100 కోట్ల లావాదేవీలు... సత్తా చూపుతున్న రూపే కార్డు
గ్లోబల్ కార్డు లైన వీసా, మాస్టర్ కార్డులకు పోటీగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసిఐ) తీసుకువచ్చిన రూపే కార్డుల వినియోగం గణనీయంగా పెరిగిపోతోంది. బ్యాంకులు రూపే కార్డులను తమ కస్టమర్లకు ఎక్కువగా ఇస్తున్నాయి. వీటిద్వారా జరిగే లావాదేవీలు పెరిగి పోతున్నాయి.
డెబిట్ కార్డుల ద్వారా..
* గత మూడేళ్ళ కాలంలో మొత్తం డెబిట్ కార్డుల ద్వారా జరిగిన లావాదేవీల్లో రూపే కార్డు లావాదేవీలు వేగవంతంగా పెరిగిపోయాయి.
* రూపే కార్డును ఆన్ లైన్ లావాదేవీలకే కాకుండా దుకాణాల్లో కొనుగోళ్లు చేసినప్పుడు బాగానే వినియోగిస్తున్నారు. ఫలితంగా 2018-19 ఆర్థిక సంవత్సరంలో 100 కోట్లకుపైగా లావాదేవీలు నమోదయ్యాయి.
* 2017-18 సంవత్సరంలో నమోదైన లావాదేవీలతో పోల్చితే వృద్ధి దాదాపు 70 శాతంగా ఉండటం విశేషం.
* 2018 సంవత్సరంలో వృద్ధి అంతకు ముందు ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 135 శాతంగా ఉంది.
* 2019 ఆర్థిక సంవత్సరంలో వ్యాపారుల వద్ద చెల్లింపుల కోసం డెబిట్ కార్డులను 440 కోట్ల సార్లు వినియోగించారు. అంతకు ముందు సంవత్సరం (330 కోట్లు) తో పోల్చితే వృద్ధి 32 శాతంగా ఉంది. 2016-17 సంవత్సరంతో పోల్చితే 2017-18 సంవత్సరంలో వృద్ధి 40 శాతంగా ఉంది.
రూపే వాటా 33 శాతం
* కార్డు లావాదేవీల్లో రూపే మార్కెట్ వాటా ప్రస్తుతం 33 శాతంగా ఉంది.
* ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న 1,100కు పైగా బ్యాంకులు రూపే కార్డులను జారీ చేస్తున్నాయి. ఈ కార్డులనే జారీ చేయాలనీ ప్రభుత్వం ఏమీ నిబంధన విధించలేదు. కానీ బ్యాంకులు ఈ కార్డు జారీకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాయి.
* మాస్టర్ కార్డు, వీసా కార్డులతో పోల్చితే రూపే కార్డు చవకైనది. ఈ కార్డు ద్వారా జరిగే లావాదేవీలను దేశీయంగానే ప్రాసెస్ చేస్తారు.
* ఇప్పటికే 60 కోట్ల వరకు కార్డులు జారీ అయ్యాయి. వీటిలో దాదాపు సగం మధ్య, ప్రీమియం సెగ్మెంట్ కు సంబంధించినవి.
* 2017 ఆర్థిక సంవత్సరంలో రూపే కార్డు ద్వారా వినియోగదారులు చెల్లించిన మొత్తం రూ. 34,929 కోట్లు ఉండగా.. 2109 ఆర్థిక సంవత్సరంలో రూ. 65,429 కోట్లకు, 2019 సంవత్సరంలో రూ. 1.1 లక్షల కోట్లకు పెరిగిందని గణాంకాల ద్వారా తెలుస్తోంది.
ఎన్పీసిఐ ఆఫర్లు
* రూపే కార్డుల వినియోగాన్ని పెంచడానికి ఎన్పీసిఐ పలు రకాల ఆఫర్లను ఇస్తోంది.
* దాదాపు వెయ్యి వరకు ఆఫర్లను ఇస్తున్నట్టు రూపే వర్గాలు చెబుతున్నాయి.
* విదేశి విస్తరణలో భాగంగా ఇటీవలే జేసీబీ ఇంటర్నేషనల్ తో చేతులు కలిపి రూపే జేసీబీ గ్లోబల్ కార్డులను అందుబాటులోకి తెచ్చారు. స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ అఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంకు అఫ్ ఇండియా, ఆంధ్రా బ్యాంక్, సిటీ బ్యాంక్ తదితర బ్యాంకులు ఈ కార్డులను జారీ చేయనున్నాయి.
* ఇంటర్నేషనల్ కార్డుల కోసం ఇంతకు ముందే ఎన్ పీ సి ఐ డిస్కవర్ తో చేతులు కలిపింది.