జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్, డీజిల్!! ఈ-వెహికిల్స్పై తగ్గింపు ఆలస్యం!
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ వంటి పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని అసోచోమ్ (అసోసియేటెడ్ చాంబర్స్ ఆప్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ) విజ్ఞప్తి చేసింది. వీటిని తప్పనిసరిగా జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాల్సిందేనని పలు సంస్థలు చెబుతున్నాయి. అలాగే, కొన్ని స్థానిక, రాష్ట్రాల పన్నులను కూడా జీఎస్టీలో విలీనం చేయాలని అసోచోమ్ గురువారం నాడు జీఎస్టీ మండలికి విజ్ఞప్తి చేసింది.
SBI క్లాసిక్ డెబిట్ కార్డ్ ఉందా: ఎన్నో లాభాలు... తెలుసుకోండి
పెట్రోల్ ఉత్పత్తుల ప్రభావం ఇతర వ్యాపారాలపై..
జీఎస్టీ అమల్లోకి వచ్చాక రెండేళ్లుగా పెట్రో ఉత్పత్తులకు వేరుగా పన్నులు విధించారని, పెట్రోల్, డీజిల్లు జీఎస్టీలోకి రాకపోవడం వల్ల ఆ ప్రభావం తమ వ్యాపారాలపై కూడా పడుతున్నాయని అసోచోమ్ ఆందోళన వ్యక్తం చేసింది. పెట్రోలియం ప్రభావం ఇతర వ్యాపారాలపై పడుతోందన్నారు. కాబట్టి వీటిని తప్పనిసరిగా జీఎస్టీలోకి తీసుకు రావాలన్నారు.
పెట్రోల్తో పాటు వీటినీ జిఎస్టీ పరిధిలోకి తేవాలి
పెట్రోల్, డీజిల్ ధరల ప్రభావం దాదాపు అన్నింటి వస్తువులపై ఉంటుందనే విషయం తెలిసిందే. జీఎస్టీ పరిధిలోకి తీసుకువస్తే వ్యాపార వృద్ధికి తోడ్పడుతుందన్నారు. అదేవిధంగా మండీ పన్ను, స్టాంప్ డ్యూటీ, రోడ్డు ట్యాక్స్, వెహికిల్ ట్యాక్స్లను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని అసోచోమ్ కోరింది. అలాగే, రెస్టారెంట్, రియల్ ఎస్టేట్కు కూడా జీఎస్టీ రిలాక్సేషన్ కోరింది.
ఎలక్ట్రానిక్ వాహనాలపై కీలక నిర్ణయం
గురువారం 36వ జీఎస్టీ కౌన్సెల్ భేటీ జరగాల్సింది. కానీ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ లోకసభలో ఉండటంతో వాయిదా పడింది. ఈ భేటీలో ఎలక్ట్రానిక్ వాహనాలకు జీఎస్టీపై కీలక నిర్ణయం తీసుకుంటారని భావించారు. కానీ భేటీ వాయిదా పడింది. మళ్లీ భేటీ తేదీని నిర్ణయిస్తారు. ఎలక్ట్రానిక్ వాహనాలను (ఈ-వెహికిల్స్) జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించే నిర్ణయం తీసుకుంటారని భావించారు.