16 ఏళ్లలో తొలిసారి: ఎయిర్టెల్కు రూ.2,866 కోట్ల నికర నష్టం
న్యూఢిల్లీ: టెలికం దిగ్గజం ఎయిర్టెల్ ఏప్రిల్ - జూన్ క్వార్టర్ 1కు గాను భారీ నష్టాలను నమోదు చేసింది. గురువారం మార్కెట్ ముగిసిన అనంతరం ప్రకటించిన ఫలితాల్లో రూ.2,866 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంలో రూ.97 కోట్ల నికర లాభం నమోదయింది. 16 ఏళ్లలో ఎయిర్టెల్ తొలి క్వార్టర్లో నష్టాన్ని నమోదు చేయడం ఇది మొదటిసారి. ఆపరేషన్స్ ఏకీకృత ఆదాయం 4.7 శాతం పెరిగి ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ పైన రూ.20,738 కోట్లు నమోదు చేసింది.
ఎయిర్ టెల్ జూన్ త్రైమాసికం చివరి నాటికి రూ.1,469.40 కోట్ల అసాధారణ నష్టాన్ని నమోదు చేసింది. గత ఏడాది ఇది రూ.362.10 కోట్లుగా ఉంది. ఎయిర్టెల్ కస్టమర్లు 2018 జూన్లో 45.66 ఉండగా, 2019 జూన్ నాటికి 40.37 కోట్లకు పడిపోయారు. ఆర్పు (యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్) రూ.129గా ఉంది. గత ఏడాది ఇదే క్వార్టర్లో రూ.105గా ఉంది. ముగిసిన గత మార్చి క్వార్టర్లో రూ.123గా ఉంది. ముఖేష్ అంబానీ రిలయన్స్ జియో డేటా, వాయిస్ కాల్స్ ఆఫర్ కారణంగా ఎయిర్ టెల్ సహా ఇతర టెలికం కంపెనీలు లాభాలు ఆర్జించలేకపోతున్నాయి.
కంపెనీ వైర్ లెస్ వ్యాపార ఆదాయం ఏడాదికి 4.1 శాతం పెరిగి ర.7,10,724 కోట్లకు చేరుకుంది. ఆపరేటింగ్ ఆదాయం రూ.11,270 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఈ విషయంలో ఎయిర్ టెల్ ను జియో అధిగమించింది. జియో రూ.11.679 ఆపరేటింగ్ రెవెన్యూ సాధించింది. ఎబిటా మార్జిన్లు ఈ త్రైమాసికంలో 6.4 శాతం పెరిగి 41 శాతానికి చేరుకున్నాయి. గత ఏడాది ఇదే త్రైమాసికంలో 34.5 శాతంగా ఉంది.
జియో ఎంట్రీతో ఎయిర్ టెల్ ఎదుర్కొంటున్న ఒత్తిడితో పాటు వ్యాపారంలో నిలదొక్కుకునేందుకు ఇతర టెలికం కంపెనీలతో నిరంతర పోరాటాన్ని ఈ ఫలితాలు ప్రతిబింబిస్తున్నాయి. ఎయిర్ టెల్ ఎండీ, సీఈవో (ఇండియా, సౌత్ ఏసియా) గోపాల్ విట్టల్ మాట్లాడుతూ.. మొదటి త్రైమాసికంలో తమ వ్యాపారాలు ఆరోగ్యకరమైన, సమానవృద్ధిని సాధించాయన్నారు. ఎయిర్ టెల్ థ్యాంక్స్ ద్వారా సేవలు అందించడంపై దృష్టి సారించామన్నారు. దీంతో వరుసగా రెండో క్వార్టర్లో ఆర్పు పెరిగిందన్నారు.