచి పోటీ ఎదుర్కొంటున్న ఆరామ్కోకు ఇక్కడి మార్కెట్లో యాక్సెస్ లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
చమురు మార్కెట్పై పట్టుకు రిలయన్స్ అండ
2018-19 ఆర్థిక సంవత్సరంలో భారత్కు ఇరాక్ నుంచి 46.61 మిలియన్ టన్నుల ముడి చమురు, సౌదీ అరేబియా నుంచి 40.33 మిలియన్ టన్నులు, ఇరాన్ నుంచి 24 మిలియన్ టన్నులు, అమెరికా నుంచి 6.4 మిలియన్ టన్నులు, రష్యా నుంచి 2.2 మిలియన్ టన్నుల చమురు ఎగుమతి అయింది. రష్యా, అమెరికాలు ఓ వైపు చొచ్చుకొస్తుంటే, రిలయన్స్ ఒప్పందం చమురు మార్కెట్పై పట్టును తిరిగి పొందేందుకు ఆరామ్కోకు ఉపయోపడుతుందని అంటున్నారు.
భారత్లో పెరుగుతున్న చమురు విక్రయం
భారత్ ముఖ్యంగా 85 శాతం క్రూడాయిల్ దిగుమతులపై ఆధారపడుతుంది. 2040 నాటికి వేగంగా అభివృద్ధి చెందుతున్న చమురు వినియోగదారుగా ఉంటుందని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అంచనా వేసింది. వుడ్ మెకంజీ ప్రకారం దేశం యొక్క చమురు వినియోగం రోజుకు 5 మిలియన్ బ్యారెల్స్. ఇది 2035 నాటికి 8.2 మిలియన్లకు చేరుకుంటుంది. ప్రస్తుతం భారత్లో చమురు డిమాండ్ గ్రోత్ 17,000 బ్యారెల్స్ ఉండగా 2020 నాటికి 2,25,000 బ్యారెల్స్ అవుతుందని అంచనా.